మరాఠీలకు నో రిజర్వేషన్..
posted on May 5, 2021 @ 3:19PM
మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరాఠి సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆ వార్త తో మహారాష్ట్రలోని మరాఠి ప్రజలు ఒక్కసరిగా కలత చెందారు. గతంలో రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఇది అధిగమించిందని హై కోర్టు తెలిపింది. 2018లో మరాఠాలకు మహారాష్ట్ర సర్కార్ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16 శాతం రిజర్వేషన్ కల్పించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన కోర్టు రిజర్వేషన్లను సమర్థిస్తూ 2019లో తీర్పు వెలువరించింది. అయితే, కోటాను 16 శాతం నుంచి విద్యాసంస్థల ప్రవేశాల్లో 12 శాతానికి, ఉద్యోగ నియామకాల్లో 13 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తుది తీర్పును వెలువరించింది.
ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా మారాఠాలకు రిజర్వేషన్ కల్పించారని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. గతంలో పార్లమెంటు చేసిన ఓ సవరణ ప్రకారం.. ఒక వర్గాన్ని సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన జాబితా(ఎస్ఈబీసీ)లో చేర్చే హక్కు రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. రాష్ట్రాలు కేవలం ఆయా వర్గాలను గుర్తించి కేంద్రానికి సిఫార్సు మాత్రమే చేయాలని.. అనంతరం రాష్ట్రపతి వాటిని వెనుకబడిన వర్గాల జాబితాలో చేరుస్తారని వివరించింది. ఈ కోటా కింద ఇప్పటికే చేపట్టిన నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాలపై తాజా తీర్పు ప్రభావం ఉండబోదని.. వాటిని అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. మండల్ తీర్పుగా పేరొందిన ఇందిరా సాహ్నీ తీర్పు (1992)ను పునఃసమీక్షించాల్సిన అసవరం కూడా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.
కోర్టు నిర్ణయం పై మరాఠీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపలంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తాము అభివృద్ధికి మరింత దూరం అవుతామని ఆవేదన చెందుతున్నారు.