సారీ చెప్పిన సీఎం
posted on Mar 26, 2021 @ 3:29PM
ఆయనో ముఖ్యమంత్రి... దేశంలోనే అత్యంక కీలకమైన రాష్ట్రానికి అధిపతి. అయినా హుందాగా వ్యవహరించారు. అగ్నిప్రమాద ఘటనపై మానవతా దృక్ఫథంలో స్పందించారు. ప్రభుత్వ పెద్దగా పెద్ద మనుసుతో తప్పు జరిగిందని అంగీకరించారు. అంతేకాదు బాధిత కుటుంబాలను క్షమించమని కోరారు ముఖ్యమంత్రి. ప్రమాద ఘటనపై విచారణ జరిపించి.. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన ఆ ముఖ్యమంత్రి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే. ముంబైలోని ఓ కరోనా ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలాన్ని సందర్శించిన సీఎం.. మృతుల కుటుంబాలకు క్షమాపణలు తెలియజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
‘‘గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారిపై మనం పోరాటం సాగిస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభించిన సమయంలో బెడ్లు, వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. దీంతో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రమాదం చోటుచేసుకున్న సన్రైజ్ ఆస్పత్రి కూడా అందులో ఒకటి. ఈ హాస్పిటల్ లైసెన్స్ గడువు మార్చి 31 వరకు ఉంది. దురదృష్టవశాత్తూ ఈ ఆస్పత్రి ఉన్న మాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో 10 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటిస్తున్నా. ప్రమాదానికి కారణమైన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాలు నన్ను క్షమించమని కోరుతున్నా’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే విచారం వ్యక్తం చేశారు.
ముంబైలోని భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. మాల్లోని మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.. మూడో అంతస్తులో ఉన్న ఆస్పత్రి వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. అయితే తొలుత అగ్నిప్రమాదంలో రోగులెవరూ మరణించలేదని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆ తర్వాత కొంతమంది రోగుల ఆచూకీ గల్లంతైనట్లు వెల్లడించింది. ఈ ఘటన ముంబైలో తీవ్ర కలకలం రేపింది.
కనీస వసతులు లేని మాల్ లో కోవిడ్ హాస్పిటల్ నిర్వహించడంపై జనాలు పైరవుతున్నారు.