మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇంకా ఆరు సభల్లో..
posted on Apr 29, 2014 @ 3:06PM
నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో ఒక్క సభలో కలసి పాల్గొంటేనే ఇతర రాజకీయ పక్షాలు గుండెలు గుభేల్మన్నాయి. ఈ త్రిమూర్తుల కాంబినేషన్కి ప్రజల నుంచి లభిస్తున్న ప్రతిస్పందన చూసి తెలంగాణ కాంగ్రెస్ గుండె గుభేల్మంటే, టీఆర్ఎస్ లబోదిబో అని నెత్తీనోరూ బాదుకుంది. ఇకముందు ఇలా లబలబలాడే స్కీము సీమాంధ్ర కాంగ్రెస్ది, వైకాపాది కాబోతోందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ ముగ్గురూ కలసి సీమాంధ్రలో ఒకటి కాదు రెండు కాదు మూడు కూడా కాదు.. మొత్తం ఆరు బహిరంగ సభల్లో ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెస్, వైకాపాల పరిస్థితి అయోమయం జగన్నాథంలా వుంది. ఇప్పుడు బీజేపీ, టీడీపీ కూటమి ఈ స్థాయిలో ప్రచారం చేసిందంటే ఏం కొంప మునుగుతుందో అని సదరు కాంగ్రెస్, వైకాపా నాయకులు తల్లడిల్లుతున్నారు.