గాలి మళ్లీ జైలుకు?
posted on Sep 15, 2022 @ 1:00PM
బళ్లారి గనులను అక్రమంగా కొల్లగొట్టిన మైనింగ్ టైకూన్ గాలి జనార్ధన్ రెడ్డి త్వరలో మళ్లీ జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. గాలి మైనింగ్ అక్రమాల కేసు విచారణ ఇక వేగవంతం కాక తప్పని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. గాలి జనార్ధన్ రెడ్డి కేసు విచారణలో ఆమోదయోగ్యం కాని జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తాజా పరిస్థితిపై ఈ నెల 19లోగా సీల్డ్ కవర్ లో నివేదిక పంపాలని హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీం ఆదేశించింది. దీంతో కొంత కాలంగా షరతులతో కూడిన బెయిల్ పై స్వేచ్ఛగా ఉన్న గాలి మళ్లీ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని న్యాయ నిపుణులు అంటున్నారు.
గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ 12 ఏళ్లుగా ఆలస్యం కావడం సహించరానిదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తాము గతంలో విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినా జాప్యం ఎందుకు జరిగింది? విచారణ ఏ దశలో ఉంది? ఏ కారణాల చేత విచారణ ముందుకు సాగడంలేదో సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ లోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి సుప్రీం ద్విసభ్య ధర్మాసనం వాయిదా వేసింది.
ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మరో 9 మందిపై సీబీఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011సెప్టెంబర్ 5న జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్ లోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లకూడదనే షరతులతో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న జనార్ధన్ రెడ్డికి బెయిలు మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున బెయిలు షరతులను సడలించాలంటూ జనార్ధన్ రెడ్డి 2020లో మరోసారి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా ఆయా జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లకు తెలియజేసి బళ్లారి, కడప, అనంతపురం వెళ్లవచ్చని గత ఏడాది ఆగస్టు 19న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
ఈ నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంలో సీబీఐ అఫిడవిట్ వేసింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ను జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం(సెప్టెంబర్14) విచారించింది. గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారిలో ఉంటే సాక్షులకు ముప్పు అంటూ సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ వాదనలు వినిపించారు. గాలి జనార్ధన్ రెడ్డి స్వస్థలం బళ్లారి. ఆయన అక్కడ ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు. సాక్షుల ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ధర్మాసనానికి విన్నవించారు.
మాధవి దివాన్ వాదనపై స్పందించిన జస్టిస్ ఎం.ఆర్.షా సీబీఐ కేసు విచారణ ఏ దశలో ఉందని ప్రశ్నించారు. విచారణ సాగడం లేదని మాధవి దివాన్ బదులిచ్చారు. విచారణపై స్టే ఉందా.. అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గతంలో అయితే లేదని ఏఎస్ జీ సమాధానం ఇచ్చారు. గతం విషయం తాను అడగటం లేదని, ప్రస్తుతం స్టే ఉందా? అని జస్టిస్ షా ప్రశ్నించారు. దీనికి ఏఎస్ జీ వద్ద సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తీవ్రమైన అభియోగాలున్న ఈ కేసు నమోదైన 12 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ సీబీఐ కేసులు న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట సాగకపోవడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని సుప్రీం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ఆదేశాలతో గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు.