జూబ్లీ ఉప ఎన్నికల బరిలో 34 మంది అభ్యర్థులు

 

జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ ల స్క్రూటీనీ ప్రక్రియను బుధవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో  సాధారణ పరిశీలకులు రంజిత్‌ కుమార్‌ సింగ్‌ పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పకడ్బందీగా  నామినేషన్ ల స్క్రూటీనీ చేపట్టాలనీ రిటర్నింగ్ అధికారి పి సాయిరాం, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కాగా ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. భారీ స్థాయిలో నామినేషన్ లు దాఖలు కావడంతో నామినేషన్ల స్క్రూటీనీ అధిక సమయం పడుతుంది. అభ్యర్థులు తమ  నామినేషన్ ల ఉపసంహారణకు ఈ నెల 24  తేదీ వరకు ఈసీఐ అవకాశం ఇచ్చింది.

 జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లోకాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. చాలా నామినేషన్లు వచ్చినప్పటికీ.. పోటీ ఇ రెండు పార్టీల మధ్యనే ఉండటంతో వీరి నామినేషన్ల పరిశీలపై ఉత్కంఠతగా ఎదురు చూసారు కార్యకర్తలు. తన నామినేషన్‌పై బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని నవీన్ యాదవ్ తెలిపార. అన్నీ సక్రమంగా ఉండటంతో ఆర్వో ఆమోదించినట్లు తెలిపారు. 56 నామినేషన్లును ఎన్నికల అధికారులు తిరస్కరించారు. బరిలో 34 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదం తెలిపారు.
 

ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

  ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై  దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల పాయింట్లను సవాలు చేస్తూ పలువురు అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. 2023లో ఇచ్చిన గ్రూప్-2 నోటీఫికేషన్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శికాలను అనుగుణంగా సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.  ఈ మేరకు ఆ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పాత నోటిఫికేషన్‌కు బదులు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోరారు. రిజర్వేషన్ల పాయింట్లను సవాల్ చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాలు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, రిజర్వేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది.  

హైదరాబాద్‌లో జింక మాంసం విక్రయిస్తూ.. పోలీసులకు చిక్కిన నిందితుడు

  అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఓ వన్యప్రాణిని చంపి దాని మాంసాన్ని విక్రయించి డబ్బులు సంపాదించాలని ఓ కేటుగాడు చేసిన ప్రయత్నాన్ని రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు.. రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందానికి వన్యప్రాణిని చంపి దాని మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గా విశ్వసనీయమైన సమాచారం రావడంతో అత్తాపూర్ పరిధిలోని సులేమాన్‌నగర్ ప్రాంతంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ ఘటనలో సులేమాన్‌ నగర్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ఉద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 15 కిలోల జింక మాంసం, మూడు కత్తులు ఒక సెల్ ఫోన్‌తో పాటు అక్రమ విక్రయాల ద్వారా వచ్చినట్లు అను మానిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అడవుల్లో అక్రమంగా జింకలను వేటాడి, దాని మాంసాన్ని పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కొంతకాలంగా అత్తాపూర్ మరియు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా వన్యప్రాణుల మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అత్తాపూర్ పరిధిలో నిఘా పెట్టారు. అనుమానాస్పదం గా తిరుగుతున్న నిందితుడి పై నిఘా పెట్టి, సరైన సమయం కోసం వేచి చూశారు. నిందితుడు ఇతరులకు జింక మాంసాన్ని విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు...  ఎస్ఓటి బృందం నిందితుడిని మరియు స్వాధీనం చేసుకున్న మాంసాన్ని నగదును తదుపరి విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. అత్తాపూర్ పోలీసులు  వన్యప్రాణుల సంరక్షణ చట్టం (వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి ఈ అక్రమ వేటలో మరెవరైనా సహకరించారా? మాంసాన్ని ఎవరికి విక్రయిస్తున్నాడు? అనే కోణాల్లో పోలీసులు లోతైన విచారణ కొనసా గిస్తున్నారు.అడవిజంతువుల అక్రమ వేట, మాంసం విక్రయం వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుం టామని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.  

లంకతో టి20 సిరీస్‌.. క్లీన్‌స్వీప్‌పై భారత్ మహిళా క్రికెటర్ల ఫోకస్

శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో నాలుగు వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌తో.. ఈ ఏడాదికి గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పాలనుకొంటోంది. అయితే, ప్రత్యర్థి శ్రీలంక మంగళవారం జరిగే ఆఖరి, ఐదో టీ20లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత వరల్డ్‌కప్‌ సన్నాహకాల కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటించనుంది.  2024 టీ20 వరల్డ్‌కప్  లో గ్రూప్‌దశలోనే భారత్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే   హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్ తమ పంథాను మార్చుకొని దూకుడుగా ఆడుతూ  అన్ని జట్లకూ బలమైన ప్రత్యర్థిగా మారింది. ఈ సిరీస్‌లో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో.. తొలి మూడు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా పోయింది.  భారత్ ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతంగా రాణిస్తోంది. అయితే, భారత ఫీల్డింగ్‌  మాత్రం ఇంకా ఉన్నత ప్రమాణాలను అందుకోలేక పోవడం  ఆందోళనకరం. నాలుగో టీ20లో కూడా రెండు క్యాచ్‌లతోపాటు ఓ స్టంపింగ్‌ అవకాశాన్ని చేజార్చారు. కాగా, ఏడాది తర్వాత పేసర్‌ రేణుక సింగ్‌ పొట్టి ఫార్మాట్‌లోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వడం సానుకూలాంశం. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ నిలకడగా రాణిస్తుండగా.. ఈ సిరీస్ లో అరంగేట్రం చేసిన స్పిన్నర్‌ వైష్ణవి శర్మ ఆకట్టుకొంది. డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (48 బంతుల్లో 80) టచ్‌లోకి రావడంతో ఇండియా బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. వన్‌డౌన్‌కు ప్రమోట్‌ అయిన రిచా ఘోష్‌ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకుంది. జ్వరంతో బాధపడుతున్న జెమీమా రోడ్రిగ్స్‌ ఫిట్‌నెస్ పై ఎటువంటి సమాచారం లేదు. జట్టులోని అందరికీ అవకాశాలు లభించడంతో ఇక మిగిలిన 17 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కమలి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. గత మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయిన లంక.. నాలుగో మ్యాచ్‌లో ఛేదనలో దీటుగానే నిలిచింది. ఇదే ఆత్మవిశ్వాసంతో ఈ సిరిస్ ను  విజయంతో ముగించాలని చమరి ఆటపట్టు సేన పట్టుదలతో ఉంది.వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండడంతో టాస్‌ గెలిచిన టీమ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.

టోల్ ఎత్తివేత యోచనలో తెలంగాణ సర్కార్.. కేంద్ర అనుమతి కోసం లేఖ

సంక్రాంతికి ప్రజలంతా తమ సొంతూళ్లకు క్యూ కడతారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాలు, ప్రైవేట్ వెహికల్స్‌తో రోడ్లన్నీ   కిక్కిరిసి పోతాయి. ఇక టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంటుంది. ప్రతి ఏటా నగరాల నుంచి సొంతూళ్లకు ప్రయాణమయ్యే వారికి ఇది అనుభవైకవేద్యమే. అయితే ఈ సారి ఈ ఇబ్బంది లేకుండా చేయడానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లిపోయేందుకు వీలు కల్పించేలా వాహనాల టోల్‌చార్జీలను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ మేరకు నిర్ణయం అయితే తీసేసుకుందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ నిర్ణయానికి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని  కోరినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఈ నిర్ణయాన్ని అములు చేయడానికి సర్కార్ రెడీగా ఉంది.   ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, విజయవాడవైపు వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఉరట కలుగుతుందనడంలో సందేహం లేదు.  ఏటా సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర హైవేలన్నింటితో పోలిస్తే.. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65పై  రాష్ట్ర పరిధిలో ఉన్న పంతంగి, కొర్లపాడు టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటుందిద. ఈ నేపథ్యంలోనే.. పండగ వేళ హైవేలపై ట్రాఫిక్‌ జామ్‌లకు స్వస్తి పలికి, ప్రయాణికులు వేగంగా గమ్యం చేరేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. కాబట్టి.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల టోల్‌చార్జీలను తామే చెల్లిస్తామని., అందుకు అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసినట్లు తెలిసింది.

ఏపీలో ఇక 28 జిల్లాలు... పునర్‌వ్యవస్థీకరణ పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పూర్తైంది. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తారు. మదనపల్లె పేరుతో జిల్లా ఉండదు. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుంది. ప్రస్తుతమున్న అన్నమయ్య జిల్లా మూడు ముక్కలైంది. జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతారు. మిగిలిన రాయచోటిని అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గతనెల 27న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.  కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటులో ఎలాంటి మార్పులు లేవు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్వ్యవస్థీకరించనుంది. రెవెన్యూ శాఖ కొత్తగా 2 జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు, రెండు మండలాలు, ఇంకా కొన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలి నోటిఫికేషన్‌లో 5రెవెన్యూ డివిజన్లు ప్రకాశం జిల్లాలోని అద్దంకి, మడకశిర (సత్యసాయి), బనగానపల్లె (నంద్యాల), పీలేరు (మదనపల్లె), నక్కపల్లి (అనకాపల్లి) ప్రతిపాదించారు. అయితే నక్కపల్లికి బదులు అడ్డరోడ్డు జంక్షన్‌ను డివిజన్‌గా  ప్రతిపాదనను మార్చారు. ఇక అన్నమయ్య జిల్లా పేరు  కొనసాగుతుంది  కానీ స్వరూపమే మారనుంది. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లె కేంద్రంగా ఉంటుంది. కానీ అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేస్తారు. అన్నమయ్యలో రాయచోటి కొనసాగుతుంది. పలమనేరు డివిజన్‌లో ఉన్న చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లె డివిజన్‌లో విలీనం చేస్తారు. పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె మండలాలను రాయచోటి డివిజన్‌ నుంచి తీసి కొత్తగా ఏర్పాటు చేసే పీలేరు డివిజన్‌లో కలుపుతారు. చిట్టమూరు, వాకాడ మండలాలను తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట డివిజన్‌లోనే కొనసాగిస్తారు. రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోని కో డూరు, పెంగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేసి తిరుపతి రెవెన్యూడివిజన్‌లో కలుపుతారు. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూ రు డివిజన్‌లోని గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను నెల్లూరు జిల్లాలో కలుపుతారు. ప్రాథమిక నోటిఫికేషన్‌ ప్రకారం నెల్లూరు జిల్లాలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ మూడు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తారు. కలువాయిని ఆత్మకూరులో, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు డివిజన్‌లో కొనసాగిస్తారు. కందుకూరు డివిజన్‌లోని వరికుంటపాడు, కొండాపురం మండలాలను నెల్లూరు జిల్లా కావలి డివిజన్‌లో విలీనం చేస్తారు. రాజంపేట డివిజన్‌తో పాటు నందలూరు, వీరబల్లె, టి. సుండుపల్లె మండలాలను కడప జిల్లాలో విలీనం చేస్తారు. సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడపలోనే కొనసాగిస్తారు. కనిగిరి డివిజన్‌లో ఉన్న దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలు అద్దంకి డివిజన్‌ లో ఉంటాయి. అద్దంకిని ప్రకాశంలోకి తీసుకొచ్చి కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివనం అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ తొలి నోటిఫికేషన్‌ ఇచ్చారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు దీన్ని మార్చారు. పెద్ద హరివనం మండలం ఉండదు. దాని స్థానంలో ఆదోని-2 మండలం ఉంటుంది.

జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు కమిషనరేట్ల

హైదరాబాద్ మహానగరంలో  పోలీస్ పరిపాలనను మరింత పటిష్టంగా, సమర్ధవంతంగా మార్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లకు అదనంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసింది. ఇక నుంచి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ప్యూచర్ షిటీగా నాలుగు కమిషనరేట్లు ఉంలాయి. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 29) రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే   అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేక పోలీస్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ఎస్పీని నియమించింది.  తాజా ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో  అసెంబ్లీ, సెక్రటేరియట్, నగర వాణిజ్య కేంద్రంగా ఉన్న బేగంపేట, అంతర్జాతీయ రవాణాకు ముఖ్యమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, న్యాయ వ్యవస్థకు కేంద్రంగా ఉన్న బుద్వేల్ హైకోర్టు వంటి అత్యంత కీలక ప్రాంతాలు వచ్చాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, చట్ట పరిరక్షణ మరింత పటిష్టంగా మారనుంది. ఇక సైబరాబాద్ కమిషనరేట్‌కు ఐటీ, పారిశ్రామిక హబ్‌లు, ఐటీ కారిడార్ ప్రాంతాలైన బౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గలు వచ్చాయి.  అలాగే పరిశ్రమల కేంద్రాలైన పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్సీ పురం, అమీన్‌పూర్ వంటి ప్రాంతా లను కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కి తీసుకువచ్చారు. ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాచకొండ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరించి దాని పేరును మల్కాజ్ గిరి కమిషనరేట్ గా మార్చారు. తొలుత మహంకాళి లేదా లష్కర్ కమిషనరేట్ అన్న పేరును తీవ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు మల్కాజ్ గిరి కమిషనరేట్ గా నిర్ణయించింది.  ఈ కమిషనరేట్ పరిధిలో కీసర, శామీర్‌పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లితో పాటు ఉత్తర హైదరాబాద్‌కు చెందిన పలు  ప్రాంతాలు చేరనున్నాయి. వేగంగా పెరుగుతున్న నివాస ప్రాంతాలకు అనుగుణంగా పోలీస్ సేవలను మరింత దగ్గరగా తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే భవిష్యత్ లో అభివృద్ధి కేంద్రంగా మారనున్న ప్రాంతాల కోసం ప్రభుత్వం  ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ కమిషనరేట్ పరిధిలోకి చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు వచ్చాయి.  భవిష్యత్‌లో పెద్ద ఎత్తున పారిశ్రామిక, వాణిజ్య, నివాస అభివృద్ధి జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా ప్రణాళికగా ఈ కమిషనరేట్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.  ఇక పోతే యాదాద్రి భువనగిరి జిల్లాను ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి, అక్కడ ప్రత్యేకంగా  ఎస్పీ ని నియమించింది. ఆలయ ప్రాంతం కావడం, ప్రజా రద్దీ అధికంగా ఉండటంతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ అవసరమన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంది.  

తెలంగాణ పోలీస్ శాఖలో కీలక బదిలీలు

తెలంగాణ పోలీస్ శాఖలో విస్తృత పునర్వ్యవస్థీకరణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదలీ చేసింది. అలాగే పోస్టింగ్‌లను ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన పోలీస్ కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జి. సుధీర్ బాబును కొత్తగా ఏర్పాటు చేసిన  ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు పోలీస్ కమిషనర్‌గా నియమించింది.   అలాగే  సైబరా బాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న  అవినాష్ మొహంతిని  రాచకొండ పోలీస్ కమిషనరేట్ పున ర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు  కమిషనర్‌గా నియమించింది. ఇక పోతే .ఇక, ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్), పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఐజీపీ (స్పోర్ట్స్) బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. రమేష్   సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు  కమిషనర్‌గా నియమించింది.  అదే విధంగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న  అక్షాన్స్ యాదవ్, ఐపీఎస్ (2019 బ్యాచ్) ను  నియమించింది. 

పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ..కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్

దేశంలోనే అతి పెద్ద నగరంగా ఆవిర్భవించనున్న హైదరాబాద్ మహానగరంలో పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 29) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.  పాలనా సౌలభ్యం లక్ష్యంగా  జీహెచ్‌ఎంసీ పరిధికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్ల సర్వరూపం, సరిహద్దులను మార్చింది. ట్యాంక్‌బండ్ నుంచి శంషాబాద్ వరకు హైదరాబాద్ కమిషనరేట్  ఏర్పాటు చేసింది.   సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణపై హోం శాఖ, డీజీపీ, ముగ్గురు కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారు పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి చేసిన తుది ప్రతిపాదనలకు సర్కార్ ఓకే చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మేరకు  జీహెచ్‌ఎంసీ వార్డులు, సర్కిళ్లు, జోన్ల ఆధారంగానే పోలీస్ స్టేషన్లు, డివిజన్లు, జోన్ల ఉంటాయి.    ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న 16 పోలీస్ జోన్లను, జీహెచ్‌ఎంసీ జోన్లకు అనుగుణంగా 12కు కుదించారు.    ప్రస్తుతం రాచకొండ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జోన్‌ను తొలగించి  దానిని ప్రత్యేక జిల్లా ఎస్పీ పరిధిలోకి తీసుకువచ్చారు.   ఈ పునర్వ్యవస్థీకరణతో, కమిషనరేట్ల పరిధులు  మారిపోయాయి.   శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఉన్న పోలీస్ స్టేషన్లను   హైదరాబాద్ కమిషనరేట్‌ విలీనమయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పేరును  మహంకాళి లేదా  లష్కర్ కమిషనరేట్ గా మార్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.   సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు ప్రాంతంలోని కొన్ని పోలీస్ స్టేషన్లను సైబరాబాద్‌లో విలీనం అయ్యాయి. క మరోవైపు ట్యాంక్‌బండ్‌ నుంచి ప్రస్తుతం ఉన్న కొన్ని ఠాణాలతో పాటు సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలోని పలు పోలీస్‌ స్టేషన్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌లో కలిపింది. ముఖ్యంగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఉన్న పోలీస్‌ స్టేషన్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ఆదిభట్ల‌, సనత్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్‌, బాలాపూర్‌ తదితర ఠాణాలు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో విలీనం అవుతాయి. ఈ మూడుకమిషనరేట్ లకు అదనంగా గా ఫ్యూచర్ సిటి కమిషనరేట్ ను ఏర్పాటు చేసి.. ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించింది.  

ముక్కోటి ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలన్నీ భక్తజనకోటితో కిక్కిరిసిపోయాయి. దేవాలయాలతో వైకుంఠ ద్వార దర్శనాలకు అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు.  తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం (డిసెంబర్ 29) అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి అంటే  12గంటలు దాటిన తరువాత నుంచీ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించారు.  వేకువజామున 1.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను  ఉత్తర ద్వార దర్శనం ద్వారాదర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిచ్చారు.  అలాగే చిన్న తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన  ద్వారకా తిరుమలలో ఈ తెల్లవారు జామునుంచే ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం ఐదున్నర నుంచి శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు అనుమతించారు.  భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.   ఇక సింహాచలంలో  శ్రీవరాహా లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.   అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రసిద్ధ ఆలయాలలోనూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దేవదేవుడిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు.  అదే విధంగా తెలంగాణలోని అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయాలన్నీ కిటకిట లాడు తున్నాయి.  రాష్ట్రంలోని   భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్  తొలి మహిళా ప్రధానని బేగం ఖలీదా జియా మంగళవారం డిసెంబర్ 30) కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లు. గత కొంత కాలంగా   అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బేగం ఖలీదా జియా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.    కాలేయ వ్యాధి, కీళ్ల నొప్పులు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షిణించడంతో గత కొంత కాలంగా ఆమె ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు.   బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ భార్య అయిన ఖలీదా జియా.. తన భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి అజేయ శక్తిగా ఎదిగారు. బంగ్లాదేశ్ ప్రధానిగా మూడు సార్లు  బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు విశేషంగా కృషి చేశారు.  ఆమె మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.   ఖలీదా మరణించిన సమయంలో ఆమె కుమారుడు, బీఎన్‌పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్, కోడలు జుబైదా రెహమాన్, మనవరాలు జైమా రెహమాన్, పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. బేగం ఖలీదా జియాకు ఇండయాతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె జన్మించినది ఇండియాలోనే.   1947లో దేశ విభజన  తర్వాత ఆమె కుటుంబం ప్రస్తుత బంగ్లాదేశ్ కు వలస వెళ్లింది.   1991లో బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదా జియా చరిత్ర సృష్టించారు. ముస్లిం ప్రపంచంలో బెనజీర్ భుట్టో తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.  మూడు పర్యాయాలు బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రధానిగా పనిచేసిన ఆమె ఆ దేశ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. బేగం ఖలీదా జియా మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోడీ సహా, పలు దేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.