హైదరాబాద్లో జింక మాంసం విక్రయిస్తూ.. పోలీసులకు చిక్కిన నిందితుడు
posted on Dec 30, 2025 @ 1:41PM
అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఓ వన్యప్రాణిని చంపి దాని మాంసాన్ని విక్రయించి డబ్బులు సంపాదించాలని ఓ కేటుగాడు చేసిన ప్రయత్నాన్ని రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు.. రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందానికి వన్యప్రాణిని చంపి దాని మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గా విశ్వసనీయమైన సమాచారం రావడంతో అత్తాపూర్ పరిధిలోని సులేమాన్నగర్ ప్రాంతంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ ఘటనలో సులేమాన్ నగర్కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ఉద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 15 కిలోల జింక మాంసం, మూడు కత్తులు ఒక సెల్ ఫోన్తో పాటు అక్రమ విక్రయాల ద్వారా వచ్చినట్లు అను మానిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు అడవుల్లో అక్రమంగా జింకలను వేటాడి, దాని మాంసాన్ని పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కొంతకాలంగా అత్తాపూర్ మరియు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా వన్యప్రాణుల మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అత్తాపూర్ పరిధిలో నిఘా పెట్టారు. అనుమానాస్పదం గా తిరుగుతున్న నిందితుడి పై నిఘా పెట్టి, సరైన సమయం కోసం వేచి చూశారు. నిందితుడు ఇతరులకు జింక మాంసాన్ని విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు...
ఎస్ఓటి బృందం నిందితుడిని మరియు స్వాధీనం చేసుకున్న మాంసాన్ని నగదును తదుపరి విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. అత్తాపూర్ పోలీసులు వన్యప్రాణుల సంరక్షణ చట్టం (వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి ఈ అక్రమ వేటలో మరెవరైనా సహకరించారా? మాంసాన్ని ఎవరికి విక్రయిస్తున్నాడు? అనే కోణాల్లో పోలీసులు లోతైన విచారణ కొనసా గిస్తున్నారు.అడవిజంతువుల అక్రమ వేట, మాంసం విక్రయం వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుం టామని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.