గాలిలో దీపంలా వీఆర్ఏల జీవితాలు.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని కేసీఆర్ సర్కార్
posted on Sep 5, 2022 @ 2:28PM
డిమాండ్ల పరిష్కారం కోసం గత నెల రోజులకు పైగా సమ్మెలో ఉన్న వీఆర్ ఏను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. గత 42 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్ ఏప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా తెలంగాణ సర్కార్ కు చీమ కుట్టడం లేదు. సమ్మెలో ఉన్న వీఆఆర్ ఏలలో ఇప్పటి వరకూ ఇరవై మంది మరణించారు.
వారి మరణాలకు వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ.. సమ్మె కాలంలో ఇలా వరుసగా వీఆర్ఏలు మరణించడం పట్ల మాత్రం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతున్నది. మరణించిన వీఆర్ఏలలో అత్యధికులు ఉద్యోగ భద్రతపై ఆందోళనతో మనస్తాపానికి గురై గుండె పోటుతో మరణించారని అంటున్నారు. మిగిలిన వారు అనారోగ్యం, ప్రమాదాలు వంటి కారణాలతో అసువులు బాసారని చెబుతున్నారు. అయితే సమ్మెలో ఉన్న వీఆర్ఏలలో మాత్రం తమ సహచరుల వరుస మరణాలు ఆందోళన నింపుతున్నాయి.
అయినా తాము తగ్గేదేలే అంటున్నది వీఆర్ఏ రాష్ట్ర సంఘం చెబుతోంది. డిమాండ్లు నెరవేరేదాకా సమ్మె విరమించబోమని వీఆర్ఏల రాష్ట్ర సంఘం స్పష్టం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,245 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో 19,345 మంది నిజాం కాలంలో పనిచేసినవారినుంచి వారసత్వంగా వచ్చిన ఉద్యోగాలు నిర్వహిస్తుండగా.. మిగిలిన 2,900 మంది ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్గా నియుక్తులయ్యా రు. వీరంతా తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించి, పేస్కేలు, ఆరోగ్య బీమా, పింఛన్, పదోన్నతులు.. తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఈ ఏడాది జూలై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా తమకు పేస్కేలు అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే తమలో పీహెచ్డీలు, పీజీలు, ఎంటెక్, బీటెక్ వంటి ఉన్నత చదువులు ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2016లో వీరికి పదోన్నతి కల్పించాల్సి ఉన్నా.. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా అది వాయిదాపడింది.
అనంతరం 10 జిల్లాలు 33 అయ్యాయి. 42 రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కు చేరింది. మండలాలు 466 నుంచి 594 అయ్యాయి. ఈ పెంపునకు సరిపడా కొత్తగా వీఆర్ఏలను రిక్రూట్ చేయలేదు. పైగా ఇటీవల ధరణిని ప్రవేశపెట్టే సమయంలో దాదాపు 5,500 మంది వీఆర్వోలను తొలగించారు. దాంతో వారి పని కూడా వీరే చేయాల్సి వస్తోంది. దీంతో తమకు కనీస హక్కులు అమలు కావడం లేదన్న ఆందోళనలో ఉన్న వారంతా సమ్మెకు దిగారు.