కాంగ్రెస్ లో చేరికల గ్రాఫ్ పైపైకి..
posted on Jun 23, 2023 @ 12:20PM
భారత్ జోడో యాత్ర వల్లనేమి.. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో భారీ విజయం వల్లనేమి.. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత వల్లనేమి.. కాంగ్రెస్ మాంచి ఊపు మీదుంది. ఆ పార్టీలో చేరికలు, వలసలు సైతం.. భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల అనూహ్యంగా రేసులోకి వచ్చిన కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. భారీ స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ముఖ్యంగా .. బీఆర్ఎస్ లో అసంతృప్తులు, సీట్లు దక్కని వారు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. అయితే కాంగ్రెస్ లోకి వచ్చేవారు చాలావరకు ప్రజా బలం ఉన్నవారు కావడం విశేషం. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారు. తాజాగా ఆ ఇద్దరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ ఇద్దరుతో కొందరు కీలక నేతలు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. అటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాధ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, కొడంగల్ మునిసిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరితోపాటు ఖమ్మంకు చెందిన పలువురు నాయకులు, మరోవైపు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఎం.రఘునాథ్యాదవ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంకా కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. పొంగులేటి వర్గం నుంచి భారీ చేరికలు ఉండనున్నాయి.
ఇటు షర్మిల అంశం కూడా చర్చకు వస్తుంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి ముందుకెళుతున్న ఆమె..కేసిఆర్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతుంది. ఇదే సమయంలో ఈ మధ్య ఆమె కర్నాటక డిప్యూటీ సిఎం డికే శివకుమార్ని కలిశారు..అక్కడ గెలిచినందుకు అభినందనలు తెలియజేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం ఉంది. కానీ పార్టీ పెట్టింది..వేరే పార్టీలో విలీనం చేయడానికి కాదని షర్మిల ఇటీవల చెప్పారు. అటు రేవంత్ సైతం..షర్మిల ఏపీకి చెందిన వారు అని అక్కడ కాంగ్రెస్ లో చేరితే తమకు అభ్యంతరం లేదని అన్నారు.ఇదే క్రమంలో కాంగ్రెస్ జాతీయ నేత కేసి వేణుగోపాల్ తో షర్మిల భేటీ అయ్యారని తెలిసింది. దీంతో ఆమె కాంగ్రెస్ లోకి వస్తారనే ప్రచారం పెరిగింది. త్వరలో ఆమె కాంగ్రెస్ లో చేరే వార్త రావచ్చు. ఎందుకంటే.. రాజకీయ పొత్తులు..ఎత్తుల్లో.. ఎప్పుడు ఏం జరుగుతుందనేది.. చెప్పలేం కదా..!