తిరుపతి ఉప ఎన్నికలో జనసేన సింబల్.. బీజేపీలో టెన్షన్
posted on Apr 4, 2021 @ 4:49PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అధ్యక్షుడిగా ఉన్న జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్. 2019 సార్వత్రిక ఎన్నిక్లలో గాజు గ్లాస్ సింబల్ తోనే జనసేన ప్రచారం చేసింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అని జనాలు కూడా ఫిక్సయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతు ఇస్తోంది జనసేన. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీలో ఉన్నారు. జనసేన నేతలు బీజేపీతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. రత్నప్రభ గెలుపు కోసం శనివారం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఆ రెండు పార్టీలకు తిరుపతిలో కొత్త సమస్య వచ్చి పడింది. జనసేన పోటీలో లేకున్నా గాజు గ్లాసు గుర్తు మాత్రం తిరుపతి ఉప ఎన్నికలో కనిపిస్తోంది. జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజుగ్లాసును నవతరం పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించింది. దీంతో జనసేన ఓట్లు క్రాస్ అవుతాయని బీజేపీ ఆందోళన చెందుతోంది. పవన్ ప్రచారానికి రావడంతో బీజేపీలో కొత్త ఆశలు చిరుగించాయి. ఇంతలోనే ఆ పార్టీ గాజుగ్లాసు రూపంలో ఉపద్రవం వచ్చి పడింది.
జనసేన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఇంకా హోదా రాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్కు కేటాయించారు. జనసేన అధ్యక్షుడు పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున తమ పార్టీ అభ్యర్ధికి గాజుగ్లాసు గుర్తు కేటాయించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వివరణ ఇచ్చారు. ఇప్పటికే జనసేనాని ఎంట్రీతో ఊపు వచ్చిందని అనుకుంటున్న బీజేపీకి ఈ వార్త షాకిచ్చింది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.