ఏపీ ఉద్యోగులకు జీతాల్లేవ్!
posted on Apr 4, 2021 @ 3:01PM
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. నిధులు ఉద్యోగులకు లేక జీతాలు కూడా ఇవ్వలేలపోతోంది. ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాల్సి ఉండగా.. నాలుగు రోజులైనా ఇంకా ఇవ్వలేదు. ఏపీలో మొత్తం 4.5 లక్షల ఉద్యోగులకు వేతనాలు, 3.5 లక్షల పెన్షనర్లకు పెన్షన్లు అందలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను గవర్నర్ ఆమోదించినా పద్దులకు నిధులు సర్దుబాటు కాలేదు. సరిపడా నిధులు లేకపోవడంతో ఆర్థికశాఖ నుంచి ఆర్బీఐకి బిల్లులు అందలేదు. దీంతో నిధుల లభ్యత బట్టే ఆర్థికశాఖ అధికారుల చెల్లింపులు జరపనుంది.
బ్యాంకులకు వరుస సెలవులతో ఆయా ఖాతాల్లో చెల్లింపులు నమోదు కాలేదు. ఈ పరిస్థితులన్నీ చక్కబడేకి ఇంకో రెండు నుంచి మూడ్రోజులు పడుతుందని తెలుస్తోంది. ఈ నెల 6 లేదా 7 తేదీల్లో జీతాలు చెల్లించే అవకాశం ఉందని సమాచారం. జీతాలు అందిన తర్వాత పెన్షన్లు వచ్చే అవకాశముందట.
ఏపీలో ప్రస్తుతం... ఉద్యోగుల జీతాలా? సంక్షేమ పథకాలా? ఏది ముఖ్యం అని ప్రశ్నించుకుని, ప్రాధాన్యాలు నిర్ణయించుకోవాల్సి వస్తోంది. పథకాలు అమలు చేస్తే వేతనాలు ఇవ్వలేరు. జీతా లు ఇస్తే పథకాలు అమలు చేయలేరు. అందుకే... జీతాల చెల్లింపుల కోసం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రెండింటికీ ఒకేసారి నిధులు సర్దుబాటు చేయడం ఖజానాకు తలకు మించిన భారమవుతోంది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. పింఛనుదారులకూ ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ ప్రభుత్వ సొమ్మును పప్పుబెల్లాలుగా పంచిపెడుతున్నారు. ‘జీతాలు- ఉచితాలు’ ఏవి ముఖ్యమో ప్రజలు గమనించాలి. రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి ఎంతో దూరంలో లేదు’’ అని రఘురామకృష్ణరాజు విమర్శించారు.