ఆరులేన్లుగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణ

ఉభయ తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకమైన  హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 విస్తరణ పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లేన్ల రహదారిగా విస్తరించేందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)  నవంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ ముగించి నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.  తెలంగాణలోని దండుమల్కాపూర్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మొత్తం 231.32 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరణ జరగనుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.10,391.53 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తంలో  నిర్మాణ పనులకు రూ.6,775.47 కోట్లు, భూసేకరణ తదితర అవసరాలకు రూ.3,616.06 కోట్లుగా చెబుతున్నారు.   

ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పరిధిలో కొత్తగా 162 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనికి సుమారు రూ.1,414 కోట్లు అవసరమని అధికారులు అంచనావేశారు. భూసేకరణ, ఇతర అడ్డంకులపై చర్చించేందుకు   ఎన్‌హెచ్‌ఏఐ, రోడ్లు-భవనాల శాఖ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. డీపీఆర్‌ను ఖరారు చేసేందుకు వీలుగా రహదారి మార్గంలోని విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇతర నిర్మాణాల వివరాలను ఈ నెలాఖరు నాటికి  సేకరించి..  తుది డీపీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. 

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతులు దుర్మరణం

అమెరికా లో  జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాలకొల్లు వాసులు కొటికల పూడి కృష్ణ కిషోర్, ఆశ దంపతులు గత దశాబ్ద కాలంగా అమెరికాలో నివసిస్తున్నారు. కృష్ణ కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కృష్ణకిషోర్, ఆశ దంపతులు అక్కడికక్కడే మరణించగా, వారి పిల్లలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే భారత్ కు వచ్చి, తిరిగి అమెరికాకు వెళ్లిన వీరు.. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురి కావడం వారి స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  

అసోంలో కంపించిన భూమి.. త్రిపుర, మేఘాలయలో కూడా

అస్సాంలో  సోమవారం (జవవరి 5) తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్కర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఈ భూకంప ప్రభావంతో త్రిపురలో కూడా పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ భూకంప తీవ్రత అసోంతో పోలిస్తే త్రిపురలో చాలా స్వల్పంగా ఉంది. త్రిపురలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. ఇక పోతే మేఘాలయలోని పలు ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఆలా ఉండగా ఈ భూకంపం కారణంగా ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.  

ఉగ్రవాదంపై అమెరికా అపేక్ష.. ఉపేక్ష ఎందుకు?

నార్కో టెర్రరిజం అంటూ ఒక దేశాధ్యక్షుడినే అత్యంత అమానవీయంగా ఆ దేశంపై మెరుపుదాడి నిర్వహించి మరీ అరెస్టు చేసిన అమెరికా ప్రపంచ దేశాలలో మారణహోమం సృష్టించిన టెర్రరిస్టుల విషయంలో ఎందుకు అపరిమితమైన ఆపేక్ష చూపుతుంది. ప్రపంచంలో ఏం జరిగినా అందుకు కర్తా, కర్మా, క్రియా తానేనన్నట్లుగా అమెరికా ఎందుకు అనవసర ఆడంబరం, అనవసర పెద్దరికాన్ని ప్రదర్శిస్తుంది? ఈ ప్రశ్నలకు అమెరికా రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచీ ఇలా తయారైందన్న బదులు వస్తుంది.  అమెరికా తొలుత ఇలా ఉండేది కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ అమెరికాను తమతో పాటు పాల్గొనాల్సిందిగా కోరింది. అయితే అందుకు అమెరికా నిరాకరించడమే కాదు.. కనీసం బ్రిటన్ కు మిత్రదేశంగా ఉండటానికి కూడా ముందుకు రాలేదు.  అయితే కానీ ఎప్పుడైతే పెర్ల్ హార్బర్ ఘటన జరిగిందో ఆనాటి నుంచి అమెరికా ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. అప్పటి వరకూ వస్తు ఉత్పత్తిపైనే దృష్టి  కేంద్రీకరించిన అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కి తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన కొద్దదీ.. ఆయుధాల తయీరీవైపు మళ్లింది. అణుబాంబు తయారు చేసి ఆ యుద్ధానికి బెస్ట్ ఫినిషర్ గా నిలిచింది. అక్కడి నుంచీ తమ దేశ భద్రతకు ఆయుధ తయారీని  ఒక ప్రామాణికంగా పెట్టుకుంది. దానికి తోడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉత్తత్తి చేసిన ఆయుధాల నిల్వ భారీగా ఉండటంతో.. ప్రపంచంలో ఏ చిన్న సమస్య తలెత్తినా అక్కడికి తగుదునమ్మా అంటూ వెళ్లి,  ఆ దేశ సమస్యల్లో వేలు పెట్టి.. తన ఆయుధాల విక్రయానికి ఆ సమస్యలను అలంబనగా చేసుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగమే వియత్నాం, గల్ఫ్, సిరియాయుద్ధాలు. ఆ మాటకొస్తే భారత్- పాక్, రష్యా- ఉక్రెయిన్,  చైనా- తైవాన్ ఇలా ఏ రెండు దేశాల మధ్య చిన్న ఘర్షణ ఏర్పడ్డా తనదైన శైలిలో.. జోక్యంొ చేసుకుంటూ తనకు తానే ప్రపంచ దేశాలకు పెద్దన్న అన్నట్లుగా వ్యవహరిస్తోంది.    అమెరికా  వ్యవహారశైలి ఎలాంటిదో ఒక దళారి పశ్చాత్తాపం వంటి పుస్తకాలు చదివితే మనకు ఇట్టే తెలిసిపోతుంది. అంతగా ప్రపంచ రాజకీయాలను శాసించడం ప్రారంభించింది అమెరికా. ఇక ఇంధనం కారణంగా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం అనే ఒకానొక వ్యసనం కూడా అమెరికాకు పట్టుకుంది.  దీంతో ఆయా చిన్నా చితకా దేశాల వెంట పడడం.. వాటి సహజవనరులపై కన్నేయడం అమెరికాకు పరిపాటిగా మారింది. చివరికి గల్ఫ్ దేశాలపైనా అమెరికా ఆధిపత్యం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వారి పెట్రో డాలర్లన్నీ తమ ట్రెజరీల్లో భద్రంగా ఉంచుకుని.. ఆపై వారిని తమ గుప్పెట్లో పెట్టుకుంది. అంతగా ఇతర దేశాల్లో కాళ్లు, వేళ్లు, తలా దేర్చేసి వాటిపై ఆధిపత్యం చెలాయించడం అమెరికాకు రివాజైపోయింది.  తమ మాట వినని దేశాల్లో కుల మత విద్వేషాలను రాజేసి మరీ వాటిని తన దారికి తెచ్చుకోవడానికి అమెరికా వెనుకాడదు. అనుకున్న ఫలితం సాధించడం అమెరికా తన అగ్ర నాయకత్వంలో ఒక భాగం చేసుకుంది. ఈ విషయంలో అమెరికాకు చైనా, రష్యా, భారత్ లు కూడా మినహాయింపు కాదు.  ఇవాళ వెనిజువెల విషయంలో నార్కో టెర్రరిజం పేరిట ఆ దేశ అధ్యక్షుడు మదురో ని అరెస్టు చేసిన అమెరికా.. పాక్ లో  ఉగ్రవాదం వెయ్యి తలలు వేస్తున్నా కిమ్మనడం లేదంటే.. ఏమనుకోవాలి.  స్వయానా అమెరికా కూడా పాక్ ప్రేరేపిత ఉగ్ర బాధిత దేశాల్లో ఒకటి. అయినా అమెరికా పాక్ ఒంటిపై ఈగ వాలకుండా కాపాడటమే కాకుండా, ఆ దేశం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి భారీ రుణాలతో ఆదుకుంటోంది. కానీ అదే అమెరికా వెనిజువేలా అధ్యక్షుడు మదురో పై 50 మిలియన్ డాలర్ల రివార్డ్ ఉందనీ, అందుకే అరెస్టు చేశామనీ చెప్పుకుంటోంది.  కానీ, హఫీజ్ సయీద్ వంటి వారిపైనా ఇలాంటి రివార్డ్ లే ఉన్నా వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదు?    పాకిస్థాన్ కి అమెరికా ఇప్పిస్తున్న  వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ లోన్ల నుంచి మసూద్ అజర్ వంటి టెర్రరిస్ట్ బాసులకు భారీగా నిధులు అందుతున్నా.. ఎందుకు చోద్యం చూస్తున్నట్టు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పాక్ ఆర్మీని గాజాలో దింపేందుకే ఈ నజరాలు, సానుభూతి అని పరిశీలకులు అంటున్నారు. అదే నిజమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  అమెరికా ధ్వంస రచన ఇంకెంత కాలం సాగుతుందో చూడాలంటున్నారు అంత ర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

వెనుజువెలా.. అసలేం జరుగుతోంది?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా జరుగుతున్న హాట్ డిస్కషన్ ఏమిటంటే.. అసలు వెనిజువేలాలో ఏం జరుగుతోంది? ఈ నెల 3న అంటే శనివారం అమెరికన్ ఆర్మీ మెరుపుదాడి జరిపివెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి అమెరికాకు తరలించింది.  ఈ సందర్భంగా వెనిజువేలా  రాజధాని కకరాకస్ లో భారీ పేలుళ్లు జరిగాయి. విద్యుత్ గ్రిడ్ లు ధ్వంసమయ్యాయి. దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫోన్ చార్జింగ్ కోసం జనం బారులు తీరారు.  అమెరికా అద్యక్షుడు ట్రంప్ దీన్ని అమెరికన్ సైనిక శక్తి అద్భుత ప్రదర్శ నగా అభివర్ణిస్తూ తన భుజాలను తానే చరుచుకున్నారు. ఇక వెనిజువేలాలో అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని ప్రకటించారు.   అయితే మదురో బదులు తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని అంటు న్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కొరినా మచాడో తర్వాతి అధ్యక్షురాలయ్యే  చాన్సుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే అదేమీ జరిగేలా కనిపించడం లేదు.. ఎందుకంటే   కొరినా మచాడో నునోబెల్ స్వీకారానికి కూడా అవకాశం దొరకని ఇబ్బందికర  పరిస్థితులను ఎదుర్కు న్నారు. ప్రస్తుతం మదురోను అమెరికా అరెస్టు చేయడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. భారత్ అయితే వెనుజువెలా వెళ్లే వారు అత్యవసరమైతే తప్ప వెళ్ల వద్దని ట్రావెల్ కాషన్ జారీ చేసింది. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అయిన డెల్టా ఫోర్స్ .. ఆపరేషన్ ఆబ్సల్యూట్ రిజాల్వ్  పేరిట రాజధాని కరాక స్‌లో భారీ సైనిక దాడి చేసింది. ఈ దాడిలో మదురో నివాసంపై హెలికాప్టర్లతో దాడి చేసి, మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుంది. మదురో దంపతులను ముందుగా యుఎ స్ఎస్ ఐవో జిమా యుద్ధ నౌకలోకి, ఆ తరువాత న్యూయార్క్‌లోని స్టూవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేర్చారు. ప్రస్తుతం మదురో బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. మదురోపై 2020 నుంచి అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఇండిక్ట్‌మెంట్ ఆధారంగా.. నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, మెషిన్‌గన్స్ ఇతర డిస్ట్రక్టివ్ డివైసెస్ పొజెషన్ వంటి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే  మదురోపై  50 మిలియన్ రివార్డ్ ప్రకటించింది అమెరికా. ఇప్పుడు మదురోను మెరిపుదాడి చేసి మరీ అరెస్టు చేసింది.  అరెస్ట్ సమయంలో మదురో ఇంట్లో నిద్రిస్తున్నారని, అతడి నుంచి  ఎలాంటి  ప్రతిఘటన లేకుండానే బంధించారనీ తెలుస్తోంది. అయితే అరెస్టు తర్వాత   మదురో చేతులకు సంకెళ్లతో అమెరికా ఆఫీసర్ల మధ్య నడుస్తున్న దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అ య్యాయి. మదురో అరెస్టును  . చైనా, రష్యా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయిజ అయితే కొన్ని దేశాలు ఈ అరెస్టును స్వాగతించాయి. ఇలా ఉండగా మదురో అరెస్టు అంశంపై  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. 

పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరు?!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసినట్లుగా పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరంటూ బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ తారాచంద్ డోనాల్డ్ ట్రంప్ ను నిలదీశారు. వెనిజులాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా నికోలస్ మదురోను అరెస్టు చేసిన అమెరికా అధ్యక్షుడు  పాక్ ఆర్మీ చీఫ్ విషయంలో ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. నికోలస్ మదురో వెనిజులా నేచురల్ రిసోర్సస్ ను  చైనాకు అప్పగించి దోపిడీకి సహకరిస్తున్నారంటున్న ట్రంప్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కూడా బలోచిస్థాన్ లెని ఖనిజ సంపద, సముద్ర వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డాక్టర్ తారాచంద్ ప్రశ్నించారు.  పాక్ ఆర్మీ చీఫ్ మునీర్  డబుల్ ఏజెంట్ లా వ్యవహరిస్తూ, ఒకవైపు బలోచ్ వనరులను చైనాకు కట్టబెడుతూనే, మరోవైపు అమెరికాను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. . మదురోపై అమెరికా ఇటీవల  మెరుపు దాడి జరిపి అరెస్టు చేసినట్లుగానే  పాక్ ఆర్మీ చీఫ్‌ను కూడా బంధించాలని ఆయన డిమాండ్ చేశారు.  వనరుల దోపిడీకి తోడు పాక్ ఆర్మీ చీఫ్ నీర్ బలోచిస్థాన్‌లోనూ, సరిహద్దులకు ఆవల కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ తారాచంద్ ఆరోపించారు.   వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బలోచ్ అమెరికన్ కాంగ్రెస్  బలోచిస్థాన్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు  డాక్టర్ తారా చంద్ గతంలో బలోచిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా  కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ప్రవాసంలో ఉన్నారు.  అక్కడి నుంచే బలోచిస్థాన్ హక్కుల కోసం పోరాటం జరుపుతున్నారు. 

ఇండియాకు డోనాల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ తన భారత వ్యతిరేకతను మరోసారి ప్రదర్శించారు. రష్యా నుంచిచమురు కొనుగోలు విషయంలో తన దారికి రాకపోతే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు మరింత పెంచుతామని హెచ్చరించారు.    రష్యా చమురు విషయంలో భారత్  అమెరికాకు సహకరించకుంటే.. ఆ దేశంపై టారిఫ్ లు మరింత పెంచుతామని  ట్రంప్ ఓ బహిరంగ సభలో ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. భారత్ - అమెరికా మధ్య వాణిజ్య   చర్చలతో రష్యా చమురు అంశాన్ని ఆయన ముడిపెట్టినట్లు తెలిపింది. ట్రంప్ ఈ ప్రకటనతో భారత్-రష్యా ఇంధన సంబంధాల చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు మరో సారి తెరపైకి వచ్చినట్లైంది.  గతంలో కూడా రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే  ట్రంప్ ప్రకటనను  భారత్ అప్పట్లో నిర్ద్వంద్వంగా ఖండించింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించి టారిఫ్ ల పెంపు అంటూ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

భోగాపురం ఎయిర్ పోర్టుపై పొలిటికల్ వార్

   ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఎయిర్ పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. జూన్ నుంచి ఎయిర్ పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి టెస్ట్ ట్రయల్ చేయడానికి భోగాపురం రన్ వే పై తొలి విమానం ల్యాండ్ అయింది. ఈ క్రమంలో భోగాపురంపై అటు రాజకీయంగానూ కాక రేగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.  భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై క్రెడిట్ తమదంటే తమదేనంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్ర‌భుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమ‌తులూ లేకుండా శంకుస్థాప‌న చేసి వదిలేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ వైఎస్ జ‌గ‌న్ అన్ని అనుమతులు వ‌చ్చాకే ఆ ఎయిర్‌పోర్ట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసారని వాదిస్తోంది.  2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం నాటి ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ చెబుతోంది.  మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారని వదిస్తోంది.పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారని, డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని మంజూరు చేశారని వైసీపీ చెబుతోంది. దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారని, మిగతావాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించిందని వైసీపీ చెప్పుకుంటోంది.దానికి టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.  భోగాపురం ఎయిర్ పోర్ట్ చంద్రబాబు దూర దృష్టికి నిదర్శనం అని, వైసీపీ అధికారం లోకి రాక ముందే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన జరిగిందని వైసీపీని విమర్శిస్తుంది. అలాగే జగన్ భోగాపురం ఎయిర్ పోర్టును వ్యతికించరని దెప్పి పొడుస్తుంది. దానికి తగ్గట్లే సోషల్ మీడియాలో భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతున్నాయి. అప్పట్లో జగన్ దీనిపై మాట్లాడుతూ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్టు ఎందుకని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఈ క్రెడిట్ వార్లో వైసీపీ తీరు చర్చల్లో నలుగుతోంది. మరోవైపు  భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్‌పై  మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్‌కావడం ఏపీ అభివృద్ధికి ఒక మైలురాయి అని తెలిపారు. #VisonVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని తెలిపారు. తమ పాలనలో వేగవంతమైన అనుమతులతో ఇది సాధ్యమైందని చెప్పారు. భూసేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేయడంతో బలమైన పునాది వేశామన్నారు.   

2036 ఒలిపింక్ క్రీడల నిర్వహణకు భారత్ సిద్దం : ప్రధాని మోదీ

  2036 ఒలిపింక్ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్దమవుతోందని ప్రధాని మోదీ తెలిపారు. 72వ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడారు. గత పదేళ్లలో ఫీపా అండర్-17, హాకీ వరల్డ్ కప్ వంటి 20కి పైగా అంతర్జాతీయ ఈవెండ్లను భారత్ విజయవంతంగా నిర్వహించిందని ప్రధాని గుర్తుచేశారు.  భారత్‌ అభివృద్ధి ప్రయాణాన్ని వాలీబాల్‌ ఆటతో ప్రధాని మోదీ పోల్చారు. ఏ విజయం అయినా ఒక్కరి వల్ల సాధ్యం కాదని, సమన్వయం, పరస్పర విశ్వాసం, జట్టు సంసిద్ధత ఉంటేనే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ క్రీడలో ప్రతి ఒక్కరికి బాధ్యత, పాత్ర ఉంటుందని, అవన్నీ సమర్థంగా నిర్వర్తించినప్పుడే గెలుపు సాధ్యమవుతుందన్నారు. జనవరి 4 నుంచి 11 వరకు జరగనున్న ఈ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో దేశవ్యాప్తంగా 58 జట్లకు చెందిన వెయ్యికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలతో వారణాసి నగరం జాతీయ స్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రబిందువుగా మారుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.  

స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి

  హైదరాబాద్ నగరంలోని కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ ప్రాంతంలో జరిగిన విషాదకరమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ గేటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్‌లో పడి అర్జున్ కుమార్ (3) అనే మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన పలువురి కంటతడి పట్టించింది. హైదర్‌నగర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న అర్జున్ కుమార్ అనే బాలుడు ఈరోజు ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన తల్లిదండ్రుల సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఈత కొలను వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.  ఆ సమయం లో స్విమ్మింగ్ పూల్ వద్ద ఎవరు లేరు..కొంతసేపటి తర్వాత బాలుడు కనిపిం చకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు స్విమ్మింగ్ పూల్‌లో బాలుడు నీటిలో మునిగిపోయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతడిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో అర్జున్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపో యారు. ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనతో కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. గేటెడ్ కమ్యూనిటీలో చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈత కొలను ప్రాంతంలో తగిన పర్యవేక్షణ లేకపోవడం, సేఫ్టీ ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నదని గ్రేటర్ కమ్యూనిటీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.  సమాచారం అందుకున్న వెంటనే కె.పి.హెచ్.బి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈత కొలను వద్ద భద్రతా నిబంధనలు పాటించారా? పర్యవేక్షణ లోపం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఈ విషాద ఘటన గేటెడ్ కమ్యూనిటీల్లో చిన్నారుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్విమ్మింగ్ పూల్‌ల వద్ద తగిన రక్షణ చర్యలు, పర్యవేక్షణ తప్పనిసరి అన్న విషయం ఈ ఘటనతో స్పష్టమవుతోంది.