అంబర్పేట్ కిడ్నాప్ కేసులో 10 మంది అరెస్ట్
posted on Nov 4, 2025 @ 2:03PM
ఎవరికీ ఎటువంటి అనుమానం కలగకుండా.. సుపారి గ్యాంగ్ చేత భర్తనే కిడ్నాప్ చేయించి... కోట్లలో డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేయడమే కాకుండా అమలు కూడా చేసింది ఓ ఇల్లాలు... కానీ భర్త తప్పించుకుని పారిపోవడం తో .... అసలు విషయం బయట పడింది. దీంతో ఆ ఇల్లాలు శ్రీ కృష్ణ జన్మస్థానానికి చేరుతుంది. అంబర్పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం....ప్రధాన నిందితురాలు మాధవీలత అనే మహిళ అమెరికాలో నివాసం ఉంటున్నది. అయితే మాధవీలత... శ్యామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. కుటుంబ కలహాలతో మూడేళ్లకే విడిపోయింది. అనంతరం శ్యామ్ తన పేరును ‘అలి’గా మార్చుకుని ఫాతిమా అనే మహిళను రెండోవ వివాహం చేసు కున్నాడు. ఈ తరుణంలోనే శ్యామ్ తన తండ్రి నుంచి వచ్చిన సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య మాధవీలత ఎలాగైనా సరే భర్త నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే పక్కా ప్లాన్ చేసింది.తన భర్త శ్యామ్ ను కిడ్నాప్ చేయడానికి రామ్ నగర్కు చెందిన సాయి, ప్రీతి,సరిత ఈ సుపారి గ్యాంగ్ కు డబ్బులు ఇచ్చింది. జీ.ప్రీతి లేడీ బౌన్సర్గా పనిచేస్తుంది...ఇక ఎల్.సరిత అనే మరో మహిళ.... బాధితుడు శ్యామ్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే రెండు రోజుల ముందు అద్దెకు దిగి.... అతని కదలికలపై నిఘా పెట్టింది.అదును చూసి ఈ సుపారి గ్యాంగ్ బాధితుడు శ్యామ్ ను కిడ్నాప్ చేసి...బాధితుడిని చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు ప్రదేశాల్లో తిప్పుతూ కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఆ సమయంలో శ్యామ్ తన స్నేహితుడికి ఫోన్ చేయగా, ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం శ్యామ్ ఎంతో చాకచక్యంగా వారి నుంచి తప్పించు కుని పోలీసులకు వివరాలు ఇచ్చాడు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు మాధవీలత తో పాటు ప్రధాన సూత్రధారి రామనగర్కు చెందిన సాయి అని పోలీసులు గుర్తించారు.
అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు .మంత్రిశ్యామ్ అనే వ్యక్తిని అపహరించి రూ.1.5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగురు నిందితులు రెంట్ కార్లను ఉపయోగించి శ్యామ్ను కిడ్నాప్ చేసినట్లు విచా రణలో తేలింది. కేసులో మిగిలిన నలుగురిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు.