హుజురాబాదులో బీసీ.. హైద్రాబాదులో ఓసీ! ఈటలకు గంగుల కౌంటర్
posted on May 4, 2021 @ 3:33PM
తనపై కక్ష పూరితంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్న ఈటల రాజేందర్ ఆరోపణలకు కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ఒక మేక వన్నె పులి అని.. బీసీ ముసుగు కప్పుకున్న పెద్ద దొర అని గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల హుజురాబాద్కు వెళితే బీసీ.. హైద్రాబాద్కు వస్తే ఓసీ అంటూ మండిపడ్డారు. దేవరాయాంజల్ భూముల కోసం అప్పటి సీఎం వైఎస్తో మాట్లాడిన ఈటల.. ముదిరాజ్ల కోసం ఎందుకు మాట్లాడలేదు? నీ వ్యాపార భాగస్వాములు ఎవరైనా బీసీలు ఉన్నారా? ఇప్పుడు బీసీలు మీకు గుర్తుకు వచ్చారా? చీమలు పెట్టిన పుట్టలో పాములా మీరు చేరారు అంటూ ఈటలను టార్గెట్ చేశారు మంత్రి గంగుల కమలాకర్.
సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము ఊరుకోమని గంగుల హెచ్చరించారు. ఈటల బీసీలను ఎదగకుండా చేశారని, టీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన వారిని ఓడించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు ఈటల ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఈటల తనకు తాను పెద్దగ ఊహించుకుంటున్నారని గంగుల మండిపడ్డారు. పార్టీలో విభజన తెచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు. పార్టీ ఓడితే ఈటల నవ్వుతారు, గెలిస్తే మొహం మాడ్చుకుంటారని అన్నారు. ఈటల ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీల నాయకులతో టచ్లో ఉన్నారని గంగుల ఆరోపించారు. అందుకే వారు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్లో కేసీఆర్ బొమ్మతో ఈటల గెలిచాడన్నారు కమలాకర్.
ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని, ఈటలకు శాసనసభాపక్ష నేతగానూ అవకాశం ఇచ్చి పార్టీలో మంచి గుర్తింపునిచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈటల తమ కళ్లముందే ఉన్నతస్థానానికి ఎదిగారని అన్నారు.ఆర్థిక, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఎంత కీలకమైనవో అందరికీ తెలిసిందేనని, అలాంటి శాఖలను ఈటలకు అప్పగించారని తెలిపారు. మంత్రి వర్గ ఉపసంఘంలోనూ ఈటలకు ప్రాముఖ్యత ఇచ్చారని, కానీ ఈటల తరచుగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలను కూడా విమర్శిస్తూ మాట్లాడుతున్నారని కొప్పుల ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లోనూ ఈటలను పార్టీ ఏమీ అనలేదని, ఇక ఈటల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం కలిగిందో చెప్పాలని నిలదీశారు.
పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కొనడం, అమ్మడం నేరం అని ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను కొనడం తప్పుగా అనిపించలేదా అని నిలదీశారు. రూ.1.5 కోట్ల విలువైన భూములను కేవలం రూ.6 లక్షలకే ఎలా కొన్నారని ప్రశ్నించారు. ఇది ఎస్సీలకు నష్టం చేకూర్చినట్టు కాదా? అని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే... సంజాయిషీ ఇవ్వడానికి బదులు సీఎంపైనే ఎదురుదాడికి దిగడం ఈటలకు మాత్రమే చెల్లిందని అన్నారు. అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోలు చేయరాదని చట్టం చెబుతోందని, అసైన్డ్ భూములను ఎన్నిసార్లు అమ్మినా తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని కొప్పుల స్పష్టం చేశారు.