బలవంతపు మత మార్పిళ్లు సీరియస్ అంశమే.. సుప్రీం
posted on Nov 15, 2022 9:08AM
బలవంతపు మత మార్పిళ్లు సీరియస్ అంశమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
దేశంలో కొన్ని చోట్ల జరుగుతున్న బలవంతపు మత మార్పిళ్లపై చాలా తీవ్రమైన అంశమని, వాటిని గుర్తించి నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని సూచించింది. బలవంతపు మతమార్పిళ్లను అరికట్టకపోతే దేశంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొంది.
.దేశంలో బలవంతపు, మోసపూరిత మత మార్పిళ్లను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
దేశ భద్రత, మత స్వేచ్ఛను ప్రభావితం చేసే సమస్యగా బలవంతపు మత మార్పిళ్లను పేర్కొంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు చేపట్టాలి సుప్రీం సూచించింది. బలవంతపు మతమార్పిళ్లను అరికట్టేందుకు కేంద్రం చర్యలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.