సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర!
posted on Nov 15, 2022 9:28AM
సింగరేణి నిర్వీర్యం చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక వైపు సింగరేణిని ప్రైవేటు పరం చేయబోమని చెబుతూనే మరో వైపు గనులు దక్కకుండా చేయడానికి కుట్రలు చేస్తోంది. సింగరేణికి బొగ్గుగనులు దక్కకుండా చేయాలన్న లక్ష్యంతోనే వాటిని వేలం ద్వారా కార్నొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రకు తెరతీసిందని తెరాస ఆరోపిస్తోంది.
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానేఈ ఏడాది ఆగస్టు 10న నిర్వహించిన వేలం పాటలో ఔరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సత్తుపల్లిలోని కోయలగూడెం – lll కోల్ బ్లాక్ ను అప్పగించిందని తెరాస మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేసి, నిర్వీర్యం చేసి చంపేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థకు కోల్ బ్లాక్స్ ఇవ్వకుండా వేలం పాట వేయడంలో దాగి ఉన్న మర్మం ఏమిటో స్పష్టం చేయాలని కేంద్రాన్ని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
కోల్ బ్లాక్స్ లేకుండా సింగరేణి సంస్థ ఏం చేయాలి అని కేంద్రం భావిస్తోందని నిలదీశారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సుమారు 50,000 మంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డున పడవేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపన్నిందని వినోద్ కుమార్ విమర్శించారు. ప్రైవేటీకరణ లేదంటూనే వ్యూహాత్మకంగా కోల్ బ్లాక్స్ వేలం వేసి సింగరేణి సంస్థను నీరు గార్చుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోల్ బ్లాక్స్ ను సింగరేణి సంస్థకు అప్పగించాలని.. కోల్ బ్లాక్స్ ను వేలం వేసే పనులకు స్వస్తి పలకాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయబోమని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూనే.. మరోవైపు కోల్ బ్లాకులను వేలం వేయడం ద్వారా సింగరేణి సంస్థకు ఆ కోల్ బ్లాకులు దక్కకుండా ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించుతున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు.
రాష్ట్రంలో 82 కోల్ బ్లాకులు ఉండగా, అందులో సింగరేణి సంస్థ 40 కోల్ బ్లాకులను వినియోగిస్తున్నదని వినోద్ కుమార్ తెలిపారు. మిగిలిన 42 కోల్డ్ బ్లాకులను కూడా సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు.మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం తాము కోల్ బ్లాకులను వేలం వేస్తున్నామని, బహిరంగ వేలంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో సింగరేణి సంస్థ పోటీపడి వాటిని దక్కించుకోవాలని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అటు పార్లమెంటు నిండు సభలో, ఇటు బహిరంగ ప్రకటన ద్వారా పదేపదే చెబుతున్నారని, దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర నాయకులు జవాబు చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.