ఈటల రాజేందర్ రాజీనామా? మరికొందరు నేతలు కూడా..
posted on Apr 30, 2021 @ 8:03PM
తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలపై వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడం.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడం కలకలం రేపుతోంది. ఈటలకు చెక్ పెట్టేందుకే నాలుగేండ్ల క్రితం జరిగినట్లుగా చెబుతున్న భూబాగోతాన్ని బయటికి తీశారంటున్నారు. భూ వ్యవహారంలో ఈటల రాజేందర్ను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై మీడియాకు వివరణ ఇవ్వబోతున్నారు ఈటల రాజేందర్. శామీర్ పేటలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే తన రాజీనామాను ఈటల ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రాజీనామా లేఖను ఈటల సిద్ధం చేసుకున్నారని, తన సన్నిహితులతోనూ చర్చించారని చెబుతున్నారు. మంత్రి పదవితో పాటు టీఆర్ఎస్ పదవులకు, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజేందర్ రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఈటలతో పాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా రాజీనామా చేయబోతున్నారని చెబుతున్నారు.
ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ కేసీఆర్ కు అనుకూలంగా ఉన్న మీడియాలో వార్తలు వస్తుండటం చర్చగా మారింది. ఈటలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందనే చర్చ జరుగుతోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.
కొంత కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉంటున్నారు ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ తీరుపైనా ఆయన గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. పలు సార్లు ఆయన ఓపెన్ గానే తన అసమ్మతిని వ్యక్తం చేశారు. గత సంవత్సరం గులాబీ జెండాకు తామే అసలైన ఓనర్లం అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల కూడా కేసీఆర్, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేలా రాజేందర్ మాట్లాడారు. బీసీ సంఘం సమావేశంలోనూ తనను అణగదొక్కాలని చూస్తున్నారనే సంకేతం ఇచ్చేలా ఈటల మాట్లాడారు. తమను వరుసగా టార్గెట్ చేస్తున్నరన్న కసితో అతనికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే భూకబ్జాలతో పేరుతో కథ నడిపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.