రైతుల పోరాటం ఉధృతం! ఢిల్లీ సరిహద్దులకు సీఎం కేజ్రీవాల్
posted on Dec 7, 2020 @ 9:44AM
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం ఉధృతమైంది. అన్నదాతలు 10 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఉన్నారు. కేంద్రం బిల్లులు ఉపసంహరించుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు. రైతుల పోరాటనికి మద్దతు కూడా పెరుగుతోంది. ఢిల్లీ సమీపంలోని రాష్ట్రాల నుంచి వేలాదిగా రైతులు తరలివస్తున్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ ప్రాంతాల్లో వేలాదిగా చేరిన రైతులు, తమను ఢిల్లీలోకి అనుమతించాలని నిరసనలు కొనసాగిస్తున్నారు. సింఘుతో పాటు టిక్రీ, ఘాజీపూర్ లో సైతం రైతుల ఆందోళన కొనసాగుతోంది.మంగళవారం రైతులు చేపట్టనున్న భారత్ బంద్ కు అన్ని వర్గాల నుంచి సపోర్ట్ లభిస్తోంది. రైతుల బంద్ పిలుపుతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ సరహిద్దులో భారీగా అదనపు బలగాలను మోహరిస్తోంది.
దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసనలు తెలియజేస్తున్న రైతులకు సంఘీభావం తెలపాలని నిర్ణయించుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తన సహచర మంత్రులతో కలిసి ఆయన హర్యానా - ఢిల్లీ బార్డర్ కు వెళ్లనున్నారు. రైతులకు అక్కడ కల్పిస్తున్న ఏర్పాట్లను కేజ్రీవాల్ స్వయంగా సమీక్షించనున్నారు. రైతుల నిరసనలు 10వ రోజుకు చేరుకోగా, వారిని పరామర్శించేందుకు వెళుతున్న తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలవనున్నారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులో రైతుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సౌకర్యాలను కల్పించిందని వ్యాఖ్యానించిన కేజ్రీవాల్, "8న జరిగే భారత్ బంద్ కు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా మద్దతిస్తోంది తెలిపారు. రైతులు తెలియజేస్తున్న నిరసనలకు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతున్నాను" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.