Read more!

కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ : ఎవరా ఇద్దరు ఎంపీలు?

 

మొన్న ఏఐసీసీ ప్రతినిధి హైదరాబాద్ వచ్చి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అద్దంకి దయాకర్, వెంకటస్వామి, గజ్జెల కాంతం పేర్లు లిస్టులో వున్నాయి. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన లిస్టులో ఈ ముగ్గరి పేర్లు గల్లంతు కావడంతో సంచలనం రేగింది. ఆ తర్వాత నాలుక్కరుచుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఉద్యమకారులకు టిక్కెట్లు ఇస్తామని పొన్నల చేత ప్రకటన ఇప్పించింది. ఇదిలా వుంటే టిక్కెట్లు వచ్చినట్టే వచ్చి, అంతలోనే చేజారిపోయి, ఇంతలోనే మళ్ళీ టిక్కెట్లు రాబోతున్న ముగ్గురు ఉద్యమకారులకు మంచి పబ్లిసిటీ అయితే వచ్చింది. గజ్జెల కాంతంకి కంటోన్మెంట్, వెంకటస్వామికి నర్సంపేట టిక్కెట్, అద్దంకి దయాకర్‌కి తుంగతుర్తి టిక్కెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఒప్పుకుందట. ఈ విషయాన్ని అద్దంకి దయాకర్ తెలిపారు. అధిష్ఠానం తమ పేర్లు ప్రకటించాక ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించి తాజా లిస్టులో తమ పేర్లు లేకుండా చేశారని అద్దంకి దయాకర్ అంటున్నారు. దాంతో ఇప్పుడు అందరి ఆలోచన ఆ ఇద్దరు ఎంపీలు ఎవరన్నదానిమీద కేంద్రీకృతమైంది.