కొత్త సచివాలయం చూతము రారండి
posted on Jan 25, 2023 @ 9:48AM
అదేదో కమర్షియల్ యాడ్ లో రావు రమేష్.. మావాళ్ళు ఏది చేసినా మాములుగా చేయరు ఘనంగా చేస్తారు.. అంటారు. అవును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే, ఆయన ఏది చేసినా మాములుగా ఉండదు. ఘనంగా ఉంటుంది. అలాంటింది, ఇక రాష్ట్ర సచివాలయం అంటే మాటలా మాములు విషయమా? అందులోనూ ఇప్పుడు జాతీయ స్థాయిలో జెండా ఎగరేసేందుకు సిద్ధమైన కేసీఆర్ తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని అంతే ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సచివాలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో వంక ప్రారంభోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
కాగా తెలంగాణ కొత్త సెక్రటేరియట్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఆధునిక హంగులు, అత్యాధునిక సొగబులతో కొత్త సచివాలయ నిర్మాణం జరిగింది. దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. వచ్చే నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ స్వయంగా సచివాలయాన్ని ప్రారంభించి తన ఛాంబర్లోకి అడుగుపెట్టనున్నారు.
ముఖ్యమంత్రి పుట్టిన రోజు ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల నడుమ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ఇద్దరు ముఖ్యమంత్రులు, పలువురు జాతీయస్థాయి నేతలు తరలిరానున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తరఫున లలన్ సింగ్ (జేడీయూ జాతీయ అధ్యక్షుడు), బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సచివాలయ ప్రారంభోత్స కార్యక్రమానికి ముందు వాస్తు పూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని మంగళవారం(జనవరి 24) సందర్శించారు. సచివాలయ నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. సచివాలయ ప్రాంగణంలో కేసీఆర్.. పనుల గురించి ఇంజినీర్లను, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సచివాలయంలోకి సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టారు. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భవనం లోపల కలియతిరిగిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ కొత్త సచివాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా ఐకానిక్ బిల్డింగ్గా కనిపించేలా కొత్త సెక్రటేరియట్ను నిర్మించారు. 265 అడుగుల ఎత్తుతో 28 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 10,51,676 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం ఉంది. మొత్తం ఏడు అంతస్తులు నిర్మించగా.. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. తొలి రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు, ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో స్టోర్ రూమ్, సిబ్బంది రూమ్స్ లాంటివి ఉంటాయి. బిల్డింగ్పైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తు గల జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేశారు. భవనం ముందువైపు ఒకటి, వెనుకవైపు ఒక జాతీయ చిహ్నం ప్రతిష్టించారు. వీటిని ఢిల్లీలో తయారుచేయించి హైదరాబాద్కు తరలించారు. భారీ క్రేన్ల సహాయంతో వీటిని బిల్డింగ్ పైభాగంలో ఏర్పాటు చేశారు. బిల్డింగ్ నలువైపులా మొత్తం 2 ప్రధాన గుమ్మటాలు. 34 చిన్న గుమ్మటాలు ఏర్పాటు చేశారు. సచివాలయానికి మొత్తం నాలుగు గేట్లు ఏర్పాటు చేశారు.
లుంబినీ పార్క్ ఎదురుగా ప్రధాన ద్వారం ఉండనుండగా.. సీఎం కాన్వాయ్ ఈ ద్వారం గుండా లోపలికి వస్తుంది. ఇక ఎన్టీఆర్ గార్డెన్కు ఎదురుగా మరో గేటు ఏర్పాటు చేయగా.. ఉద్యోగులు ఈ గేటు గుండా ఆఫీసులకు చేరుకుంటారు. ఇక బిర్లామందిర్ వైపు మరో గేటు ఉండగా.. సామాన్యులకు ఈ ద్వారం కూడా ప్రవేశం ఉంటుంది. ఇక సచివాలయం వెనుక భాగంలో నాలుగు గేటు ఉంటుంది. అత్యవసర సమయాల్లో మాత్రమే నాలుగో గేటు ఉపయోగిస్తారు. 300 కార్లు. 600 ద్విచక్ర వాహనాలు ఒకేసారి పార్క్ చేసుకునేలా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. సీఎంఓ ఛాంబర్లో 30 కంపార్ట్మెంట్లు ఉంటాయి. సీఎం, మంత్రులు, ఉద్యోగులు, సామాన్యులకు వేర్వురుగా పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. 100 ఏళ్ల పాటు ఉండేలా తెలంగాణ కొత్త సచివాలయం నిర్మించినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.