బీబీసీ డాక్యుమెంటరీ పై ముదురుతున్న దుమారం
posted on Jan 25, 2023 @ 10:27AM
ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు పూర్వం 2002 గుజరాత్ లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు కథా వస్తువుగా బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్ను ఇటీవల యూట్యూబ్ (ఇండియా)లో బీబీసీ అప్లోడ్ చేసింది. అయితే అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది. డాక్యుమెంటరీలోని అంశాలను కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ధ్వజమెత్తారు.
నిజానికి, ఆ డాక్యుమెంటరీ లో ఏముంది? ఏమి లేదు అనే విషయాన్ని, అలాగే ఉన్నదంతా నిజమేనా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ డాక్యుమెంటరీ రాజకీయ దుమారాన్ని అయితే సృష్టిస్తోంది. నిజానికి గోద్రా దుర్ఘటన (గుజారత్ అల్లర్లకు అగ్గిరాజేసిన 59 మంది కరసేవకుల సజీవ దహనం సంఘటన) నేపధ్యంగా జరిగిన గుజరాత్ లో అల్లర్ల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశ్నించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారాన్ని మాత్రమే కాదు ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన క్లిప్ లను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని ప్రభుత్వం నిషేధ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సహజంగానే హిందూ వ్యతిరేక లౌకికవాద వ్యక్తులు, శక్తులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అంతే కాదు నిషేధం ఉన్నా ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఆసక్తి చూపడం కాదు ప్రభుత ఉత్తర్వులను ధిక్కరించి అయినా, ప్రదర్శించి తీరుతామని కొన్ని వామపక్ష అనుబంధ విద్యార్ధి సంఘాలు ప్రకటించాయి.
మరోవంక ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం సహా అనేక పార్టీలు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించాలనే డిమాండ్ తో గొంతు కలుపుతున్నాయి. కేరళ రాష్ట్ర పీసీసీ మైనారిటీ సెల్ మరో అడుగు ముందుకేసి, గణతంత్ర దినోత్సవం ( జనవరి 26) ఆ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని ప్రకటించింది.
డాక్యుమెంటరీని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్ధం.. మోడీ ప్రభుత్వం దాన్ని ఎలా నిషేధిస్తుంది.. ఇది కేంద్రంపై మా (మైనారిటీ) నిరసన అని కేపీసీసీ అడ్వకేట్ షహాబుద్దీన్ అన్నారు. ప్రజలే ఈ డాక్యుమెంటరీని చూసి ఏది నిజమో ఏది కాదో ప్రజలే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీని ఎలా అడ్డుకుంటుంది ? ఏది తప్పు ఏది కాదో ఈ దేశ ప్రజలే నిర్ణయించుకోనివ్వండి. అల్లర్లలో వేలాది మంది మరణించిన గుజరాత్కు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఎలా విశ్వసిస్తాము అని కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ అన్నారు. ఈ అంశంపై బీజేపీకి చెందిన టామ్ వడక్కన్ స్పందిస్తూ.. ఇది భారతదేశాన్ని విభజించడానికి పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్ర అని అన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరుగుతోందని ఆయన అన్నారు.
ఇదిలా వుండగా ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనను రద్దు చేయాలని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థుల బృందాన్ని కోరింది. అయితే ఈ డాక్యుమెంటరీ కచ్చితంగా ప్రదర్శిస్తామని జేఎన్ యుఎస్ యు సభ్యుడు ఒకరు తెలిపారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. కాగా.. హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది.
ఈ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రెండు రోజుల కిందట స్పందించారు. భారతదేశంలోని కొంతమంది ఇప్పటికీ వలస రాజ్యాల మత్తు నుండి బయటపడలేదని అన్నారు. అలాంటి వ్యక్తులు బీబీసీని భారత సుప్రీంకోర్టు కంటే ఎక్కువగా పరిగణిస్తారని, తమ నైతిక గురువులను సంతోషపెట్టడానికి దేశం గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలోనైనా తగ్గించేందుకు సిద్ధంగా ఉంటారని ఆరోపించారు.అయితే ఎన్నికల సంవత్సరంలో బీబీసీ సృష్టించిన వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనన్న భయం అయితే అందరిలో వ్యక్తమవుతోంది.