తెలుగుజాతి తలరాత మార్చిన సీఎం @ 25 ఏళ్లు..
posted on Sep 1, 2021 @ 12:57PM
1995, సెప్టెంబర్ 1. చరిత్రలో నిలిచిపోయే రోజు. మారిన తెలుగుజాతి తలరాతకు తొలి అడుగు పడిన రోజు. తెలుగోడి కీర్తిపతాకం ప్రపంచ యవనికపై రెపరెపలాడేందుకు అంకురం పడిన రోజు. మన పిల్లలను సాఫ్ట్వేర్ నిపుణులుగా తీర్చిదిద్ది అమెరికాకు వంతెన వేసిన రోజు. సరికొత్త హైదరాబాద్ నిర్మాణానికి బీజం పడిన రోజు. ప్రభుత్వ పనితీరు మారిన రోజు. పేదల చెంతకే ప్రభుత్వం వచ్చిన రోజు. అసలైన ప్రజారంజక పాలనకు శ్రీకారం పడిన రోజు. ఆ రోజు ఈ రోజు. సెప్టెంబర్ 1.
1995లో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సుభదినం. ఆ రోజు జరిగిన ఆ కీలకఘట్టం తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ సమయానికి ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ, కాలచక్రం అందుకు సాక్షిగా నిలిచి.. చంద్రబాబు పాలనా చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఇప్పటికీ రెండు తెలుగురాష్ట్రాల్లో చంద్రబాబు అంటే పీక కోసుకునేంత అభిమానులు కోకొల్లలు ఉన్నారంటే అతిశయోక్తి కానే కాదు. ప్రస్తుత ఏపీ, తెలంగాణలోని ఏ మారుమూల తాండాలకో, గిరిజన గూడేలకో వెళ్లినా.. అక్కడ మీకో సీబీఎన్ ఫ్యాన్ తప్పక కనిపిస్తాడు. చంద్రబాబు వల్లే మా బిడ్డ అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడని చెప్పే తండ్రులు, చంద్రబాబు హయాంలోనే మా అబ్బాయికి టీచర్ జాబ్ వచ్చిందని సంతోషించే తల్లులు తెలుగురాష్ట్రాల్లో లక్షల్లో ఉంటారు. చంద్రబాబు జమానాలోనే తాము తొలిసారి గ్యాస్ సిలిండెర్తో వంట చేసుకున్నామని చెప్పే పేదలు.. చంద్రబాబు వల్లే తాము డ్వాక్రా గ్రూపులతో డబ్బులు పోగేసుకొని తమ కుటుంబాలను బాగుపరుచుకున్నామంటూ ఆనందభాష్పాలు కార్చే మహిళలు తెలుగునేలపై ఏ మూలకు వెళ్లినా తారసపడతారు. ఈ రోడ్ 'జన్మభూమి'లో భాగంగా వేసిందని.. ఆ స్కూల్ చంద్రబాబు హయాంలో కట్టించిందని.. ఇలా తెలుగురాష్ట్రాల్లో చంద్రబాబు ఆనవాళ్లను ఎవరూ తుడిపేయలేరు. ఇలాంటి రాష్ట్ర గతిని మార్చిన చంద్రబాబు పాలనకు ఇవాళే అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 1.. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన రోజు.
ఎన్టీఆర్ను గద్దె దించారనే అపవాదుతోనే అందలమెక్కారు చంద్రబాబు. అది ఎన్టీఆర్కు వెన్నుపోటు కాదని.. ఆంధ్రప్రదేశ్ను, టీడీపీని ఓ మహిళ కబంధ హస్తాల నుంచి విడుదల చేసిన రోజంటారు తెలుగు తమ్ముళ్లు. ఎన్టీఆర్లా ఛర్మిష్మా లేదు. ఆయన అనర్గళ వాగ్దాటీ లేదు. అయినా, చిరకాలంలోనే ఎన్టీఆర్ను మరిపించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అంతకుమించి.. పని చేసి చూపించారు.
ఆ బక్క పలచని మనిషి.. ప్రభుత్వ శాఖలకు పట్టిన దశాబ్దాల బూజును, దుమ్మును ఒక్కసారిగా దులిపేశారు. అసలైన వర్క్ కల్చర్ను తీసుకొచ్చారు. పని అంటే ఎలా చేయాలో.. పనితీరు ఎలా ఉంటుంందో రుచి చూపించారు. మేం ప్రభుత్వ ఉద్యోగులం.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ తోలుమందం ఉద్యోగుల కొవ్వు కరిగించేశారు. ఫైళ్ల వారోత్సవాలతో.. గవర్నమెంట్ ఆఫీసుల్లో గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్లను పరుగులు పెట్టించారు. ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు, ఏ ఆఫీసుకు చెకింగ్కు వస్తారో తెలీక.. నిత్యం అలర్ట్గా ఉండేవారు ఆఫీసర్లు. అంతకుముందు ఆఫీసులోనే నిద్రపోయే కల్చర్ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు.. ఆ తర్వాత మిలటరీ ఆఫీసుల్లా ఎనీటైమ్ అలర్ట్గా ఉండేలా చేసిన ఘనత చంద్రబాబుదే. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లాంటి గవర్నమెంట్ ఎంప్లాయిస్ను.. కష్టపడి పని చేసేలా చేయగలిగారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేశారు. ప్రభుత్వంలో ఉన్న 47 కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. వాటి పనితీరులో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్యోగుల మైండ్ సెట్ మార్చిన.. మాస్టర్ మైండ్ సీబీఎన్.
చాలా తక్కువ సమయంలోనే ‘పని చేసే ముఖ్యమంత్రి’ గా పేరుగాంచారు చంద్రబాబు. తుఫాన్లు, వరద ముంపు ప్రాంతాల్లో 24 గంటల్లోనే చేరుకొని.. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించి.. సంక్షోభ సమయాల్లో సమర్థత చాటుకొన్నారు. సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమం.. ఆ తర్వాత ‘జన్మభూమి’గా మారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలనే మార్చేసింది. అందరికీ శ్రమ విలువ తెలిసేలా చేసింది. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో పనులు.. ప్రజలు కలిసికట్టుగా శ్రమదానంతో సాధించుకొని.. చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పుకునేవారు. ఎన్నారైలనూ జన్మభూమిలో భాగస్వామ్యం చేసి.. మాతృభూమి బాగుకోసం మేముసైతమంటూ తరలివచ్చేలా చేశారు. పచ్చదనం-పరిశుభ్రత.. చంద్రబాబు మదిలో మొలిచిన ఆలోచనే.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు, అప్పటికి నామమాత్రంగా ఉన్న ‘డ్వాక్రా’ పథకాన్ని ఉద్యమంలా నడిపించిన తీరు అప్పట్లో ఓ సంచలనం. ‘డ్వాక్రా పథకం’ తో గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్యం వెల్లివిరిసింది. సామాజిక నాయకత్వం వెలుగు చూసింది. డ్వాక్రా సంఘాల విజయగాథలను తెలుసుకోవడానికి ఆనాడు దేశ, విదేశీ ప్రముఖులు ఏపీని సందర్శించేవారు. ఆంధ్రప్రదేశ్లో ఎగసిన మహిళా ఆర్థిక స్వావలంబన చైతన్యంపై బ్రిటన్ పార్లమెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే చంద్రబాబు డ్వాక్రా గ్రూపులతో ఎంతటి ఘన చరిత్ర సృష్టించారో తెలుస్తోంది.
తెలుగువారికి ఐటీని పరిచయం చేసి.. మన జాతి తలరాత మార్చేసిన ఘనుడు అప్పటి సీఎం చంద్రబాబు. హైదరాబాద్ను పెట్టుబడుల కేంద్రంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా చేసింది చంద్రబాబే. కంప్యూటర్ను వాడిన తొలి ముఖ్యమంత్రీ చంద్రబాబే. ఆనాటి హైటెక్సిటీతోనే ఈనాడు ఇంటింటికో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉన్నారు. వేలాది ఇంజినీరింగ్ కాలేజీలతో లక్షలాది ఐటీ నిపుణులను తయారు చేశారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్నే హైదరాబాద్ రప్పించారు. అందుకే చంద్రబాబును అప్పట్లో దేశ ప్రముఖులంతా 'సీఎం' అని కాకుండా 'సీఈవో' అని పిలిచేవారు.
సంస్కరణలతో ఏపీని పరుగులు పెట్టించారు సీఎం చంద్రబాబు. పోఖ్రాన్ అణుపరీక్షలతో భారత్కు రుణాలివ్వరాదని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వంటి ఆర్థిక సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టినా, ఆనాడు చంద్రబాబు ప్రపంచ బ్యాంకు రుణం తేగలిగారు. అయితే, విద్యుత్ రంగంలో సంస్కరణలు సత్ఫలితాలనిచ్చినా.. ఛార్జీల పెంపు విమర్శలపాలైంది. దళిత వర్గానికి చెందిన బాలయోగిని లోక్సభ స్పీకర్గా, శ్రీమతి ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్గా చేసి.. దళితులకు సముచిత గౌరవాన్ని కల్పించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.
ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్, జగన్మోహన్రెడ్డి.. ఇలా తెలుగు నేలను ఎంతమంది ముఖ్యమంత్రులు పాలించినా.. వారందిలోకెళ్లా చంద్రబాబు పాలనే తెలుగుజాతి తలరాతని బాగా మార్చేసిందని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు సీఎంగా, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా.. చంద్రబాబు పేరు తెలుగునేలపై సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది.. తెలుగు హృదయాల్లో చిరరకాలం నిలిచి ఉంటుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా.. అమరావతిని కనుమరుగు చేసేలాంటి కుతంత్రాలు నడిపినా.. చంద్రబాబు ఆనవాళ్లను అంత ఈజీగా మాయం చేయలేరు. ఎవరు హైదరాబాద్ వెళ్లినా.. హైటెక్ సిటీని చూసినా.. ఏ ఫ్లైఓవర్లపై ప్రయాణించినా.. రైతు బజారుకెళ్లినా.. ఎవరు కొవాగ్జిన్ టీకా తీసుకున్నా.. ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చదివినా.. ఏ 'మీ సేవ' కార్యాలయానికి వెళ్లినా.. ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా.. అవన్నీ చంద్రబాబు పాలన అనే మహావృక్షానికి కాసిన తియ్యని ఫలాలే. అందుకే, తెలుగుజాతి ఉన్నంత కాలం చంద్రబాబు పేరు, ముఖ్యమంత్రిగా ఆయన పాలన చిరస్మరణీయం. అందుకే, 1995, సెప్టెంబర్ 1.. ఓ చారిత్రకదినం. గ్రహణం చాయలు వీడగానే మళ్లీ చంద్రోదయం ఖాయం.