సోనియా ఆధ్వర్యంలోని ట్రస్టులకు ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు
posted on Oct 24, 2022 @ 10:44AM
సోనియాగాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు ట్రస్టులకు కేంద్రం ఎఫ్ సీఆర్ఏ లైసెన్సు రద్దు చేసింది. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు సేకరించాలన్నా, స్వీకరించాలన్నా ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ తప్పనిసరి. ఎఫ్ సీఆర్ఏ అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ లైసెన్సు ఉన్న ట్రస్టులు మాత్రమే విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలి.
అయితే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆధ్వర్యంలోని రెండు ట్రస్టులకు ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేసింది. సోనియా నేతృత్వంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ రెండు సంస్థలు ఆర్థికపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. అందుకే ఈ రెండు సంస్థలపై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్ సీఆర్ఏ) ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేశామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
హోంశాఖ మంత్రిత్వ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ నిధుల దుర్వినియోగం, అక్రమంగా నగదు చెలామణీ తదితర అవకతవకలకు ఈ రెండు ట్రస్టులూ పాల్పడినట్లు ఈ కమిటీ గుర్తించినట్టు వారు పేర్కొన్నారు.
కాగా, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు నిధులు అందించిన వారి జాబితాలో చైనా కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆర్థికనేరస్తుడు మేహుల్ చోక్సీ కూడా గతంలో పీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వగా, ఆ నిధులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు మళ్లించినట్టు అప్పట్లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు. ఈ ఫౌండేషన్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తదితర ప్రముఖులు ట్రస్టీలుగా ఉన్నారు.