బిల్కిస్ బానో రేపిస్టుల రెమిషన్ రద్దు చేయాలి!
posted on Aug 22, 2022 @ 3:33PM
బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో రేపిస్టుల విడుదల పట్ల వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతోంది. బిల్కిస్ బనో సామూహిక అత్యాచారం కేసులో నేరస్థులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఆరు వేల మంది సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. వారి రెమిషన్ ను రద్దు చేసి తక్షణమే జైలుకు పంపాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. రేప్ కేసులో నిందితులను రెమిషన్ పేరు మీద విడుదల చేయడమంటే అత్యాచారం నేరానికి పాల్పడిన వారి పట్ల లిబరల్ గా వ్యవహరించాలన్న సంకేతాన్నిఇచ్చినట్లేనని వారు అంటున్నారు. గుజరాత్ లో 2002 లో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారంచేసి, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని అత్యంత పాశవికంగా ఖతం చేసిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం పట్ల దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఆ 11 మంది దోషులను విడుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కు తీసుకుని వారిని తిరిగి జైలుకు పంపాలని కోరుతూ ఆరు వేలమంది పౌరులు, మహిళా కార్యకర్తలు, పౌర, మానవహక్కుల కార్యకర్తలు సుప్రీం కోర్టుకు లేఖ రాశారు.
సామూహిక అత్యాచారం, సామూహిక హత్యలకు పాల్పడిన 11 మంది కరుడుగట్టిన దోషులను విడుదల చేయడం అత్యాచార బాధితులందరిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవస్థపై,న్యాయంపై నమ్మకం కలిగిఉన్న ప్రతి ఒక్కరిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వారా లేఖలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు కు లేఖ రాసినవారిలో సామాజిక కార్యకర్తలు సయ్యద్ హమీద్, జఫరుల్-ఇస్లాం ఖాన్, రూప్ రేఖ, దేవకీ జైన్, ఉమా చక్రవర్తి, సుభాషిణి అలీ, కవితా కృష్ణన్, మైమూనా మొల్లా, హసీనాఖాన్, రచన ముద్రబోయిన, షబ్నం హష్మీ తదితరులున్నారు.
సహేలీ ఉమెన్స్ రిసోర్స్ సెంటర్, గమన మహిళా సమూహ, బేబాక్ కలెక్టివ్, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్, ఉత్తరాఖండ్ మహిళా మంచ్, ఫోరమ్ అగైనెస్ట్ అప్రెషన్ ఆఫ్ ఉమెన్, ప్రగతిశీల మహిళా మంచ్, పర్చమ్ కలెక్టివ్, జాగృతి ఆదివాసీ దళిత్ సంగటన్, అమూమత్ సొసైటీ, డబ్ల్యూఓమ్ తదితర హక్కుల సంఘాలు కూడా ఈ లేఖపై సంతకాలు చేశాయి. మహిళలకు న్యాయం పట్ల విశ్వాసం పెంపొందించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే రేపిస్టుల రెమిషన్ రద్దు చేయాలని కోరారు. బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన పదకొండు మంది నేరస్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుండి బయటికి వచ్చారు. గుజరాత్ ప్రభుత్వం తన రెమిషన్ విధానం ప్రకారం వారిని విడుదల చేయడానికి అనుమతించింది. కాగా వాళ్ళ విడుదలకు సిఫారసు చేసిన 10 మంది సభ్యుల కమిటీలో ఐదుగురు బీజేపీ నేతలే కావడం గమనార్హం.
ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జనవరి 21, 2008న బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురి హత్య ఆరోపణలపై 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు వారి శిక్షను సమర్థించింది. అప్పటికి బిల్కిస్ బానో ఐదు నెలల గర్భిణి, గోద్రా రైలు దహనం తర్వాత గుజరాత్ లో చెలరేగిన హింసాకాండ నుంచి తప్పించుకుని పారిపోతూ సామూహిక అత్యాచారానికి గురైంది. చనిపోయిన వారిలో ఆమె 3 ఏళ్ల కూతురు కూడా ఉంది.