కాషాయ దళం.. నీతుల మాటున రోత రాజకీయం?

కాషాయ దళం నీతుల మాటున రోత రాజకీయం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కన్నా తాము విలక్షణమైన రాజకీయ పక్షంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కమలనాథులు కాంగ్రెస్ కంటే ఎక్కువగా మురికి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. మోదీ పాలన పదేళ్లుగా ఆసాంతం అసత్యమేవ జయతే అన్న రీతిలో సాగింది.మోదీ మాటల్లో ఉన్న నీతి, నిబద్దత, నిజాయితీ చేతల్లో లేదని రుజువైంది. అవినీతి అంతం నా పంతం అని ప్రగల్భాలు పలికి ఎల్లలెరుగని అవినీతికి పాల్పడిన అవినీతిపరులతో చేతులు కలిపి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చు కొంటుంన్నారు. ఆర్ధిక నేరస్తుల  అంతుచూస్తానని బూటకపు వాగ్దానంతో దేశ ప్రజల్ని బురిడి కొట్టించారు. ఆర్దిక నేరస్తులకు, కార్పొరేట్ వర్గాలకు చౌకీదారుగా మోదీ వ్యవహరిస్తున్నారు తప్ప దేశ ప్రయోజనాలకు  మాత్రం కాదు.  తాము అధికారంలోకి వస్తే చట్టసభలకు ఎన్నికైన నేరచరితుల ప్రమాణ పత్రాలను సుప్రీం కోర్టుకు అందించి ఆయా కేసులపై సత్వర విచారణ జరిపి ఏడాదిలోగా తీర్పు వెల్లడించాలని కోరుతామని 2014ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీ ఏమయింది?  మీ రాజకీయ అవసరాల కోసం ఎన్ని వేలకోట్లు ప్రజాధనం లూటీ చేసినా వెనుకేసుకొస్తారా? ఇదేనా అవినీతి నిర్మూలన? ఇదేనా ఆర్ధిక నేరగాళ్ల భరతం పట్టడం? ఇదేనా మోదీ సత్య సంధత? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్ధిక నేరగాళ్లను నిరపరాధులుగా తీర్మానించే దుష్ట రాజకీయం  మోదీ పాలనలో కొత్త కోరలు తొడుక్కుంది. దేశంలో తనకు అనుకూలమైన ఆర్ధిక నేరగాళ్ళు బోరవిరుచుకుని తిరిగే సౌలభ్యం కలిగిస్తున్నారు మోదీ. అది మరిన్ని నేరాలకు దారితీసే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు 
నీతుల మాటున రోతరాజకీయాలు చేస్తూ తిరిగి అధికారంలోకి రావాలని అడ్డదారులు తొక్కుతు అనైతిక పద్దతులు అవలంబిస్తున్నారు. మోడీ పాలనలో దేశ ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకొన్నాయి.14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా వున్న చంద్రబాబు పై ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసు పెట్టి జైలులో పెట్టడం వెనుక  కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండని దేశమంతా కోడై కూస్తున్నది. చంద్రబాబు పై ఎందుకoత అక్కసు వెళ్లగక్కుతున్నారో అర్ధం కావడంలేదు. చంద్రబాబు చేసిన నేరం ఏమిటి? గతంలో  రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని నిలదీయడమేనా చంద్రబాబు చేసిన నేరం? బిజెపి తమ భావజాలం వదిలిపెట్టి జగన్ భావజాలం వంటపట్టించుకొని వికృతంగా వ్యవహరిస్తున్నదని ప్రజలే అంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక  బిజెపి, వైసిపి ఆడుతున్న నాటకం ప్రస్పుటం అవుతున్నది. అడ్డదారిలో చంద్రబాబును  బంధించి అధికారంలోకి రావడం  కొరకు  బిజెపి, వైసిపి  లు సిద్ద పడినట్లు కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో  చంద్రబాబు అధికారాన్ని అడ్డుకొనేందుకు మహా కుట్రల సిద్దాంతాన్ని బిజెపి-వైసిపి ప్రయోగించారు.  గతంలో ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం పనిచేసిన చరిత్ర బీజేపీదని, ప్రజాస్వామ్య వ్యవస్థల స్వేచ్చా స్వాతంత్ర్యంల పరిరక్షణలో తమ క్రియాశీల పాత్రను అద్వాణీ ఆ మధ్య గుర్తు చేసారు. విలక్షణ రాజకీయ పక్షంగా బీజేపీని నిలబెట్టే క్రమంలో తాము పెంచి పోషించిన విలువలకు వలువలు ఊడతీస్తున్నారని అద్వాణీ ఆవేదన చెందారు. సమకాలీన రాజకీయపక్షాల పట్ల శతృత్వ భావన పోవాలని, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించుకోవాలని, రాజ్యాంగ వ్యవస్థల ఔన్నత్యాన్ని నిలబెట్టాలని అద్వాణీ హితబోధ చేసారు. రాజకీయంగా విభేదించే వారిని శత్రువులుగా చూడరాదని అద్వాణీ అనడం మోదీ పెడ ధోరణికి, నియంత మనస్తత్వానికి అద్దం పడుతుంది. దీనిని బట్టి మోదీ ఎంత ప్రమాదకారో అడ్వాణి ప్రకటనలను బట్టి అర్ధం అవుతుంది. అధికారంలో కొనసాగడానికి అనైతిక పద్ధతులు అవలంబిస్తూ మురికి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు కమలనాధులు.    

ఎటువంటి ఆధారాలు లేకుండా నిరపరాధి, 73 ఏళ్ల  చంద్రబాబును అత్యంత దారుణాతి దారుణంగా వేధిస్తూ అరెస్టు చేసి అర్ధరాత్రి రాజమండ్రి జైలులో బంధించి 30 రోజులు దాటినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఖండించేందుకు నోరు తెరవ లేదంటే వారి వ్యూహం ఏమిటో పక్కాగా అర్ధం అవుతున్నది. తెలంగాణా ప్రభుత్వం జగన్ చెల్లెలు షర్మిలను అరెస్టు చేస్తే తెల్లవారి పాటికి  ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోడీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 45 ఏళ్ల రాజకీయ చరిత్ర వున్నచంద్రబాబు ను అరెస్టు చేస్తే  ఖండించలేదంటే మోడీ ,షా ఎంత విద్వేషంతో వున్నారో అర్ధం అవుతున్నది. వారికి  సంబంధలేక పోతే  చంద్రబాబుని అరెస్టు పై  ఎందుకు మాట్లాడరు అని ప్రజలు  ప్రశ్నిస్తున్నారు.1999 నుండి 2004 వరకు 29 మంది ఎంపీలతో  చంద్రబాబు కేంద్రానికి  మద్దతు ఇవ్వక పొతే  కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగేదా? చంద్రబాబు బీజేపీకి చేసిన ద్రోహం ఏమిటి?  కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని చంద్రబాబు గట్టిగా అడగడమే చంద్రబాబు చేసిన నేరమా?  రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు అయినా వుండాలి. లేకుంటే తమ కనుసన్నల్లో నడిచే, తమ అడుగులకు మడుగులోత్తే ప్రభుత్వాలు  అయినా వుండాలి ఇదీ బిజెపి లక్ష్యం గా కనిపిస్తున్నది. ప్రధాని మోడీకి అందరు అవినీతి పరులుగా కనిపిస్తారు. కానీ బిజెపికి మద్దతు ఇచ్చే వారు ఎన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినా వారి అవినీతి కనిపించదు. వారి గురించి మాట్లాడరు. ప్రధాని మోడీ  దృష్టిలో వారు  అవినీతి పరులుకారు.  బిజెపికి మద్దతుగా నిలిచేవారు నీతి మంతులే.  బిజెపిని  వ్యతిరేకించే వారుఅందరూ  అవినీతి పరులే. అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం అవినీతి పరులను అక్కున చేర్చుకోవడాన్ని ఏమనాలి?  ప్రధాని మోదీ అవినీతిపరుడు కాక పోవచ్చు.. కానీ రాజకీయ  అవసరాల కోసం అవినీతి పరులను ఆదరించడం అవినీతి పరులను కాపాడటం కూడా అవినీతి కిందికే వస్తుంది. అత్యంత అవినీతి పరుల  విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న ఔదార్యం దేనికి సంకేతం? రాజకీయంగా తమకు మద్దతు ఇవ్వని ప్రతిపక్ష నాయకుల పట్ల అక్రమ కేసులు పెట్టి  వేధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఎందుకు   భయంకరమైన అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన  వారిపై డజన్లు కొద్ది  సీబీఐ కేసులు నమోదై పన్నెండు ఏళ్ళు దాటినా  ముందుకు పోకుండా అడ్డుకుంటున్నది.  2019 ఎన్నికల్లో అత్యంత అవినీతి పరుడు జగన్ గద్దె నెక్కడానికి మద్దతుగా నిలిచింది బిజెపి ? నేడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా అండగా నిలిచింది బిజెపి. ప్రతిపక్షం తెలుగు దేశాన్ని  అణచివేసే భాధ్యతను వైసీపీ కి అప్పగించింది బిజెపి అధిష్టానం. అందుకే అరాచక పాలన చేస్తూ,అక్రమ కేసులు పెడుతూ, ప్రతిపక్షం సభలను,రోడ్ షోలను అడ్డుకొంటూ నిర్భందించడం అందులో భాగమే. కేంద్రం అండదండలు లేకుండా జగన్ ఇంత  నిరం కుశంగా పాలన సాగించలేరు. జగన్ భుజం పై తుపాకి పెట్టి  తెలుగుదేశాన్ని కాల్చాలని చూస్తున్నది బిజెపి అధిష్టానం.ముందు చంద్రబాబుని దెబ్బతీస్తే, జగన్ రెడ్డిని ఎప్పుడైనా దెబ్బతీయవచ్చని బిజెపి ఆలోచన. జగన్ రెడ్డి వేదింపులు,ప్రతీకారం  తట్టుకోలేక చంద్రబాబు తమ వద్దకు వచ్చి లొంగి పోవాలని బిజెపి భావిస్తున్నది. అందుకే రాష్ట్రంలో ఫాసిస్టు పాలనకు అండగా నిలుస్తున్నది బిజెపి.
             
               బిజెపి -వైసీపీ మధ్య క్విడ్ -ప్రోకో ఒప్పం జరిగింది. చట్టం ముందు అందరు సమానమే  అన్న సూక్తి జగన్ విషయంలో ఎందుకు అమలు కావడం లేదు? రాజకీయ అవసరాల కోసమే జగన్ పై ఈగ వాలనీయడం లేదు.కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుక లా వ్యవహరిస్తూ ప్రధాన కేసులను సీబీఐ  నీరు కారుస్తున్నది. ఈ డీ,సీబీఐ కేసులే కాదు బాబాయి వివేకా హత్య కేసులలోనూ అండగా నిలుస్తున్నది బిజెపి..వివేకానంద రెడ్డి హత్యకు కారకులు ఎంపీ అవినాష్ రెడ్డి,ఆయన తండ్రి బాస్కర్ రెడ్డి అని సీబీఐ చార్జి షీట్ లో నిర్ధారించింది.అవినాష్ రెడ్డిని అరెష్టు చేయాలని సీబీఐ అధికారులు అనుకొన్నా అది జరగ లేదంటే ఇందులో కూడా కేంద్ర పెద్దల సూచనల మేరకే సీబీఐ వ్యవహరించింది .కేంద్రం తో జగన్ అనుభంధ ఫలితమే అని చెప్పాలి . పీకల్లోతు అవినీతి కేసులు నుండి జగన్ బయట పడాలి అంటే కేంద్ర బిజెపి పెద్దల చల్లని చూపు అవసరం. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వక పోయినా జగన్-కేంద్రప్రభుత్వంతో  పోరాడే పరిస్తితి లేక రాష్ట్ర ప్రయోజనాలే తాకట్టు పెట్టారు.కేంద్రం రాష్ట్రానికి న్యాయం చెయ్యక పోగా,రాష్ట్రాన్ని అన్నీవిధాలా నాశనం చేస్తున్న జగన్ కేంద్రానికి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. 


                    ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా చంద్రబాబుని అరెస్టు చేసిన జగన్  ప్రభుత్వానికి బిజెపి అండగా నిలవడం అత్యంత దుర్మార్గం. బిజెపికి అండగా నిలిచిన వారు,మద్దతు ఇచ్చిన వారు ఎంత  అవినీతికి పాల్పడినా పర్వాలేదు. వారికి  మద్దతు ఇస్తున్న అవినీతి పరులందరు నిర్దోషులని ప్రధాని మోదీ నమ్ముతున్నారు? అలా భావిస్తే ఆ మాటే ప్రజలకు చెప్పండి, మీకు మద్దతు ఇస్తున్న జగన్ పై వున్న కేసులు ఎత్తి వెయ్యండి? ఒక పక్క అవినీతి ఆరోపణలు ఉన్నవారి పట్ల  ఉదాసీనత చూపిస్తూ,మరో పక్క ప్రతిపక్షాలు  అవినీతిపరులని చేస్తున్న ఆరోపణలకు  విలువ ఉంటుందా?బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో  మంత్రులుగా ఉన్నవారు అవినీతికి పాల్పడినా, ఆ యా రాష్ట్రాల్లో బిజెపి వారి పై  అవినీతి ఆరోపణలు వచ్చినా మంత్రులపై సీబీఐ, ఈడీ అధికారుల దాడులు జరగనే జరగవు, వారి పై ఈగ కూడా వాలదు. అదే ఇతర రాజకీయ ప్రభుత్వాల మంత్రులు పై  ఆరోపణలు రావడమే ఆలస్యం వారి ఇళ్ల పై  సీబీఐ, ఈడీ అధికారులు వాలిపోతారు.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బిజెపిలో జాయిన్ అవగానే పవిత్రులుగాను, అవినీతి ఆరోపణలు వచ్చిన వారు బీజేపీలో చేరకుంటే  అవినీతి పరులుగా చూపిస్తున్నారు. ఇంతటి వ్యత్యాసం చూపుతున్నప్పుడు ప్రధాని మోదీ చెబుతున్న సుభాషితాలకు విలువ ఏమి ఉంటుంది?అధికారంలోకి రాగానే రాజకీయ నాయకుల పై వున్నఅవినీతి కేసుల లెక్క తేలుస్తామని,విచారణ వేగంగా పూర్తీ చేసి రాజకీయాలను ప్రక్షాలన చేస్తామని 2014 ఎన్నికల ప్రచార సభల్లో మోడీ  హామీ ఇచ్చి పదేళ్ళు కావస్తుంది. మరి పదేళ్లుగా  అవినీతి పరులు పై ఈగైనా వాలిందా?అవినీతి పరుల అంతు చూసే బలం,చేవ,ధైర్యం,సమర్ధత ఉండి కూడా చర్యలు తీసుకోక పోవడంలో ఆతర్యం ఏమిటి? 2014 ఎన్నికల్లో అధికారం ఇస్తే అచ్చే దీన్ తెస్తాను అన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఆర్ధిక నేరస్తులకే అచ్చే దీన్ వచ్చింది నిజం కాదా? 

                   ఆర్ధిక నేరగాళ్ల అంతు చూడటమే నా పంతం అని ప్రగల్భాలు పలికి ఎల్లలెరుగని అవినీతికి పాల్పడిన ఆర్ధిక నేరస్తులను  అక్కున చేర్చుకొన్నారు. జగన్ అవినీతి కేసులు ఎన్నేళ్లకు తెములుతాయో చెప్పగల నాధుడు లేడు. న్యాయస్థానాల ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్న కేసుల్లో  కూడా సత్వరం దోషులకు శిక్షలు పడతాయనుకొనే వీలులేకుండా పోయింది. ఆర్ధిక నేరస్తుల పై వున్న కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేసి శిక్షలు పడే విధంగా చూడాలని దేశ సర్వోన్నత న్యాయ స్థానం అభిప్రాయ పడింది. ప్రభుత్వ సహకారంతో వేలకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై విచారణ జరిగే తీరు ఇదేనా? టన్నులు కొద్దీ పత్రాలు సాక్షాధారాలు వున్న  కేసుల విచారణ నత్తనడక నడవడంలో ఔచిత్యం ఏమిటి?  వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేసిన వారి పట్ల కేంద్రప్రభుత్వం, సీబీఐ ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆంతర్యం  ఏమిటి?మేం అధికారంలోకి రాగానే రాజకీయ నాయకులపై వున్న అవినీతి కేసుల లెక్క  తేలుస్తాం,విచారణ వేగంగా పూర్తిచేసి రాజకీయాలను ప్రక్షాలన చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచార సభల్లో వల్లించిన ఘన ఆదర్శాలు గాలికి పోయాయి.మోడీ పాలనలో  ఆర్ధిక నేరస్థుల పై ఈగైనా వాలక పోగా  అపూర్వ వైభవంతో వెలిగిపోతున్నారు. అధికారంలోకి వస్తే ఆర్ధిక నేరస్థుల అంతు చూస్తానని ఇచ్చిన హామీ కూడా నేతి బీర చందమైంది..దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చెయ్యడానికి మోడీ చెయ్యని దుర్మార్గం లేదు. అవినీతిపరులను అంతుచూస్తానని బూటకపు వాగ్దానంతో బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చి అవినీతి పరుల మోచేతి నీళ్ళు తాగుతున్నారు.అవినీతి పరులు బోరవిరుచుకు తీరుతుంటే,శాసన నిర్మాతలై వెలిగిపోతుంటే ప్రధానికి కనిపించడం లేదా?ఆర్దిక నేరస్తులకే చౌకీదారుగామోదీ వ్యవహరిస్తున్నారు తప్ప దేశ ప్రజలకు మాత్రం కాదు. నీతులు మాటున రోతరాజకీయాలు చేస్తూ తిరిగి అధికారంలోకి రావాలని అడ్డదారులు తొక్కుతు అనైతిక పద్దతులు అవలంభిస్తున్నారు కాషాయదళం.                                       
 

 నీరుకొండ ప్రసాద్ 

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు నియామకం

  అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ని నియమించారు.  విప్ బాధ్యతలు సభలో సభ్యుల హాజరు, అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలను సమీక్షించడం, పార్టీ విధానాలను అమలు చేయడం వంటి కీలక అంశాలను కవర్ చేయనున్నారు. కేసీఆర్ తన అసెంబ్లీ నాయకత్వానికి మద్దతుగా మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు. శాసన పభ సమావేశాల్లో పార్టీ తొలి ప్రతినిధిగా మధుసూదనాచారీని కొనసాగించడం ద్వారా పార్టీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల అమల్లో కీలకంగా మారనుంది.  

తెలంగాణ మునిసి‘పోల్స్’ షెడ్యూల్ ఎప్పుడో తెలుసా?

తెలంగాణలో మునిసిల్  ఎన్నికలకు రేవంత్ సర్కార్ దాదాపుగా ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఇప్పట్ల కాదని విస్పష్టంగా చెప్పేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల తరువాత జడ్పీఎన్నికలు ఉంటాయని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.  పరిషత్ ఎన్నికల కంటే ముందే ముమునిసిపోల్స్ పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఎన్నికల ఏర్పాట్లను కూడా వేగవంవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే  రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల తయారీ , ప్రచురణకు సంబంధించి  షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్తగా ఖరారు చేసిన వార్డుల ప్రకారం ఓటర్ల జాబితాలను జనవరి పదో తేదీలోపు ఖరారు చేసి ప్రకటించేదిశగా అడుగులు వేస్తున్నది.  పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో  వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ఆధారంగా ఈ విభజన ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ,తుది జాబితా ప్రచురణ జనవరి పదో తేదీకి పూర్తి  కానున్నది.  ముందుగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి, స్థానిక ప్రజల నుంచి సలహాలు, సూచనలు ,అభ్యంతరాలను స్వీకరిచిన తరువాత,  మార్పులు చేర్పులు చేసి నిర్దేశిత   గడువులోగా తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా ప్రదర్శిస్తారు. వార్డుల విభజన , రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా దీనికి సమాంతరంగా సాగుతోంది. ముఖ్యంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన చేపట్టి, ఆ తర్వాతే ఓటర్లను ఆయా వార్డులకు కేటాయించనున్నారు. ఇక పాత విధానంలోనే రిజర్వేషన్ల అమలు ఉండనుంది.    

జ‌గ‌న్ కార్య‌క‌ర్త‌ల చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు

రప్పారప్పా అన్న వారిని రఫ్పాడిస్తున్న పోలీసులు వైసీపీ కార్యకర్తల మెడకు రప్పారప్పా కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఇష్టారీతిగా రప్పరప్పా అంటూ దౌర్జన్యాలకు పాల్పడతామంటూ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా, రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీలకు మూగజావాలను బలి ఇచ్చి రక్తాభిషేకాలు రెచ్చిపోయిన కార్యకర్తలు, జగన్ అభిమానులు ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు.   ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు  సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు. ఇప్పుడు ఆ విషయంలోనే వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఔను ఎక్కడెక్కడ ఎక్క‌డ ర‌ప్పా ర‌ప్పా అంటూ  ఈ జంతు బ‌లులు ఇచ్చారో అక్కడక్కడ అలా రక్తతర్పఫాలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు, కార్యర్తలపై కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ కార‌ణంగా జైళ్ల‌కు పోయి వ‌చ్చిన లీడ‌ర్ల‌ సంఖ్య విప‌రీతంగా ఉంటే ఇప్పుడది కార్యకర్తల వరకూ పాకింది.  అంటే జ‌గ‌న్ ప్రాపకం కోసం కార్యకర్తలు చేసిన అతి వారిని కేసుల్లో ఇరుక్కునేలా చేసింది. అయినా రప్పారప్పా పోస్టర్లను, జంతు బలులను, రక్తాభిషూకాలు, రక్తతర్పణాలను అడ్డుకుని, అందుకు పాల్పడిన వారిని మందలించాల్సింది పోయి, జగన్ వారిని ప్రోత్సహించడం వల్లే పరిస్థితి ఇంత వరకూ వచ్చిందని ఇప్పుడు వైసీపీ క్యాడరే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. జగన్ తన కార్యకర్తలను కూడా క్రిమినల్స్ గానే తీర్చిదిద్దాలన్న భావనలో ఉన్నారు కనుకనే  ఎంతగా రెచ్చిపోతే అంతగా ప్రోత్సాహం అన్నట్లుగా వారిని రెచ్చగొడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జ‌గ‌న్  పై కేసులు ఉన్నాయి.. అయితే ఆయన లీగల్ టీమ్ ను కోట్లు చెల్లించి మరీ పోషిస్తున్నారు. అయితే.. సామాన్య కార్యకర్తకు ఆ వెసులుబాటు ఉండదు. కేసుల్లో ఇరుక్కుంటే పార్టీ నుంచి ఇసుమంతైనా సాయం అందదు. దీంతో వారు జైళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా జగన్  కార్యకర్తలను క్రిమినల్ కార్యకలాపాలవైపు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే..  జ‌గ‌న్ త‌న హయాంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో  కార్యకర్తలను పట్టించుకున్న పానాన పోలేదు. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కోసం ఇంత చేస్తే తమకు జైళ్లు, కేసులూ బహుమతా అంటూ ఫ్రస్ట్రేషన్ కు గురౌతున్న పరిస్థితి.   

అజ్ణాతంలో వల్లభనేని వంశీ .. గాలిస్తున్న పోలీసులు?

చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదంటారు. చేసిన పాపం ఊరికే పోదని కూడా నానుడి. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 204 వరకూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాడు చేసిన తప్పులన్నీ ఇప్పుడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. ఒకరు ఇద్దరే అని కాదు గత వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు అరెస్టై జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరి కొందరు అరెస్టై ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యారు. ఇంకా కొందరు అరెస్టు అవుతామన్న భయంతో వణికి పోతున్నారు. కొందరైతే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అలాంటి నేతలలో వల్లభనేని వంశీ ఒకరు.  వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ చేసిన తప్పిదాలకు సంబంధించి పలు కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో నమోదైన అభియోగాలపై ఆయన ఇప్పటికే అరెస్టై.. నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్న వల్ల భనేని వంశీ కొద్ది కాలం కిందట బెయిలుపై విడుదలయ్యారు.  బెయిలుపై విడుదలైనా ఆయన రాజకీయాలకు దూరంగా దాదాపుగా ఏకాంత వాసం అనుభవిస్తున్నట్లుగా మెలుగుతున్నారు.  అయితే తాజాగా ఇప్పుడు ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయినట్లు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.  కొత్తగా తనపై నమోదైన కేసులో అరెస్టు భయంతోనే ఆయన అజ్ణాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సునీల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై తాజాగా కొత్త కేసు నమోదైంది.  జూన్ 2024లో  వంశీ తన అనుచరులతో సునీల్ ను హత్య చేయడానికి కుట్రపన్నారన్నది ఆ కేసు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ వంశీ  హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాల్సిందిగా పోలీసులు వంశీకి నోటీసులు అందించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఇప్పటికే వల్లభనేని వంధీ కిడ్నాప్, బెదరింపులు, ఎస్సీఎస్టీ అట్రాసిటీస్, తెలుగుదేశం గన్నవరం కార్యాలపంపై దాడి తదితర కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ కేసులలో అరెస్టై బెయిలపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా కేసులో అరెస్టు భయంతో  వల్లభనేని వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.