గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ...ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది. ఐటీ ఉద్యోగాలు, స్టార్టప్ కల్చర్ మాత్రమే కాదు… ‘స్టార్ హోటల్ డ్రగ్ పార్టీలకు’ కూడా గచ్చిబౌలి కేరాఫ్ అడ్రస్గా మారిందని తాజా ఘటన మరోసారి రుజువు చేసింది.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి మసీద్బండా ప్రాంతంలో ఉన్న కోవ్ స్టేస్ హోటల్లో జరిగిన డ్రగ్ పార్టీపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్, గచ్చిబౌలి పోలీసుల సంయుక్త దాడులు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హోటల్ రూమ్లో రీయూనియన్ పేరుతో మత్తులో మునిగిపోయిన యువకుల ఆటలు, పోలీసుల ఎంట్రీతో ఒక్కసారిగా ఆగిపోయాయి. పోలీసుల విచారణలో బయటపడిన నిజాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. 2019లో హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసిన నలుగురు యువకులు కలిసి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో రీయూనియన్ ప్లాన్ చేసుకున్నారు.
అదే సమయంలో మరో పాత స్నేహితుడు కూడా వీరిని కలిశాడు. ఈ ఐదుగురు గతంలో ఒక పెళ్లి వేడుకలో తొలిసారి గంజాయి సేవించారు. ఈరోజు అందరూ కలవడంతో మళ్లీ గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేశారు. రీయూనియన్ అంటే పాత ఫోటోలు, పాత జ్ఞాపకాలు కాదు… పాత మత్తే ప్రధాన అజెండాగా మారింది. పోలీసుల చేతికి చిక్కిన వారు హైదరాబాద్లోని ప్రముఖ స్టార్ హోటళ్లలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న యువకులు వారిని చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు.
మణికొండ కు చెందిన మెఘేందర్ (29) – ఫ్రీలాన్సర్ బార్ టెండింగ్ గా పని చేస్తున్నాడ. కూకట్పల్లికి చెందిన తేజేశ్వర్ (28) – ఫుడ్ అండ్ బేవరేజెస్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. రామంతపూర్ కు చెందినసాయి ప్రసాద్ (28) – మనోహర్ హోటల్ మేనేజర్గా పని చేస్తున్నాడు. శేర్ లింగంపల్లి కి చెందిన రమేష్ (27) – లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు... నలుగురు యువకులు ఫుడ్ అండ్ బేవరేజెస్ మేనేజర్లు, హోటల్ మేనేజర్లు, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్లు…అతిథులకు సేవ చేసే వారు, మత్తుకు సేవ చేస్తున్నారు.
సమాచారం అందుకున్న ఈగిల్ ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులు కలిసి జనవరి 6న హోటల్ రూమ్ నెంబర్ 309పై దాడులు నిర్వహిం చారు. రూమ్లో ఏడుగురు మద్యం సేవిస్తూ హంగామా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గది మొత్తం తనిఖీ చేయగా.. గంజాయి లభించకపోయినా, అనుమానం నివృత్తి కోసాం అందరికీ యూరిన్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు ఐదుగురికి గంజాయి సేవించినట్లు పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రోజు గంజాయి సేవించినట్లు వారే స్వయంగా అంగీకరించారు.
బేగంపేట్ కు చెందిన టి. రవి (27) – ఏఆర్పీసీ, సీఏఆర్ హెడ్క్వార్టర్స్, హైదరాబాద్ కమిషనరేట్ లో పనిచేస్తున్నాడు. ఇతను కూడా ఈ నలుగురితో కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు. సీఏఆర్ హెడ్క్వార్టర్స్లో పనిచేస్తున్న ఏఆర్పీసీ స్థాయి అధికారి మత్తులో పట్టుబడటం పోలీస్ విభాగంలో కలకలం రేపింది. చట్టాన్ని కాపాడాల్సినవారే చట్టాన్ని మరిచిపోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 41/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, ముఖ్యంగా హోటల్, ఐటీ రంగాల్లో పనిచేసే యువత ఈ మత్తు మాయలో పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. స్టార్ హోటల్, రీయూనియన్, పార్టీ పేరుతో మత్తు పదార్థాలకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఈగిల్ ఫోర్స్ హెచ్చరించారు.