శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం జ‌రుగ‌నున్న పుష్ప‌యాగానికి బుధ‌వారం (అక్టోబర్ 29) రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయించడాన్ని ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు.

సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు ఈ విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు. రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన శ్రీ విష్వ‌క్సేనుల వారిని ఆల‌యం నుండి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్క‌డ మృత్సంగ్ర‌హ‌ణం, ఆస్థానం నిర్వ‌హించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9గంట‌ల నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం ర‌ద్దు చేసింది.  

ఇలా ఉండగా శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం (అక్టోబర్ 30) పుష్పయాగం సంద‌ర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత  మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

2025.. ఏపీకి పెట్టుబడుల నామ సంవత్సరం

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి 2025 సంవత్సరం పెట్టుబడుల నామ సంవత్సరంగా  మారింది.  ఇక్కడా, కేంద్రంలోనూ కూడా ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉండటం.. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా  ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తాయి. అలాగే పలు ప్రముఖ సంస్థలు సైతం రాష్ట్రంలో తమ పరిశ్రమల ఏర్పాటుకు వరుస కట్టాయి.  ఈ ఏడాది రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు రావడంతో పారిశ్రామిక రంగానికి ఇది స్వర్ణ వత్సరంగా మారిందని చెప్పవచ్చు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు సర్కర్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేసింది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో  2025 సంవత్సరం మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. రాజధాని అమరావతి ప్రాంతంలో సైతం వివిధ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పరిస్థితులు,  ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు విజన్, కార్యదక్షత, ఎడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కళ్లకు కడుతుంది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, పి. నారాయణ వివిధ దేశాల్లో పర్యటించి.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు వివరించారు. ఆ కారణంగా విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ డూపర్ సక్సెస్ అయింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. దీంతో విశాఖపట్నం మాత్రమే కాదు.. రాష్ట్ర ముఖ చిత్రం మారనుంది. ఇక గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్పోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. విశాఖపట్నంలో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ. లక్షన్నర కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి.  విశాఖపట్నం వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో సుమారు రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది.  640 అవగాహన ఒప్పందాల ద్వారా రూ. 13.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవి కార్యరూపం దాలిస్తే.. దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం వేదికగా ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. రూ. 93 వేల కోట్ల పెట్టుబడితో ఈ డేటా సెంటర్‌తోపాటు ఏఐ కేంద్రాన్నీ ఏర్పాటు చేయనుంది. అలాగే రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ ఏర్పాటు చేయనుంది. అలాగే పలు ప్రముఖ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని చెప్పడానికి 2025 సంవత్సరంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు వరుస కట్టడమే నిదర్శనం.    ఇదే విశాఖ వేదికగా టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలు తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.  ఇక బీపీసీఎల్  నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో రూ. 96 వేల కోట్లతో అయిల్ రిఫైనరీతోపాటు పెట్రో కెమికల్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అనకాపల్లి జిల్లాలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యు సిటీ నిర్మాణం  ద్వారా ఏవియేషన్ రంగంలో నిపుణులను తయారు చేయనుంది. ఇక విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రంయ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 2026 జనవరి 2వ తేదీన ఈ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ కానుంది.  ఢిల్లీ నుంచి వచ్చే ఈ విమానంలో కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతోపాటు విజయనగరం ఎంపీ కె. అప్పలనాయుడు రానున్నారు. అందుకోసం ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం కేటాయించిన నిధులతో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో జీరో టాలరెన్స్.. సజ్జనార్

నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా, గుర్తుండిపోయేలా జరుపుకోవాలంటే తాగి వాహనం నడపడం కూడదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ మందుబాబులకు సూచించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పిన సజ్జనార్.. న్యూ ఇయర్ వేడుకలకు అర్ధరాత్రి దాటిన తరువాత ఒక గంట మాత్రమే సమయం ఇచ్చినట్లు చెప్పారు. ఒంటి గంటకల్లా వేడుకలు ముగించేయాలన్నారు.   బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి క్షేత్ర స్థాయి పోలీసు అధికారులతో బుధవారం (డిసెంబర్ 31) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జనార్ ఈ సందర్భంగా  భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగించినా,  వైన్ షాపులు, బార్ల సమయం ముగిశాక ‘బ్యాక్ డోర్’ ద్వారా మద్యం విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.   బుధవారం (డిసెంబర్ 31) రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో 'డ్రంక్ అండ్ డ్రైవ్' సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మద్యం మత్తులో పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు, వాహనాల సీజ్ వంటి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జనవరి మొదటి వారం వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాగి డ్రైవ్ చేస్తే పట్టుబడకుండా తప్పించుకునే మార్గాలే లేవని హెచ్చరించిన సజ్జనార్..  డ్రంక్ డ్రైవింగ్‌పై   జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నట్ల చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు బడితే.. చంచల్ గూడ జైలకేనన్నారు.   హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగ చేస్తే క్యాబ్, ఆటో, బైక్ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ అన్నారు. న్యూఇయర్ సందర్భంగా  అర్ధరాత్రి వేళల్లో క్యాబ్, ఆటో సేవలను నిరాకరించడం లేదా బుక్ చేసిన చార్జీల కంటే అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు  తప్పవని హెచ్చరించారు.  

తెలంగాణ తిరుమల యాదాద్రి ఉన్నా.. అందరి బాటా తిరుమలేనా?

కేసీఆర్ జ‌మానాలో వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేసి  యాదాద్రిని భూత‌ల వైకుంఠ‌మా అన్న‌ట్టుగా  తీర్చి దిద్దారు. అదేం వింతో- విడ్డూర‌మో- విచిత్ర‌మో.. తెలంగాణ‌ సీఎం రేవంత్ ద‌గ్గ‌ర్నుంచి మొద‌లు పెడితే, బీఆర్ఎస్ నాయకులు  స‌హా అందరూ ముక్కోటి సంద‌ర్భంగా తిరుమ‌ల బాట ప‌ట్టారు.. కార‌ణ‌మేంటి? అంటే తిరుమ‌ల‌వెంక‌న్న‌క‌న్నా మించిన క‌లియుగ దైవం లేద‌నా?  లేక యాదాద్రి ప్రముఖ్యతను గుర్తించడం లేదా అన్న చర్చకు తెరలేచింది.   వాస్తవానికి తిరుమ‌ల ఈ స్థాయిలో ఉండ‌టానికి ఇక్క‌డి  పూజారి  వ్య‌వ‌స్థ ఎంతో ముఖ్య‌ కారణమని అంటారు. ఆ వ్యవస్థే తిరుమ‌ల‌ను మిగిలిన ఏ ఆల‌యం కన్నా కూడా మిన్నగా నిలుపోందని చెబుతారు.  ఎవ‌రైతే ఆ ఆల‌యంలో సాక్షాత్ వైకుంఠంలో జ‌రిగిన‌ట్టే అన్ని పూజాదికాల‌ను జ‌రుపుతారో ఆ ఆల‌యం ఇల వైకుంఠం అవుతుంది. తిరుమ‌ల ఆల‌యం కన్నా పెద్ద ఆల‌యాలు లేక పోలేదు. శ్రీరంగం తిరుమ‌లకే కాదు ఏకంగా, వైష్ణ‌వ మ‌తానికే కేంద్ర కార్యాల‌యం. కానీ, తిరుమ‌ల శ్రీరంగం, తిరువ‌నంత‌పురం ప‌ద్మ‌నాభ స్వామి వారి ఆల‌యాల‌కు మించిన ప్రాభ‌వాన్ని,  వైభ‌వాన్ని సొంతం చేసుకుందంటే అందుకు కార‌ణం ఇక్క‌డ జ‌రిగే క్ర‌తువులు అన్నీ ఆగ‌మ శాస్త్ర బ‌ద్ధంగా ఉంటాయి. ఇక తిరుమ‌ల  శ్రీవారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఎలా వ‌చ్చిందో చూస్తే.. అప్ప‌ట్లో అంటే..  14వ శ‌తాబ్దంలో తురుష్కులు.. శ్రీరంగంపై దండెత్తుతున్నార‌ని తెలిసి అక్క‌డి దేవ‌తా  విగ్ర‌హాల‌న్నిటినీ తిరుమ‌లకు త‌ర‌లించి.. ఇక్క‌డి  నుంచే  రంగ‌నాథుడికి నిత్య కైంక‌ర్యాల‌ను సాగించేవారు. అందులో భాగంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం వంటి ఏర్పాట్లు శ్రీనివాసుడి  స‌మ‌క్షంలో జ‌ర‌ప‌డం మొద‌లైంది. అందుకే ఇక్క‌డ తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో  ఉన్న రంగ‌నాథ మండ‌పం   ఆనాటి రంగ‌నాథుడు తిరుమ‌ల‌లో ఉన్నాడ‌ని చెప్ప‌డానికి గుర్తుగా నిలుస్తుంది. అయితే, త‌ర్వాతి  కాలంలో రంగ‌నాథుడు తిరిగి శ్రీరంగం వెళ్లిపోయినా.. ఇక్క‌డ వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఒక ఆచారంగా నిలిచిపోయింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం అన్ని వైష్ణ‌వాల‌యాల్లో ఒక ఆన‌వాయితీగా వ‌చ్చింది. అందులో భాగంగా యాదాద్రి ల‌క్ష్మీ నార‌సింహ స్వామి వారి ఆల‌యంలోనూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. అయినా తెలంగాణ తిరుమ‌ల అయిన యాదాద్రి కంటే.  రాష్ట్ర నాయకులు, వీరిలో ఆంధ్ర ఆధిపత్యం అంటూ నిత్యం విమర్శలు గుప్పించేవారు కూడా తెలంగాణ తిరుమల కంటే తిరుమల వెంకన్న దర్శనమే మిన్న అన్నట్లుగా తిరుమల బాటే పడుతుంటారు. తిరుమలలో తెలంగాణ పొలిటీషియన్లకూ ప్రొటోకాల్ కావాలంటూ తెలంగాణ అసెంబ్లీలో గళమెత్తుతుంటారు. కానీ తెలంగాణ తిరుమల అయిన యాదాద్రిని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారంటూ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో అపచారం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం

సుప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో  ఘోర అపచారం జరిగింది. సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని గుర్తుతెలియని దుండగులు సోమవారం (డిసెంబర్ 29 రాత్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై   స్థానికులు, భక్తులు తీవ్ర  ఆగ్రహం వ్యక్తంచేస్తు న్నారు.  శివలింగాన్ని సుత్తి వంటి  ఆయుధంతో కొట్టి ధ్వసంం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే  కోససీమ జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని   పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి ఆధారాలను సేకరించారు. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో, చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.  ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశించారు. మంత్రి ఆనం స్పందిస్తూ.. ధ్వంసమైన చోట ఇప్పటికే వేద పండితుల సమక్షంలో కొత్త శివలింగాన్ని పునఃప్రతిష్ఠించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఖండించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, హిందూ ధర్మంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 2 నుంచి 9 వ తేదీ వరకూ దాదాపు 21.80 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాసుపుస్తకాలను రైతులకు అంద జేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఒక వేళ ఆ పాసుపుస్తకాలలో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునే అవకాశం కూడా అధికారులు కల్పిస్తున్నారు. ఈ పాసుపుస్తకాల పంపిణీ కోసం ఊరూరా గ్రామ సభలు నిర్వహించనున్నారు.  వైసీపీ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోను ముద్రించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మా పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటంటూ రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ప్రభుత్వం   ప జగన్ బొమ్మను తొలగించి రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలను ముద్రించి రైతులకు పంపిణీ చేస్తోంది. 

4న భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముస్తాబౌతోంది.  విమానాశ్రయ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ట్రయల్ రన్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు అధికారులు. వచ్చే నెల 4న తేదీన భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ లో భాగంగా తొలి విమానం ల్యాండ్ కానుంది.   ఫైనల్ టెస్ట్ రన్‌లో భాగంగా ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం జనవరి 4న ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుంది.  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ   ఉన్నతాధికారులు ఆ విమానంలో భోగాపురం విమానాశ్రయానికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తారు.  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంతో జరగడానికి ప్రధాన కారణం కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడి చొరవే కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇప్పటికే విమానాశ్రయం నిర్మాణ పనులు95 శాతానికి పైగా పూర్తయ్యాయి.  మిగిలిన పనులు కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.   ఈ నేపథ్యంలోనే  జనవరి 4న జరిగే  ఫైనల్  ట్రయల్ రన్  నిర్వహించనున్నారు. ఆ తరువాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇతర విమానయాన సంస్థలతో చర్చలు జరిపి.. పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే తేదీని ఖరారు చేస్తారు.  

సంతకం చేయలేను.. అనుమతించండి.. ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై షరతులతో కూడిన బెయిలుపై ఉన్న మిథున్ రెడ్డి.. కోర్టు విధించిన షరతుల నుంచి మినహాయింపు కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు మిథున్ రెడ్డికి బెయిలు ఇస్తూ విధించిన షరతులలో ఒకటి ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలన్నది ఒకటి. ఇప్పుడు ఆ షరతు నుంచి మినహాయింపు కోరుతూ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు విధించిన షరతు మేరకు ఆయన జనవరి 2( శుక్రవారం) సిట్ కార్యాలయంలో సంతకం చేయాల్సి ఉంది. అయితే ఆ రోజు తాను సిట్ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయలేననీ, అందుకు అనుమతించాలని మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కార్యాలయంలో మంగళవారం (డిసెంబర్ 30) పిటిషన్ దాఖలు చేశారు.  కాగా కోర్టు మిథున్ రెడ్డి పిటిషన్ ను బుధవారం (డిసెంబర్ 31) విచారించనుంది. 

హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త, గుంతలు కనిపించొద్దు : సీఎం రేవంత్

  హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కోర్-అర్బన్ రీజియన్‌ను సమగ్రంగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని హైదరాబాద్ నగర జోనల్ కమిషనర్లను సీఎం ఆదేశించారు. నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో అతి సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. ఈ విషయంలో అలసత్వం వద్దని జోనల్ కమిషనర్లు దీనికి బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగర పునర్వ్యవస్థీకరణ అనంతరం కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నగరంలో చెత్త నిర్వహణ అత్యంత క్లిష్టమైన సమస్యగా మారింది. ఈ అంశంపై జోనల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చెత్త నిర్వహణతో పాటు జోన్ల వారీగా ప్రజల సమస్యల పరిష్కారం జోనల్ కమిషనర్ల ప్రధాన బాధ్యత. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పరిశీలనలు తప్పనిసరిగా చేయాలి.నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడమే ప్రభుత్వ లక్ష్యం. దశలవారీగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలి. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలి. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిదీ” అని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడా చెత్త, గుంతలు కనిపించకూడదునెలకు మూడు రోజులు శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రోడ్లపై గుంతలు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలని సూచించారు.ప్రతి పది రోజులకు ఒకసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి. టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలి. దోమల నివారణతో పాటు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్-అర్బన్ ఏరియాలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. నగరంలో కాలుష్య నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని చెప్పారు.  జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర పౌరసేవలకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. మీసేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి సీఎం తెలిపారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్ మెంట్ అసోసియేషన్ లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలని తెలిపారు.  హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు సమన్వయంతో పని చేయాలి. జనవరిలో నాలాల పూడిక తీత పనులు మొదలు పెట్టాలి.  నగరంలో వీధి దీపాల నిర్వహణలో లోపం ఉండొద్దు. CURE ఏరియాలో వివిధ విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకోవాలి. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్లు వారి పరిధిలో చర్యలు చేపట్టాలి. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వీలయినంత వేగంగా స్పందించాలి. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు  

న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో సైబర్ మోసగాళ్ల టోకరా

  నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్తరకం ఎత్తుగడలకు తెరలేపారు... “న్యూ ఇయర్ గ్రీటింగ్స్”, “గిఫ్ట్ వచ్చింది” అంటూ లింకులు, ఏపీకే (APK) ఫైల్స్ పంపిస్తూ అమాయకపు జనాలపై వల విసురుతు న్నారు. . గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వస్తున్న ఈ ఫైల్స్‌ను ఓపెన్ చేస్తే మొబైల్ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న ఏపీకే గిఫ్ట్ ఫైల్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌లో ఉన్న కీలక సమాచారం మొత్తం హ్యాక్ అవుతోంది. ముఖ్యంగా బ్యాంక్ యాప్స్, వాలెట్ యాప్స్‌ను ఓపెన్ చేసి ఖాతాల్లోని డబ్బును క్షణాల్లో ఖాళీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది నేర గాళ్లు బాధితుల పేరుతోనే వారి కాంటాక్ట్స్‌లో ఉన్న వ్యక్తులకు “డబ్బులు కావాలి” అంటూ మెసేజ్‌లు పంపి మోసానికి పాల్పడు తున్నారు. అలాగే వాట్సప్‌ను హ్యాక్ చేసి బాధితుల స్నేహితులు, బంధువులకు డబ్బులు పంపాలని మెసేజ్‌లు పంపుతున్న ఘటనలు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి.  ఈ తరహా మోసాల వల్ల ఇప్పటికే పలువురు లక్షల రూపాయలు కోల్పోయినట్లు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.ఈ విషయంలో డీసీపీ, సైబర్ క్రైమ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్, గిఫ్ట్ లింకులు ఓపెన్ చేయవద్దు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో వచ్చే అనుమా నాస్పద మెసేజ్‌లను ఓపెన్ చేయకూడదు...ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసు లను సంప్రదించాలి. ఒకవేళ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లినట్లు గుర్తిస్తే, తక్షణమే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాకుండా తక్షణమే బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయాలని, పాస్‌వర్డ్స్ మార్పు చేయాలని సూచించారు. నూతన సంవత్సరం సంబరాల సమయంలో చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నూతన సంవత్సరం వేళ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం

  నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకోవాలంటే మందు, చిందు ఉండాల్సిందే... ఈ కొత్త సంవత్సరం వేడుక ల్లో మద్యం విపరీతంగా అమ్ముడు పోతుంది. అయితే దీన్నే లక్ష్యంగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మద్యం బాటిల్స్ తీసుకువచ్చి ఇక్కడ విక్రయించి డబ్బులు సంపాదించాలని ఆశించారు కానీ పాపం పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో జైలు పాలయ్యారు. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ పహాడ్‌ షరీప్‌తో పాటు సంగారెడ్డి ప్రధాన రహదారిలో నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ మద్యమును పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 229 మద్యం బాటిళ్లతో పాటు 7.165 లీటర్ల మద్యంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పహాడ్‌షరీప్ ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ నిర్వహించిన తనిఖీల్లో, ఎయిర్‌పోర్టు మార్గంగా గోవా, ఢిల్లీ, హర్యానా వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్నట్లు గా ముందస్తు సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేయగా, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 229 మద్యం బాటిళ్లు వెలుగులోకి వచ్చాయి.ఈ దాడుల్లో రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్టీఎఫ్ బీ టీమ్‌తో పాటు సరూర్‌నగర్‌, మహేశ్వరం ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.  స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను తదుపరి విచారణ నిమిత్తం సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించి నట్లు అధికారులు తెలిపారు.ఇక సంగారెడ్డి ప్రధాన రహదారిపై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో గోవా ప్రాంతం నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న 7.165 లీటర్ల మద్యంను కూడా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మద్యం అక్రమ రవాణాతో ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లు తోందని, దీనిని అరికట్టేం దుకు నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు. నూతన సంవత్సరం వేడుకల సమయంలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, రహదారులపై గట్టి నిఘా కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.