అమెరికా వర్సెస్ వెనిజువేలా భారత్ పై ప్రభావం ఎంటి?
posted on Jan 6, 2026 @ 9:33AM
వెనిజువేలాలో రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. ఆ దేశాధ్యక్షుడిని అమెరికా మెరుపుదాడి నిర్వహించి, ఏకంగా ఆ దేశ రాజధాని లోకి అధ్యక్ష భవనంలోనే బందీగా పట్టుకుని అమెరికాకు తరలించింది. ఆ తరువాత ఆ దేశాధ్యక్షురాలిగా సుప్రీం ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ, వెనిజువేలా సర్కార్ ను తాము గుర్తించబోమనీ, అక్కడ సజావుగా అధికార మార్పిడి జరిగే వరకూ ఆ దేశ పాలనా వ్యవహారాలన్నీ అమెరికాయే చూస్తుందని అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతే కాకుండా మదురో అరెస్టునకు వ్యతిరేకంగా గళం విప్పే వారందరినీ అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారి చేశారు.
రష్యా, చైనా సహా పలు ప్రపంచదేశాలు అమెరికా చర్యను తీవ్రంగా గర్హించాయి. ఐరాస సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ మాత్రం ఆచితూచి స్పందించింది. అమెరికా చర్యను నేరుగా ఖండించలేదు. మొక్కుబడి తంతు అన్నట్లు వెనిజువేలా ప్రజల సంక్షేమమే ముఖ్యమని, అన్ని పక్షాలూ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనీ సూచిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఈ విషయంలో తటస్థంగా ఉండటమే భారత్ కు ప్రయోజనకరమనీ, అందుకే భారత్ కర్ర విరగకుండా, పాము చావకుండా అన్న తరహాలో స్పందించిందనీ అంటున్నారు.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. వెనిజువేలా నుంచి భారత్ కు చెందిన ఓఎన్ జీసీ విదేశ్ లిమిటెడ్ కు రావాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోయి ఉన్నాయి.
వెనిజువేలాలో అమెరికా జోక్యంతో పెట్రోలియస్ డి వెనిజులా రీస్ట్రక్చరింగ్ జరిగితే.. ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ కు పెండింగ్ బకాయిలు రావడమే కాకుండా చమురు సరఫరా పెరిగితే.. అంతర్జాతీయ మార్కె ట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గుతాయి. అదే జరిగితే ఆ ఎఫెక్ట్ నేరుగా అమెరికాపైనే పడుతుంది. భారత్ చమురు విషయంలో రష్యాపై ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వెనిజులా నుంచి కూడా చమురు సరఫరా మొదలైతే.. అమెరికా టాక్స్ టెర్రర్ నుంచి తప్పించుకోవడానికి ఇండియా రష్యా చమురు కొనుగోలును తగ్గించేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అమెరికా ఆంక్షల నుంచి భారత్ కొంత వరకూ బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.