అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ఉత్తర్వులు
posted on Sep 1, 2025 @ 7:01PM
అమరావతిలో క్వాంటం కంప్యూటర్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ 50 ఎకరాలు కేటయించింది. ప్రభుత్వ సంస్ధగా ఏక్యూసీసీ ఏర్పాటు కానుంది. వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలందిస్తుంది. రెండు వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కే గేట్స్ క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకొచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
చదరపు అడుగుకు రూ.30 అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయించింది. దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఉచిత కంప్యూటింగ్ టైమ్ను ఐబీఎం సంస్థ ప్రభుత్వానికి కేటాయించనుంది. ప్రభుత్వ సంస్థలు, విద్యపరమైన అంశాలకు గానూ ఈ కంప్యూటింగ్ టైమ్ను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విట్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రూ.6కోట్ల వ్యయంతో బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ అనే స్టార్టప్ కంపెనీ మరో చిన్న క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటుచేయనుంది.అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను ప్రభుత్వం క్వాంటం వ్యాలీకి అందించనుంది. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.