73 మంది ఎయిమ్స్ డాక్టర్లకు కరోనా
posted on Apr 10, 2021 @ 11:08AM
దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. కరోనా రోగులతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. బెడ్లు దొరక్క వైరస్ బాధితులు అవస్థలు పడుతున్నారు. కరోగా పేషెంట్లకు చికిత్స అందించేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. అయితే కరోనా కేసులు టెన్షన్ పెట్టిస్తుండగా.. కొత్తగా మరో కలవరం కనిపిస్తోంది. కరోనా హాట్ స్పాట్లుగా హాస్పిటల్స్ మారిపోతున్నాయి. ఎయిమ్స్ లో భారీగా డాక్టర్లు వైరస్ భారీన పడ్డారు. మధ్యప్రదేశ్ లోని ఎయిమ్స్ కరోనా మహమ్మారికి నిలయంగా మారింది. ఎయిమ్స్ లోని 53 మంది డాక్టర్లు, విద్యార్థులకు కరోనా సోకింది.
వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కూడా వైరస్ బారిన పడిన వారి జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భోపాల్ ఎయిమ్స్ కు నిత్యమూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. గత కొంతకాలంగా కరోనా సోకిన వైద్యులు, హెల్త్ కేర్ వర్కర్లు ఎవరిని కాంటాక్ట్ చేశారన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 20 మంది వైద్యులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 18 మంది రెసిడెంట్ డాక్టర్లు కాగా.. మరో ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులు. సంస్థలోని మరో ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు కూడా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. వీరందరిలో ముగ్గురు మాత్రమే కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఢిల్లీ ఎయిమ్స్లో మొత్తం 700 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 2500 మంది రెసిడెంట్ డాక్టర్లు పనిచేస్తున్నారు. మరో 4000 మంది నర్సులు, 2,000 మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దాని నివారణకు ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. ఢిల్లీలోని మరో ప్రముఖ ఆసుపత్రి సర్ గంగారామ్ హాస్పిటల్లో కూడా 37 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా రోగులకు చికిత్స అందించడంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్లు పెద్ద ఎత్తున కరోనా భారీన పడుతుండటం ఆందోళన కల్గిస్తోంది.