తిరుమలశ్రీవారి భక్తుల కోసం ఏఐ ఆదారిత చాట్ బాట్!
posted on Nov 13, 2025 @ 1:43PM
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా కీలక ముందడుగు వేసింది. అత్యాధునిక సంకేతికతను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా.. మరింత మెరుగైన, సులభమైన సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రముఖ టెక్నాలజీ సంస్థ అమెజాన్ వెబ్ సర్విసెస్ భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
ఈ ఏఐ చాట్బాట్ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు తదితర సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌలభ్యం కోసం ఈ సేవలను ఏకంగా 13 భాషల్లో అందించనున్నారు. అంతేకాకుండా భక్తులు తమ ఫిర్యాదులు, సలహాలు, సూచనలను కూడా ఈ చాట్బాట్ ద్వారా సులభంగా టీటీడీ దృష్టికి తీసుకెళ్లే వెసులుబాటు కలగనుంది.
ఈ చాట్బాట్లో స్పీచ్ టు టెక్ట్స్, టెక్ట్స్ టు స్పీచ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. దీని వల్ల భక్తులు వాయిస్ కమాండ్ల ద్వారా కూడా సమాచారాన్ని పొందగలరు. ఈ అత్యాధునిక చాట్బాట్కు అవసరమైన సాఫ్ట్వేర్ను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నది. అలాగే, పారదర్శకత పెంచడంతో పాటు, ఎస్వీబీసీ ఛానల్ ప్రసారాలను మరింత మెరుగుపరిచేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతోంది.