ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు... 10న ఎన్నికల నోటిఫికేషన్
posted on Oct 6, 2023 @ 12:37PM
దేశంలో ఇప్పటికే రాజకీయ వాతావరణం హీటెక్కిస్తుంది. 2018 ఎన్నికల్లానే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణలో ఒక విడతలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించినట్టు సమాచారం.కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే మొదలుపెట్టేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే తెలంగాణలో పర్యటించారు మహబూబ్ నగర్, నిజామా బాద్ బహిరంగ సభల్లో పాల్గొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ వోటర్లను ఆకర్షించే కార్యక్రమాలతో బిజీగా ఉంటోంది. కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. చేరికలకు పెద్ద పీట వేస్తుంది. ఈ ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఈ నెల 8-10 మధ్య ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి.
డిసెంబరు మొదటి వారంలో కానీ పోలింగ్ జరగొచ్చని సూచనా ప్రాయంగా పేర్కొంది. అలాగే, గతంలో నిర్వహించినట్టుగానే చత్తీస్గఢ్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, ఎన్నికల తేదీలు మాత్రం వేర్వేరుగా ఉండనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 10-15 మధ్య ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్లో బీజేపీ, చత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి.