" అవునమ్మా! ఈమధ్య దానిమ్మకాయలే బాగుంటున్నాయి. జామకాయ తినబోతే వికారంగా వుంటుంది. తినలేదుగా."
"పుల్లటివి తినాలనిపిస్తుందా?" సుభద్రమ్మ అనుమానంగా అడిగింది.
"ఏమిటే నీ పనికిమాలిన ప్రశ్నలు? ముందు పెద్దతల్లికి అల్లపు రసమో, జీలకర్ర కషాయమో ఇవ్వక." కుర్చీలోంచి లేచి బయటకెళ్లుతూ అన్నాడు రామభద్రయ్య.
"నేనడిగిందానికి జవాబివ్వవేమే పెద్దమ్మాయీ!" రామభద్రయ్య అన్నది వినిపించుకోకుండా అంది సుభద్రమ్మ.
"అవునమ్మా! అన్నీ పుల్లనివేతినాలనిపిస్తున్నది. నాలుకుంతా చేదు. నిమ్మకాయ పచ్చడితో అన్నం తింటే ఎంత బాగుందో?" అంది అనుపమ.
"ఎన్నాళ్ళనుంచి యిలా వుంటున్నది?" కాళ్ళు వణుకుతున్నాయి. కంగారుపడిపోతున్నది సుభద్రమ్మ. లోలపల "భగవంతుడా నన్నింకా నరకంలోకి నెట్టకు." అనుకుంది.
"పదిరోజులు బట్టీ ఎక్కువగా అనిపిస్తున్నది. పుల్లనివి తినాలని పించటం. వికారంగా వుండటం." అనుపమ అమాయకంగా చెప్పింది.
అనుపమ బయటచేరి ఎన్నాళ్ళయిందో లెక్క వలేసింది సుభద్రమ్మ. రెండు నెలలు ఇరవై నాలుగు రోజులు అయింది. సాదారణంగా అనుపమ నెలమీద పదిరోజులు ఒక్కోసారి పదిహేనురోజులకి బైటచేరుతుంది. అందుకుని సుభద్రమ్మ పెద్దగా లెక్కపెట్టి చూచుకోలేదు రాజులు.
పడుకునివున్న అనుపమని రెక్కపట్టుకు గుంజి లేపికుర్చోపెట్టింది. కూర్చోపెట్టింది సుభద్రమ్మ." పుట్టినప్పుడే చావకుండా బ్రతికున్నావే మమ్మల్ని నిలువునా చంపటానికి కాకపోతే. చెప్పు. ఆరాజుని ఎప్పుడు కలుసుకున్నావు? ఏం చేశాడు? చెప్పకపొయ్యావో చంపేస్తాను."మెడమీద చెయ్యివేసి నొక్కుతు పిచ్చిపట్టినదానిలా అడిగింది అనుపమని.
" నెప్పింపుడుతున్నది చెయ్యితియ్యమ్మా? రాజని.... రాజుని అప్పుడు నువ్వు కోప్పడ్డావే అప్పుడు కలుసుకోటమే మళ్ళీ రాజుని కలుసుకోలేదు వట్టు, దేముడిమీద ప్రమాణం."
అనుపమ మెడమీదవున్న సుభద్రమ్మ చెయ్యి జారిపోయ్యింది. రాజుని అనుపమ కలుసుకుంది. ఆరునెలల క్రితంమాట. మరి.... మరి... ఇదేమిటి? ఇదెలా జరిగింది?
అనుపమవైపు పరీక్షగాచూచింది సుభద్రమ్మ. భయంభయంగా ముడుకుని కూర్చుని రెప్పలార్పుతూ సూన్యంలోకి చూసినట్లు చూస్తు న్నది అనుపమ.
"ఎవరైనా మెగవాళ్లు నిన్నేమయినా చేశారా?" అడగలేక అడగలేక అడిగింది సుభద్రమ్మ.
"అమ్మెందుకు కోపంగావుంది? ఏమిటేమిటో అడుగుతున్న దేమిటి? మొగాళ్ళు ఏంచేస్తారు?"
"అడుగుతుంటే మాట్లాడవేం? ముంగిముసలమ్మలా కూర్చుంటావ్?"గదిమాయించింది సుభద్రమ్మ.
"మొగాళ్లు ఏం చేస్తారమ్మా?"
మొగాళ్లు ఏం చేస్తారో తెలియకుండానే ద్రోహంజరిగిపోతే ,అది తెలయని అమాయకంతో ఎదురప్రశ్న వేస్తుంటే,మొగాడుచేసే దేమిటో దానిఫలితం తెలిసిన సుభద్రమ్మ ఏంచెపుతుంది? ఏమడుగుతుంది?
"అదే.... ఎవరూలేనప్పుడు నిన్నెవరయినా ముద్దుపెట్టుకుని ఇలాపట్టుకున్నారా? సుభద్రమ్మ సిగ్గువిడిచి చేతులతో తాకి అర్థమయేటట్లు అడిగింది అనుపమని."
అనుపమ మాట్లాడలేదు. బలరామయ్యగారిపెరట్లో రాజుకోసం వెళితే జరిగింది గుర్తుకొచ్చింది.
కూతురు మౌనంచూస్తుంటే పిచ్చికోపం వచ్చింది సుభద్రమ్మకు "చెప్పవే చెప్పు. ఏందాయకుండా చెప్పు. చంపిపారేస్తాను ఒక్కమాట అబద్ధంచెప్పినా?" ఫెడీఫెడిమని అనుపమని వంగదీసి వీపుమీద గుద్దింది.
అనుపమ అబద్ధం చెప్పలేదకాని.... బుచ్చిరాజువచ్చి రాజువచ్చాడు.రమ్మనిచెప్పటం తను వెళ్ళటం, వెళ్ళింతరువాత ఎవరో మాట్లాడకుండా పట్టుకుని ఏమిటేమిటో చేయటం.... తనకి చాతయినవిధంగా ఎక్కిళ్ళమద్య ఆపి ఆపి చెప్పింది. తను పిల్లనివి ఇష్టపడటానికి, వాంతిచేసుకోటానికి, దీనికి సంబంధం తెలియలేదు. అమ్మకి తనపై అకారణంగా కోపం ఎందుకొచ్చింది, బొత్తిగా అర్థంకాలేదు అనుపమకి.
"జరిగింది అప్పుడే ఎందుకుచెప్పలేదు. నేను ఊరినుంచి రాగానే, ఏమిటలా వుంటున్నావని అడిగితే 'ఏం లేదు' అన్నావేగాని ఒక్క ముక్కంటే ఒక్కముక్క నా చెవినవేశావా పెద్దమ్మాయి?" నెత్తీనోరు కొట్టుకుంది అంది సుభద్రమ్మ.
"అప్పుడు పెద్దమనిషి కావటం ఏమిటమ్మా. అంటే ఇలాంటివి అడగకూడదు సమయంవచ్చినప్పుడు తెలుస్తాయని కోప్పడ్డావుగా? ఇంకో సారి ఏదో అడిగితేను కోప్పడావు.అందుకని సమయంవస్తే తెలుస్తుంది, అమ్మని అడిగితే కోప్పడతుందని చెప్పలేదు. సమయం రావటం అంటే ఎప్పడు తెలుస్తుందమ్మా?"
సుభద్రమ్మ తన్ని తానే మరిచిపోయింది. రాక్షసిఅయింది, అనుపమ జడపుచ్చుకుని లేవదీసింది. తగలరానిచోటు తగిలేచోటు అని లేకుండా కొట్టటం మొదలుపెట్టింది.