Previous Page Next Page 
శుభోదయం పేజి 28


                          16


    "అయ్యయ్యో... ఇదేం ప్రారబ్దంరా... ఎవరో చచ్చినాళ్ళకి పుట్టిన బిడ్డని కనడమే కాకుండా యింట్లో పెట్టి పోషించడం ఏమిటిరా, దానికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏం అయిందిరా? ఇన్నాళ్లు ఏదో నీ పిల్లాడేమో అని ఆశపడ్డాం. అదికాదని ఆ రూపు చూడగానే తేలిపోయింది. యింకా ఎందుకురా ఆ ముదనష్టపు పిల్లాడిని వుంచుకోవడం... ఎవరికో యిచ్చేయండి. లేదంటే ఏ అనాధ శరణాలయానికో ఇచ్చేయండి..." అన్నపూర్ణమ్మ, ఆరుగురు బిడ్డల్ని కన్నతల్లి కొడుక్కి చెప్పింది. ఆవిడకి వంశం, పరువు, ప్రతిష్ట ముఖ్యం. కోడలి వల్ల నాశనం అయిన వంశప్రతిష్ట... ఆమెకి పుట్టిన అప్రాచ్యపు పిల్లాడివల్ల మరింత మంట గల్పిందని ఆవిడ బాధ.
    "ఏం చెయ్యమంటావమ్మా... ఆ రాధ మరీ మొండిగా ఎంత చెప్పినా వినడంలేదు. వద్దంటే యింట్లోంచి వెళ్ళిపోయి పెంచుకుంటుందిట బిడ్డని..."
    "మహారాజులా పొమ్మను. పీడా విరగడవుతుంది. పోతే... మగాడివి నీకేం, రేప్పొద్దున్న మరో అయినింటి లక్షణమైన పిల్లని పెళ్ళాడవచ్చు."
    "అమ్మా నీకేం తెలీదు ఊరుకో. రాధని వదిలేసి యింకోర్తిని పెళ్ళాడ్డం అంత సుళువనుకుంటున్నావా... రాధతో విడాకులు తీసుకోవాలి. విడాకులు తీసుకుంటే రాధకి కొంత డబ్బు ఇస్తుండాలి. కోర్టుకెక్కితే విడాకులకి కారణాలు చెప్పాలి... ఎంత గొడవుందో తెల్సునా..." విసుగ్గా అన్నాడు మాధవ్.
    ఆ తల్లి కొడుకు అవస్థకి జాలిపడ్తూ, "ఏం ఖర్మరా, నిక్షేపంలాంటి వాడివి ఏం గొడవలు వచ్చిపడ్డాయిరా... ఆ పెళ్ళితో నీకు శని పట్టుకుందిరా. అందుకే అన్నారురా కులం, గోత్రం, వంశం, మంచిచెడు చూసి చేసుకోవాలని... పెద్దవాళ్ళ మాట నిర్లక్ష్యం మీకు. ఎంత అనుభవంతో చెప్తారో అర్థంచేసుకోరు. ఇప్పుడు చూడు యింక అసలు ఎలా మొహం ఎత్తుకుంటాం..." కొడుకు మీద జాలిపడ్తూ, రాధమీద అత్యాచారం జరగడం... రాధ కులంగోత్రం లేనిదవడంవల్ల జరిగినట్లు మాట్లాడింది తను ఓ స్త్రీ అయిన అన్నపూర్ణమ్మ. ఆ మాటలు అప్పటికి చాలాసార్లే విన్నాడు మాధవ్.
    రాధ మీద అత్యాచారం జరిగిన తరువాత, తల్లితండ్రి ఆస్పత్రికి వచ్చాక మళ్ళీ వారిమధ్య రాకపోకలు ఆరంభించాయి. అవధానిగారు కోపం మర్చిపోయి కొడుకు ఆస్పత్రిలో వుండగా యోగక్షేమాలు విచారించారు.
    మాధవ్ యింటికి వెళ్ళేరోజున "వస్తూండరా, అయిందేదో అయింది. కన్నవాళ్ళం నీలా పట్టుదలగా ఎలా ఉండగలం... యింటికొస్తూండు" అన్నారు అవధానిగారు కొడుకుతో.
    "ఒరేయ్ బాబూ, యింటికొచ్చి కనపడి పోతూండరా, కొడుకు యింటికి వచ్చే అదృష్టం, యోగం మాకెలాగో లేదు. నీవన్నా రారా నాయనా. కొడుకు కోడలు ముచ్చట మా మొహాన రాయలేదు దేముడు. నీవు కనపడి పోతూండరా నాయనా" అంది అన్నపూర్ణమ్మ రాధ ప్రసక్తే తీసుకురాకుండా.
    మామూలు పరిస్థితిలో అయితే రాధ లేకుండా, వాళ్ళు రాధని ఆహ్వానించలేదని మాధవ్ వెళ్ళేవాడు కాదేమో.
    కాని, రాధ నెల తప్పడం, రాధ తనమాట వినకుండా బిడ్డని కనడానికి నిశ్చయించుకోవడం, రోజురోజుకి వారిద్దరిమధ్య దూరం పెరిగి, రాధ తనకి శారీరకంగానేకాక మానసికంగా దూరమవగానే అతను తల్లిదండ్రులకి చేరువయ్యాడు. రాధతో మాటలుమాని, యింట్లో భోజనం మాని తల్లి దగ్గిరకి వెళ్ళి తినేవాడు. ఒక్కోరోజు రాత్రిళ్ళు అక్కడే పడుకునేవాడు. కొడుకు మళ్ళీ తమకు దగ్గిరయినందుకు ఆ తల్లిదండ్రులు సంతోషించారు. కొడుకు కాపురం అలా అయినందుకు రాధే కారణం అన్నట్టు, రాధదే తప్పన్నట్టు, రాధ జీవనం వల్లే అలా జరిగినట్టు, కులంగోత్రం లేని రాధని పెళ్ళాడడంవల్లే కొడుకు కాపురం అలా అయినట్టు ప్రతి చిన్నవిషయానికి రాధని దోషిగా చేసి మాట్లాడేవారు తల్లిదండ్రులు. అసలే మనసు విరిగిన మాధవ్ కి ఈ మాటలన్నీ తలకెక్కాయి. తల్లి తండ్రి తన మేలుకోరే ఆప్తులు. వాళ్ళ మాట వినకుండా రాధని పెళ్ళాడి తను చేసిన పొరపాటు భూతద్దంలో మాదిరి కనపడసాగింది. దాంతో పిల్లాడిని కన్నాక ఆమెమీద విముఖత ఏహ్యంగా మారింది. ఇంట్లో ఆ పిల్లాడి ఉనికే అతనికి కంటకప్రాయంగా తయారైంది. ఇంట్లో పసిపిల్లాడు ఏడ్చినా, ఆఖరికింట్లో సాంబ్రాణి వాసన వేసినా చిరచిరలాడే వాడు. ఎవడికో కన్నపిల్లాడు తనయింట్లో పెరగడం సహించలేకపోతున్నాడు. అనుక్షణం ఆ యింట్లో పసిపిల్లాడి ఉనికి తెలియచేస్తూంటే అక్కడ వుండడం దుర్భరంగా వుందతనికి. ఎవడో కన్నవెధవని తను భరిస్తున్నాడు. దీనికంతకీ రాధ కారణం. ఆమె మొహం చూస్తేనే మొహం చిట్లించేవాడు. రాధ పసివాడికి పాలిస్తున్నా చూసి భరించలేకపోయేవాడు. ఆ పిల్లాడు... ఆ నల్లటి శరీరంతో, ఎర్రటి నోరు తెరుచుకుని క్యారుక్యారుమని ఏడుస్తుంటే, రాధ సముదాయిస్తూ వళ్లో వేసుకుంటుంటే, ఆ రౌడీవెధవనే రాధ వడిలో పడుకోబెట్టుకుని లాలిస్తున్నంత బాధపడిపోయేవాడు. ఏమిటీ పీడ!... ఎన్నాళ్ళు తను భరించాలి? యిరవైరోజులకే యిలా వుంటే యికముందు తనెలా భరించాలి! ఎన్నాళ్ళు తను అన్ని సుఖాలకి దూరం అయి బతకాలి! ఎన్నాళ్ళు తను లోకంముందు నటించాలి?
    తను ఎంత నటించినా, రాధకి తనకి మధ్య సంబంధ బాంధవ్యాలు మామూలుగా వున్నాయి అని నిరూపించడానికి, పైకి మామూలు భార్యభర్తల్లా నటిస్తున్నా పుట్టినబిడ్డని చూసిన అందరూ అది తన బిడ్డగాదని గుర్తించనే గుర్తించారు. ప్రతివాళ్ళు పనికట్టుకుని వచ్చి మరీ చూశారు. యిరుగుపొరుగు ఎన్నడూ రానివాళ్ళుకూడా పనికట్టుకువచ్చి కుతూహలంగా చూశారు. స్నేహితులు, కొలీగ్స్... పిల్లాడిని చూశాక వాళ్ళమొహాలలో మార్పు గుర్తించాడు. ఎంత మామూలుగా వాళ్ళకేం తెలియనట్లు, అది తమ బిడ్డేనన్నట్టుగా మాట్లాడినా వాళ్ళ మొహంలో, గొంతులో మార్పు ఎవరన్నా పసిగట్టగలరు. వచ్చిన ప్రతివాళ్ళముందు వాళ్ళు అడగడం, రాధ బిడ్డని తీసుకొచ్చి చూపడం, ఎవడో వెధవ కన్నబిడ్డకి తను తండ్రినన్నట్టుగా నవ్వు మొహానికి పులుముకొని కూర్చోవడం యమయాతనగా వుండేది. ఎంత నవ్వు నటించినా ఆ బిడ్డను అందరూ చూస్తుంటే మాడిపోయిన తన మొహంలో హావభావాలు వాళ్ళు వెతకడమూ తనకి తెల్సు. కొందరు సానుభూతిగా చూస్తే, మరికొందరు పాపం ఎంతగతి పట్టింది అని జాలిగా చూసేవారు.
    అలాంటి సందర్భాలలో అవమానం కోపంకింద మారేది. అంతా వెళ్ళాక కసిగా రాధని "ఏం, సంతోషంగా వుందా యిప్పుడు. ఆ కొడుకుని అందరికి చూపించి మురిసిపోతూ ఆనందపడుతున్నావా? ఛీ... సిగ్గులేదు నీకు. ఇదే నీ స్థితిలో యింకోరయితే ఆత్మహత్య చేసుకునేవారు. గొప్పగా బిడ్డని కని చాలా ఘనకార్యం, పెద్ద అభ్యుదయం సాదించాననుకుంటున్నావు గాబోలు. ఛా... ఆ దరిద్రుడిని తీసుకెళ్ళు నా ముందునించి..." అరిచేవాడు. రాధ ఒక్కోసారి ఏం జవాబు చెప్పకుండా లోపలికెళ్ళిపోయేది అతని కోపం గుర్తించనట్టు. మరోసారి కోపాన్ని నిగ్రహించుకుని "అయితే యిప్పుడు ఆత్మహత్య చేసుకోమనా మీ సలహా? యీ సలహా ముందే చెప్పివుంటే, లేదా ఆ పనేదో మీరే చేసివుంటే మీకూ, నాకూ యిన్ని తిప్పలుండేవి కాదు" అంది నిశ్చలంగా చూస్తూ.

 Previous Page Next Page