" నా మీద నీకు ప్రేమ, అభిమానం వుంటే, ఈ పసుపుతాడుని నా మెడలో కట్టు. ఇప్పుడు ఒక్కసారి నాతో గడుపు" అంటూ అతని చేతిని పట్టుకుని బెడ్ రూమ్ లోకి బలవంతంగా తీసుకెళ్ళింది ఇందు.
"ఈ చీర, జాకెట్టు, ఈ లోదుస్తులన్నీ ఆ పాపాత్ముడు నాకోసం కొన్నవి..... అందుకే వాటిని విప్పేసి, నీముందు పసిపాపగా నిలబడుతున్నాను. నాలో స్వచ్ఛతను చూడు.... నా మనసుని అర్థం చేసుకో..... నీకోసం, నీ పిలుపుకోసం, నీ స్పర్శకోసం పరితపిస్తున్నదానిని" అంటూ అతని ఎదుట నిలబడింది ఇందు. ఆమె చేతిలో పసుపుతాడు....
మైత్రేయ కళ్ళంట ఒక్కసారి కన్నీళ్ళోచ్చాయి. గబుక్కున అక్కున చేర్చుకుని, నుదుట మీద ముద్దుపెట్టుకుని -
"ఆవేశపడకు ఇందూ! నిన్ను నేను శీలం కోల్పోయినదానిగా చూస్తున్నాననుకోకు.... నీతో గడపడానికి నాకిష్టంలేక తృణీకరిస్తున్నాననుకోకు. నువ్వంటే నాకిష్టం. చిన్నప్పటినుంచీ నాకిష్టం...... ఎప్పటికీ ఇష్టం.... నువ్వు నాకెప్పుడూ పవిత్రురాలివే..... కానీ..... అంటూ మంచంమీదున్న చీరను ఆమెమీద కప్పాడు మైత్రేయ.
"చెప్పు బావా! ణీ సందేహం ఏమిటో చెప్పు?" ఉద్వేగంగా అడిగింది ఇందు. ఆమె కళ్ళంట కన్నీళ్ళు కారుతున్నాయి.
"నీకు నేనేమీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో వున్నాను ఇందూ! కొన్నాళ్ళాగు. మళ్ళీ నేనొస్తాను. ఎక్కడున్నా నీకు నేను ఫోన్ చేస్తుంటాను. సరేనా?" సానునయంగా అన్నాడతను.
"నువ్వు మళ్ళీ నాకు కన్పిస్తావా?" ఆశగా అడిగిందామె.
"తప్పకుండా కన్పిస్తాను" కొండంత అసంతృప్తిని దిగమింగుకుంటూ దుస్తులు ధరిస్తోందామె.
సరిగ్గా అదే సమయంలో.....
కాలింగ్ బెల్ మోగింది.
ఇందు ముఖంలోకి భయంగా చూశాడు మైత్రేయ. ఇందుక్కూడా అనుమానంగానే వుంది.
కాలింగ్ బెల్ మోగుతూనే వుంది.
"చంద్రప్ప వచ్చాడా?" సందేహంగా అడిగాడతను.
"కావచ్చు."
"మరిప్పుడెలా?"
"ఈ సమయంలో ఎప్పుడూ రాలేదు. ఫర్వాలేదు. భయం ఎందుకు?" అంటూ డ్రాయింగ్ రూంలోకొచ్చి, డోర్ తెరిచింది ఇందు.
ఎదురుగా చంద్రప్ప. మనిషి తూగిపోతున్నాడు. అతని కళ్ళు ఎర్రగా వున్నాయి.
ఎదురుగా కన్పించిన మైత్రేయని చూడగానే ఒక్కక్షణం షాక్ తిన్నాడు చంద్రప్ప. అయినా క్షణాల్లోనే తేరుకొని ఇద్దరివేపూ అనుమానంగా చూస్తూ లోనికొచ్చి.
సూటిగా ఇందువేపు చూస్తూ-
"నువ్వు నా ఒక్కడితోనే కాపురం చేస్తున్నావనుకున్నాను. మీ బావతో కూడా కాపురం చేస్తున్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఎన్నాళ్ళనుంచి జరుగుతోందీ వ్యవహారం?" అంటూ ఇందు జుత్తుని పట్టుకుని గోడకేసి కొట్టి-
మైత్రేయ వేపు తిరిగి-
"నీకోసం పోలీసులు ఒకపక్క వెతుకుతుంటే, నువ్వు..... నువ్వు నా పెళ్ళాంతో కులుకుతూ, నా ఇంట్లోనే దాగుంటావా? నిన్నేం చేయాలో నాకు తెల్సు. జయంత్ ని మర్డర్ చేసింది కూడా ఆ మోహిత, నువ్వేనని నేను పేపర్ చూడగానే అనుమానించాను. నిన్నిప్పుడేం చేస్తానో చూడు" అంటూ టెలిఫోన్ వేపు నడిచాడు చంద్రప్ప. టెలిఫోన్ రిసీవర్ని అందుకుని, పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయబోతున్న సమయంలో-
గోడకి చేరబడి కూర్చున్న ఇందు గబుక్కున లేచి, ఆ రిసీవర్ని లాక్కుని విసిరికొట్టి-
"బావా పారిపో..... నా గురించి ఆలోచించకు. నువ్వు ముందు పారిపో..... గట్టిగా అరిచింది. మైత్రేయ మరే మాత్రం ఆలోచించకుండా ముందుకడుగేశాడు. మైత్రేయని పట్టుకోడానికి పరుగు- పరుగున ముందుకు వచ్చాడు చంద్రప్ప. మైత్రేయ ఒక్క వుదుటున ఆ ప్లాట్ లోంచి బయటికొచ్చేసి బయట నుంచి డోర్ క్లోజ్ చేసి, లిప్ట్ వేపు పరిగెత్తాడు.
లోపలినుంచి "ఓపెన్ ద డోర్..... ఓపెన్ ద డోర్" అంటూ అరుస్తున్నాడు చంద్రప్ప. అరిచి అరిచి కోపంగా వెనుదిరిగిగాడు. అతని ఉగ్రరూపం చూడగానే భయపడి బెడ్ రూమ్ లోకి పరుగెత్తింది ఇందు. ఆ రూమ్ తలుపుల్ని వేసేసుకుంది.
* * *
` హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే బస్సులో కూర్చున్నాడు మైత్రేయ. దయనీయమయిన ఇందు పరిస్థితి తలచుకుంటుంటే అతనికి గుండె ద్రవించిపోతోంది.
మరో సమయంలో అయితే, చంద్రప్ప బారినుండి రక్షించి, ఇందును తీసికెళ్లిపోయేవాడు. ఇందుపై తనకు సింపతీయే కాదు, ప్రేమ కూడా వుంది.
తను ఇందును భార్యగా చేసుకోగలడా?
మరి మోహితను వదులుకోగలడా?
బస్సు సూర్యాపేట దగ్గరకు వచ్చేసరికి బాగా చీకటిపడింది. అక్కడ టీ బ్రేక్. అందరితోపాటు తనూ కిందకు దిగి నడుస్తున్నంతలో-
"హాలో.....హేండ్ సమ్...... ఇక్కడ ఇలా....." ఆ పిలుపు విన్పించినవేపు చూశాడు మైత్రేయ.
ఎదురుగా శిల్ప. ఆమె పెదవుల మీద చిరునవ్వు.
"ఎక్కడనుంచి, ఎక్కడకు?" అడిగిందామె.
చెప్పాడతను.
"పెళ్ళెప్పుడు?" క్యాంటీన్ లో టీ తాగుతున్న సమయంలో అడిగాడు.
"అతిత్వరలో..... మీకు వెడ్డింగ్ కార్డుని ఎక్కడకు పోస్ట్ చెయ్యాలి? అడిగిందామె.
"ప్రస్తుతం నాకు అడ్రస్ లేదు...... మీ ఫోన్ నెంబర్ నాకివ్వండి. నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను" అన్నాడతను.
"పెళ్ళికి తప్పకుండా రావాలి."
"వస్తాను..... ఎక్కడున్నా వస్తాను."
"అడవుల్లో వున్నా వస్తారా?" జోక్ గా అంది శిల్ప.
"అడవుల్లోనే కాదు జైల్లో వున్నా వస్తాను" తనూ జోక్ వేశాడు. ఇద్దరూ లేచి బయటికొస్తుండగా మైత్రేయ చూపులు అప్పుడే బస్ కాంప్లెక్స్ లోకి వస్తున్నా పోలీసుజీపు మీద పడింది.
ఆ జీపు నేరుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న బస్సుల ప్లాట్ ఫారమ్ దగ్గరకొచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు పోలీస్ ఇన్స్ పెక్టర్లు, నలుగురు పోలీసులు దిగారు. వారి వెనక దిగిన వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు మైత్రేయ.
ఆ వ్యక్తి జయంత్ జీపుడ్రైవర్. అంటే మోహిత కోసం, తన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారన్నమాట. జీపుడ్రైవర్ తనని గుర్తుపట్టడం ఖాయం.
శిల్పవైపు తిరిగి.....
"శిల్పా..... మీరెళ్ళండి..... నేను సిగరెట్స్ తీసుకుని వస్తాను" అంటూ వడివడిగా జనంలో కెళ్ళిపోయి, మెయిన్ ఎంట్రన్స్ ద్వారా బయటికొచ్చేసి దూరంగా చీకట్లో నిలబడి చూస్తున్నాడు.
జీపుడ్రైవర్ని తీసుకుని ఇద్దరు పోలీసులు రెండు హైదరాబాద్ బస్సుల లోపలకు వెళ్ళి వెతికి వచ్చారు.
తనెక్కిన బస్సు కదిలి, కాసేపు ఆగిపోవడం...... కిటికీలోంచి శిల్ప బయటకు చూడడం గమనించి, కొంచెం ముందుకెళ్ళి నుంచున్నాడు మైత్రేయ.
బస్సు ముందుకు రాగానే, ఆపమన్నట్టుగా మైత్రేయ చేతిని అడ్డంపెట్టాడు. బస్సు ఆగింది.
"ఏంటండి......అరగంటకూడా భోజనానికి టైమ్ సరిపోకపొతే ఎలాగండీ?" కండక్టర్ విసుక్కున్నాడు.
"సారీ!" చెప్పి, సీట్లో కూర్చుని దూరంగా వున్న పోలీస్ జీప్ వేపు చూశాడు మైత్రేయ.
జయంత్ జీపుడ్రైవర్ సిగరెట్ కాల్చుకుంటూ నలువేపులా చూస్తున్నాడు.
"హైదరాబాద్, నిమ్స్ లో ఎవరో పేషెంట్ ను చంపేసార్ట. ఆ హంతకుల కోసం పోలీసులు వెతుకుతున్నారు....." ముందుసీట్లో కూర్చున్న శిల్ప చెప్పింది మైత్రేయకి.
"ఈమధ్య మర్డర్స్ ఎక్కువైపోయాయి......" అన్నాడు మైత్రేయ.
బస్సు వేగం పెరిగింది.
సరిగ్గా ఉదయం ఆరున్నర గంటలకు బస్సు విజయవాడ బస్ కాంప్లెక్స్ కొచ్చి ఆగింది.
"మళ్ళీ కలుస్తాను" శిల్పతో చెప్పేసి బయటికొచ్చేశాడు మైత్రేయ.
శిల్ప అక్కడి నుండి తెనాలి వెళ్ళాలి. తెనాలి టిక్కెట్ తీసుకుని, ఆరోజు డైలీ పేపర్ తీసుకుని తిరగేస్తూ ఓచోట కనిపించిన న్యూస్ ను గబగబా చదివాడు.
శ్రీశైలం ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ దారుణ హత్య......
శ్రీ శైలం కొండల్లో అనుమానస్పదంగా, గాయాలకు గురై, స్పృహ కోల్పోయి, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్, నిన్న రాత్రి హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు. హంతకులు తెలివిగా , ఒక పథకం ప్రకారం ఆస్పత్రిలోకి వచ్చి, హతుడు వుంటున్న రూమ్ లోకి ప్రవేశించి, అతన్ని వూపిరాడకుండా చేసి చంపేశారని పోలీసుల కథనం. ఇదిలా వుండగా ఒక మహిళ, ఒక పురుషుడు ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. శ్రీశైలం కొండల్లో జయంత్ పై హత్యాప్రయత్నం చేసింది కూడా ఈ ఇద్దరు నిందితులేనని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది.
మైసూర్ లో సస్పెన్షన్ కు గురైన సర్కిల్ ఇన్ స్పెక్టర్ చంద్రప్ప అందించిన ఆసక్తికరమయిన సమాచారం ప్రకారం హంతకుల పేర్లు మోహిత. మైత్రేయలుగా పోలీసులు భావిస్తున్నారు.
చివరి పేరా చదవగానే శిల్ప ఉలిక్కిపడింది.
మళ్ళీ మళ్ళీ ఆ వార్తను చదివింది.
మైత్రేయ హంతకుడా?
కాదు..... మైత్రేయ హంతకుడు కాదు...... ఎక్కడో ఏదో కుట్ర జరిగింది. ఆ కుట్రలో పాపం మైత్రేయ ఇరుక్కుపోయాడేమో...... జాలిగా అనుకుంది శిల్ప.
* * *
` ఉదయం 11 గంటలు.....
గుంటూరు లక్ష్మీపురంలోని విశాలమయిన బంగళాలోని పోర్టికోలోకి అంబాసిడర్ కారు ప్రవేశించింది.