Read more!
Next Page 
రక్తచందనం పేజి 1

                                 


                  రక్తచందనం                                                                         సూర్యదేవర రామ్ మోహన్ రావు

                                 


    మానవ సంబంధాలన్నీ కరెన్సీ న్యూక్లియర్ చుట్టూ పరిభ్రమిస్తుంటాయి...
    డబ్బు ఆటంబాంబు వంటిది....
    రెండూ మారే చేతుల్నిబట్టి వినాశనాన్నే కోరుకుంటాయి. పశ్చిమ పర్వత శ్రేణుల్లో ఒక జ్వాల ఉద్భవించింది.... ఆ జ్వాలకో నేపథ్యం ఉంది....
    ఆ జ్వాల ఓ భయంకరమైన జీవితానికి నాందీ....
    ఆ జ్వాల పడగమీద మణికాంతి....
    మూడు రాష్ట్రాల పొలిమేరల్లో ముసురుకున్న ప్రమాదం.... ఆ ప్రమాదపు ప్రకంపనాల వెనుక అంతులేని దోపిడి ఉంది. ఆ ప్రకంపనాల వెనుక అనంతమైన మోసం ఉంది. అగాధాల్లోకి కూరుకుపోయిన ఒక యువకుని భీభత్స నాదం ఉంది....
    నిశ్శబ్ద గంభీరత చాటున దాగిన ముప్పైతొమ్మిదివేల ఎకరాల కీకారణ్యంలో.... మహారణ్యంలో.... ప్రమాదం ప్రతి అంచున, ప్రతి అంగుళంలో పొంచి ఉంటుంది. ఆ కీకారణ్యపు క్రీనీడల్లో మృత్యువు అనుక్షణం మాటువేసి ఉంటుంది.
    అంతటా నిశ్శబ్దం....
    మృత్యువునే భయపెట్టే లోతైన నిశ్శబ్దం....
    ఆ నిశ్శబ్దం మాటున దాగివుండే గంభీరత....
    ఉన్నట్లుండి ఏనుగు ఘీంకారం....తిరిగి నిశ్శబ్దం....పర్యావరణం కుదుటపడే ఆఖరిక్షణంలో తిరిగి పులి గాండ్రింపు....ప్రళయం....నిశ్శబ్దం సంచలనం....నిశ్శబ్దం....
    ఆ నిశ్శబ్ద ప్రకృతి అంతర్భాగాన్నే కన్నతల్లి ఒడిగా భావించి జీవితాల్ని వెళ్ళమార్చుతున్న భూమి పుత్రులు....
    బ్రతుకుదెరువు బాటలు చీలికలైన వేళ....
    ఒక మారుతీ కారు మైసూర్ నుంచి నీలగిరి పర్వతాలకేసి దూసుకుపోతోంది.
    చెవులు తూట్లుపడేలా ఆకాశంలో ఉరుములు....
    కళ్ళు చెదిరిపోయేలా మెరుపులు....
    క్రమంగా వెలుతురు వీడ్కోలు చెబుతోంది.
    విజబిలిటీ పూర్ గా తయారవుతూ చిక్కటి చీకటికి స్వాగతం చెప్తూ మెత్తని నిశ్శబ్దంలోకి పరకాయ ప్రవేశం చేస్తున్న వేళ కారు నంజన్ గడ్ ని దాటి బేగూరు పల్లె సరిహద్దుల్లో ప్రవేశించింది.
    చల్లని ఈదురుగాలి అడవిలోని స్వచ్చతని నింపుకొని పరిసరాల్ని పరిమళభరితం చేస్తోంది. కొద్దిగా దించి ఉన్న గ్లాసెస్ లోంచి కారులోకి దొంగలా ప్రవేశిస్తున్న గాలికి డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి అసహనంగా కదిలాడు.
    కారు వెనక సీట్లో ఉన్న వ్యక్తి మనసులోని ఆందోళన అతడి ముఖంలో ప్రస్ఫుటమవుతోంది. భయాందోళనలతో, అతను వేసుకున్న బట్టల లోపల చెమట పట్టేసింది.
    కర్ణాటక రాష్ట్రంలో మైసూరునుంచి ఊటీ వెళ్ళే రహదారిలో ఉంది జేగూరు అనే పల్లె. అక్కడి నుంచి బండిపూర్ అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది.
    గుండ్లుపేట దగ్గర నుంచి ఆ అడవి కీకారణ్యంగా మారిపోతుంది.
    పశ్చిమ పర్వత శ్రేణులు బారులుతీరి బండిపూర్, ముదుమలై అడవులకు వెన్నెముకగా నిలిచి ఉంటాయి. ఒకే అడవిని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వాటాలుగా పంచుకున్నాయి. కొంతభాగం కేరళ రాష్ట్రంలో కూడా ఉంది.
    హిల్లీ ఫారెస్ట్ రేంజెస్....
    పర్వత శ్రేణులతో నిండివున్న ఆ అడవి కొల్లెగాల్, సిల్వెక్కాల్, సత్యమంగళం, బర్గూర్ ప్రాంతాల్ని కలుపుకొని అపారమైన ప్రకృతి సంపదలకు నెలవై వుంది.
    "చలిగా వుంది....టీ ఏమైనా దొరుకుతుందా?" కారు వెనుక సీట్లో ఉన్న వ్యక్తి దూరంగా మినుకు మినుకుమంటూ కన్పిస్తున్న లైట్లకేసి చూస్తూ అన్నాడు నెమ్మదిగా.
    "ముసురుపట్టినట్లుంది....ఈదురుగాలులు ఎక్కువవుతున్నాయి. ఈ సమయంలో టీ బంక్స్ తెరిచి ఉండటం సందేహమే....అయినా చూద్దాం. అవునూ....మీరెవరు?" డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కుతూహలం కొద్దీ అడిగాడు.
    కారు నెమ్మదిగా సంధ్య చీకట్లను హెడ్ లైట్స్ కాంతితో చీల్చుకుంటూ వెళ్తోంది.
    సన్నటి రోడ్డు అడవిని రెండు భాగాలుగా చీలుస్తూ నల్లవన్నెత్రాచులా కనిపిస్తోంది. రోడ్డుకిరువైపులా నింగిలోకి తొంగిచూసే ఎత్తైన వృక్షాలు ఈదురుగాలికి వయ్యారంగా ఊగుతున్నాయి. ఆ చీకటిచాటున అవి దయ్యాల్లా భయకంపితం చేస్తున్నాయి.
    "అవును. ముసురు పట్టినట్లుంది. ఈ రోడ్డంట వెళితే ఉదకమండలం వస్తుందనుకుంటాను...." వెనుక సీట్లో ఉన్న వ్యక్తి పొంతన లేకుండా అన్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కారాపాడు....హేలోజెన్ లాంప్స్ ని ఆఫ్ చేశాడు. చిమ్మని చీకటి....ఒడల్ని జలదరింపజేసే చిక్కటి చీకటి....
    అతను సిగరెట్ వెలిగించి గుండెల నిండుగా పొగని పీల్చి వెచ్చదనంలోని ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నాడు. 

Next Page