Previous Page Next Page 
రాగహేల పేజి 27


    
    ""పూర్తిగా విను. మంగమ్మ దయ్యమైందనీ తనను పట్టిపీడిస్తున్నదనీ భావించసాగాడు. బాధలోనుంచి భయం పుట్టుకొచ్చింది" ఆగి పైపు వెలిగించుకున్నాడు. "మంగమ్మ దయ్యంతనను పీడిస్తుందనీ, అది తనను చంపిగాని ఊరుకోదనే భయంరోజురోజుకూ పెరగసాగింది. మంత్రగాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. తాయత్తులు కట్టించుకొన్నాడు. అయినా ఆ దయ్యం వదల్లేదు" "ఆగండి అంకుల్. మీరూ దయ్యాలనునమ్ముతారా?" "నేనా, దయ్యాలను నమ్మడమా? నీకా అనుమానం ఎందుకొచ్చింది?" "మీరే అన్నారుగా?" "ఏమని? నేను దయ్యాలను? నమ్ముతున్నాననా?" ఆశ్చర్యంగా అడిగాడు ప్రొఫెసర్. "మంత్రగాళ్ళ దగ్గరకు వెళ్ళినా ఆ దయ్యం వదల్లేదన్నారుగా?" "ఓ అదా?" గొల్లున నవ్వాడు పరశురాం. "అ ఆమాట నేను అనడంలేదు. అతని భావం అది" "ఊ( చెప్పండి" "ఆ రోజుల్లోనే దొంగనోట్ల కేసు వచ్చింది. తనవాడనినమ్మిన బావమరిదేమోసం చేశాడు. ఘోరంగా మోసపోయాడు. అనేకపాపాలు చేసి కూడపెట్టిన ఆస్తి ఒక్కసారిగా తుడుచుకుపోయింది. అది చాలా పెద్దదెబ్బకొట్టింది అతని మనసు మీద. మన స్థిమితం తప్పింది. కొంతకాలం భయంకరమైన మానసిక సంఘర్షణలో పడ్డాడు. తనలోతనే పోరాడాడు. అతనిమనసు చిన్నాభిన్నం అయింది".
    ఆగి ఆరిపోయిన పైపు మళ్ళీ అంటించుకోసాగాడు. మహతి పరశురాంకేసి అసహనంగా చూసింది. "అతని మూర్తి రెండుగాచీలిపోయింది. ఒకటిశేషయ్య చెట్టిగానూ, రెండోది అవతారంగానూ చీలిపోయిరూపుదిద్దుకున్నాయి. మళ్ళీ ఒక్కోదాన్లో అనేక మూర్తిమత్తాలున్నాయి". "అంకుల్!" ఆత్రంగా పిల్చింది. "ఏమిటమ్మా ఏమైంది?" "నాకంతా అయోమయంగా ఉంది అంకుల్. ఆ రెంటిలో అన్ని మూర్తులు ఉన్నాయంటున్నారు. అంటే ఒక్కొక్క అక్షరం..." పరశురాం పక పక నవ్వాడు. "పూర్తిగా విను బేబీ!" "సారీ!" "ఏమన్నానూ?" "మళ్ళీ ఆ రెండింటిలో అనేక మూర్తి మత్తాలు ఏర్పడ్డాయన్నారు" "అవును కొండమీదనుంచి దొర్లి పగిలిన కుండపెంకుల్లాఅతని మూర్తి ముక్కలు అయింది. అయితే అందులో ప్రధానమైన మూర్తులు తమనుంచి చెల్లాచెదురైన శకలాలను-అంటే బలహీనమైన శకలాలను చేర్చుకొని, భిన్న మైన మూర్తి మత్తాలను సంతరించుకొన్నాయి. ఫలితంగా..." ఆగి మహతి ముఖంలోకి చూశాడు.
    "చెప్పండి అంకుల్!" ఉద్విగ్నంగా అడిగింది. "పర్యవసానంగా శేషయ్యగా, అవతారంగా, శేషావతారంగారిమూర్తి మండిపోయింది. పీడించేవాడూ, పీడించబడేవాడూ చీలిపోయారు" అంటూ ఓ క్షణం ఆగి మహతిముఖంలోకి చూశాడు. మళ్ళీ ప్రారంభించాడు" ఒకడు వడ్డీ వ్యాపారం చేశాడు. జనాన్ని తన చుట్టూ తిప్పుకొన్నాడు. వాళ్ళనుపీడించాడు. జలగలా వాళ్ళ రక్తం తాగుతూ ఆనందించేవాడు. పెరుగుతున్న ఐశ్వర్యాన్ని చూసుకొంటూ సంతృప్తిచెందేవాడు. మరొకడు కష్టపడి సంపాదించుకొన్న ఆస్తి పోగొట్టుకొని పీడితులై అమితమైన వ్యధకుగురి అయ్యాడు. నిరంతరం సాగుతున్న మానసికసంఘర్షణనే ఈనాడు నువుచూసింది. శేషయ్య+అవతారం=ఒకనాటి శేషావతారం. ఈ మూడు మూర్తుల్నీ నువు ఈనాడు చూశావు" ఆగి మహితని చూశాడు. ఆమె ఈ లోకంలో ఉన్నట్లు గాలేదు. ఆమె కళ్ళు శూన్యంలో దేన్నో వెదుకుతున్నాయి. "దేన్ని!" పరశురాం మహతిభుజం తట్టాడు. మహతి త్రుళ్ళిపడింది. "ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?" అప్పుడే నిద్ర మేల్కొన్నట్టూ, చుట్టూ పరిసరాలను గుర్తుచేసుకుంటున్నట్టూ కొద్ది క్షణాలు ఉండిపోయింది మహతి. "మహతీ! ఏమిటంత దీర్ఘాలోచన?" "అంకుల్!" "అడుగు బేబీ! సందేహం ఎందుకూ?" మహతి పూర్తిగా తేరుకుంది.
    "అంకుల్! శేషయ్యనూ, అవతరాన్ని కలిపి మళ్ళీ శేషావతారాన్ని చెయ్యగలరా?" పరశురాం ఆమె ముఖంలోకి చూశాడు. "అంటే-నా-ఉద్దేశ్యం-అది సంభవమా అని! సైక్రియాట్రీకి అందుబాటులో ఉన్న సమస్యేనా ఇది?" పరశురాం ఓ క్షణం ఆలోచించిచిన్నగా చెప్పసాగాడు. "ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. కొన్ని కేసుల్లో ఇది సాధ్యమని నిరూపించబడినా, చాలాకేసుల్లో అసాధ్యమేఅయింది" "అంటే అలాంటివాళ్ళు బాగుపడేఅవకాశమే లేదా?" "ఈ కేసే తీసుకో. శేషావతారం సరిగ్గా మళ్ళీ మొదటి శేషావతారంగా మారడం సంభవంకాకపోవచ్చు" "అంటే ఎగ్జాక్టుగా అదేమూర్తిమతం లోకిరాలేకపోవచ్చు నంటారు. అంతేనా అంకుల్!" "యస్. యూ ఆర్ కరక్ట్ బేబీ?" "చెప్పండి అంకుల్ మరి ఏది సాధ్యం అంటారు" "మధ్య రాజీలాంటిదికుదిరి సహజీవనానికి సిద్దం కావచ్చు". మహతి అయోమయంగా చూసింది. ప్రొఫెసర్ తన ధోరణిలో చెప్పుకు పోతున్నాడు" అలా కొంతకాలం జరిగితే ఈ రెండుమూర్తులూ కరిగి మరో మిశ్రమ మూర్తి మతం తయారు అయే అవకాశం ఉంది. ఆ మూర్తిలో అంటే మిశ్రమ మూర్తిమతంలో పాత శేషయ్యలో ఉన్న కొన్ని లక్షణాలు గుణాలు-మాయమవడమో, లేక బాగా అడుగునపడిపోవడమో జరుగుతుంది" "కొత్త గుణాలు సంక్రమించే అవకాశం ఉందా అంకుల్?" మహతి అడ్డొచ్చి అడిగింది. "అంతకుముందు అతనిలో లేనివి ఏమీరావు. కాని అంతవరకూ అంతర్గతంగా అణగారిపోయిచాలా బలహీనంగా ఉన్న కొన్ని గుణాలు కొత్తరూపు దిద్దుకొని బయటపడొచ్చు. ఈ గుణాలు కొత్తమూర్తిలో బలంగా బయటికికన్పించవచ్చు" "అంకుల్!" మహతి అరిచి చివ్వున కుర్చీలోనుంచి లేచినిల్చుంది. "టేకిట్ ఈజీ బేబీ!" పరశురాం లేచి నిలబడి మహతి భుజంతడుతూ అనునయంగా అన్నాడు. "సారీ! అంకుల్" ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకొని కూర్చుంది. "మనో విజ్ఞానశాస్త్రం మహా సముద్రంలాంటిది" ఆగి మహతి ముఖంలోకి ఓ క్షణంచూసి మళ్ళీ ప్రారంభించాడు. "మానసిక వ్యాధిగ్రస్తునిజీవిత గమనాన్ని మహాసముద్రంలో పయనించే పడవతో పోల్చవచ్చును. సైకియాట్రిస్టు, పడవచుక్కానిని పట్టేసరంగులా మార్గ నిర్దేశకుడు మాత్రమే. కాని పడవవేగాన్ని పెంచేశక్తితెరచాపను తాకే వాయుతరంగాలకు మాత్రమే వుంది. మానసిక వ్యాధి గ్రస్తుని మానసిక ఫలకం తెరచాపలాంటిది. అధికపీడననుండి అల్పపీడన ప్రదేశాలకు వీచే ఝంఝామారుతాల వంటివేజీవితంలో అతడు ఎదుర్కొనే భౌతికసామాజిక వాస్తవ స్థితిగతులు. అందువలన భౌతికసాంఘిక పరిస్థితులలో తీసుకురాగల మార్పులు మానసిక వ్యాధిగ్రస్తునికి ఉపశమనం కలిగిస్తాయి. సైకియాట్రిస్టుగా నేనునిమిత్త మాత్రుడనే. ప్రయత్నించి చూస్తాను" అంటూ పైపు నోట్లో పెట్టుకున్నాడు ప్రొఫెసర్ పరశురాం.

 Previous Page Next Page