Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 23

   

   దాదాపు పాతికమంది బంధువులతో పెళ్ళికి బయలుదేరాడు పీతాంబరం.
   
    తిరుపతి రైల్వేస్టేషన్లో దిగగానే పెళ్ళికొడుకు తరపున ఎవరో ముగ్గురు వ్యక్తులొచ్చి పీతాంబరాన్ని బంధువుల్ని రిసీవ్ చేసుకుని వారికి గెస్ట్ హౌసుల్ని చూపించి వెళ్ళిపోయారు.
   
    "మనల్ని కాలు కదపనీయకుండా అన్ని పనులూ పెళ్ళికొడుకు తరపువాళ్ళే చేసుకుంటున్నారు. కళ్యాణమండపం అలంకరణతోసహా" ఆనందంగా చెప్పాడు పీతాంబరం.
   
    మధ్యలో పెళ్ళి కొడుకు తరపున ఇద్దరు ముత్తయిదువలు రాగా ఒకావిడ్ని పతిగారి భార్య అంటూ పీతాంబరం ఆమెను శారదకు పరిచయం చేసాడు.
   
    ఆవిడ్ని చూడగానే ఆవిడ్ని ఎప్పుడో, ఎక్కడో చూసినట్టుగా అన్పించింది మయూషకు.
   
    ముందు రోజు రాత్రి హైదరాబాద్ నుంచి భుజంగపతి పీతాంబరానికి ఫోన్ చేసాడు.
   
    "నమస్కారం పీతాంబరంగారూ, నవనీత్ గారు ఇవాళ రాత్రికి హైదరాబాద్ వస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి మేం తిరుపతిలో వుంటాం. పెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకు కదా? పెళ్ళి కొడుకుని అలంకరణలతో సహా సరిగ్గా ఎనిమిదిన్నరకు తీసుకొస్తాం. ఎక్కడా ఏ రకమైన ఇబ్బందీలేదు కదా" అని యోగ క్షేమాలు విచారించి ఫోన్ పెట్టేసాడు భుజంగపతి.
   
                                          *    *    *    *
   
    ఆ రోజే పెళ్ళి.....
   
    కొండ మీద కళ్యాణ మండపం అట్టహాసంగా అలంకరించబడింది.
   
    మధ్యాహ్నం నాలుగు గంటల సమయానికి మయూష క్లాస్ మేట్స్ పదిమంది బిలబిలా మంటూ వచ్చేసారు.
   
    "పెళ్ళికొడుకు ఎక్కడున్నాడో చెప్పు అట పట్టించి వస్తాం" ఇద్దరు ముగ్గురు అడిగారు.
   
    "ఆయన రాత్రే అమెరికా నుంచి వచ్చారట కార్లో హైద్రాబాద్ నుంచి వస్తుంటారు" సిగ్గుపడుతూ చెప్పింది మయూష.
   
    "తెలుగు సినిమాల్లోలా చివరి నిమిషంలో వచ్చి తాళికట్టి నిన్ను అమెరికాకి తోలుకుపోతాడన్న మాట."
   
    "తోలుకుపోవడానికి నేనేం గొర్రెనా?"
   
    "గొర్రె కాకపోతే మేక. ఈ దేశంలో పెళ్ళయిన ఆడదెప్పుడూ మంగళసూత్రం అనే తాడుతో కట్టివేయబడిన నోరులేని జంతువు లాంటిదే" ఒకమ్మాయి అంది. ఆ అమ్మాయి మహిళా స్వేచ్చ కోసం అంకితమై కవితలూ, కథలూ అవీ రాస్తూంటూంది.
   
    కాసేపయ్యాక అందరూ పెళ్ళి మండపానికి వెళ్ళిపోయారు.
   
    తల్లీ, వదినెల మధ్య సిగ్గు మొగ్గలైపోతూ కూర్చుంది మయూష.
   
    అదే సమయంలో భర్తతో సహా లోనికొచ్చింది గాయత్రి.
   
    "ఇప్పుడటమ్మా రావడం, రెండ్రోజులు ముందొస్తారనుకున్నాను"
   
    "అదిగాదు పిన్నిగారూ-మీ అల్లుడికి సెలవు దొరకలేదు" చెప్పి మయూష దగ్గరకు నడిచి-

    "ఇంకో రెండు గంటలేనమ్మా నీకు స్వేచ్చ, ఇప్పుడయినా తల ఎత్తుకుని చూడు" ఆ మాటకు తలెత్తి చూసిందామె.
   
    ఎదురుగా శివాజీ!
   
    "ఏంటయ్యా దూరంగా నిలబడతావేం? పక్కింటివాడివైనా నువ్వు కూడా దూరపు బంధువ్వే మీ అత్తగారు చెప్పారు. రా కూర్చో" ఆప్యాయంగా పిలిచింది శారదాంబ.
   
    ఒక కుర్చీని లాక్కొని మయూషకు కొంచెం దూరంలో కూర్చున్నాడతను.
   
    "కంగ్రాచ్యులేషన్స్" నెమ్మదిగా అన్నాడు.
   
    చప్పుడుకాకుండా నవ్వింది మయూష.
   
    మయూషా నువ్వు చూడలేదనుకుంటాను వీరే మీ బావగారు.....అంటే మా ఆయనగారు" పరిచయం చేసింది గాయత్రి అమాయకంగా.
   
    ముసి ముసిగా నవ్వుకొంది మయూష. పుత్తడి బొమ్మలా ఉన్న ఆమెవేపే ఆత్మీయంగా చూస్తున్నాడు శివాజీ.

                                         *    *    *    *
   
    రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలయింది.
   
    కొండమీద పడమరవేపు తోట మధ్యనున్న కళ్యాణమండపం దీపాల వెలుగుల్లో జిగేల్ జిగేల్ మని మెరిసిపోతోంది.
   
    మండపంమీదున్న పురోహితుడు అవీ, ఇవీ సర్దుతున్నాడు.
   
    పట్టుచీరల రెపరెపలొక పక్క, యువతుల పసిడి నవ్వులు ఇంకొక పక్క!
   
    బయట తోటలో కంగారుపడిపోతూ అటూ ఇటూ చూస్తున్నాడు పీతాంబరం.
   
    అంతవరకూ పెళ్ళికొడుకు తరపువాళ్ళు ఏ ఒక్కరూ వచ్చినట్లు దాఖలా లేకపోవడంతో అదే సమయంలో-
   
    ఓ అంబాసిడర్ కారు లోనికి రావడం అందులోంచి భుజంగపతి దిగడంతో పీతాంబరం ముఖం ట్యూబ్ లైటులా వెలిగిపోయింది.
   
    "ఒక అరగంట ఐంది పెళ్ళి కొడుకు వచ్చేసి, మీరు కంగారు పడతారని చెప్పడానికొచ్చాను. అన్ని ఏర్పాట్లూ సవ్యంగా జరిగినట్లేనా?"
   
    "పెళ్ళికొడుకు గెస్ట్ హౌస్ లో లైట్లేవీ లేకపోతే కంగారుపడ్డాను" ఎదురుగా గోడకు కొంచెం దూరంలో వున్న గెస్ట్ హౌస్ వేపు చూస్తూ అన్నాడు పీతాంబరం.
   
    "నవనీత్ బాబు కింద ఏదో కంపెనీ గెస్ట్ హౌస్ లో దిగారు. ముహూర్తపు సమయానికి వచ్చేస్తారు. ఇంకో విషయం పెళ్ళవగానే ఇద్దరూ బెంగుళూరు వెళ్ళిపోతారు" చెప్పాడు భుజంగపతి.
   
    "ఆ మూడ్రోజులు ఏదో శాస్త్రోక్తంగా హైద్రాబాద్ లో మా ఇంట్లోనే చేద్దామని......"
   
    "భలేవాడివయ్యా పీతాంబరం. నీ అల్లుడు మామూలు కంపెనీ క్లర్కు అనుకున్నావుటయ్యా ఏ మలేషియాలోనో, సింగపూరులోనో హేపీగా గడుపుతారు. ఆ విషయం నువ్వు మర్చిపో. ముందు పెళ్ళి సంగతి చూడు.నేనా అబ్బాయితో సహా వస్తాను" వేగంగా అక్కడ నుంచి కదిలి కారెక్కేసాడు భుజంగపతి.
   
    పెళ్ళి మండపంలోకి హుషారుగా వెళ్ళాడు పీతాంబరం.
   
                                                                              *    *    *    *
   
    సరిగ్గా 8.30 నిమిషాలయింది.
   
    పెళ్ళికూతురికి చివరి టచప్ లు చేసి ముత్తయిదువలు మండపం లోకి తీసుకొచ్చారు-ఆ వెంటనే పెళ్ళికూతురితో.
   
    గౌరీ పూజ చేయించేసాడు పురోహితుడు.
   
    ఒక పక్క సన్నగా వాయిద్యాలు మోగుతున్నాయి.
   
    8.45 నిమిషాలయింది.
   
    "పీతాంబరంగారూ పెళ్ళి కొడుకుని తీసుకురండి" పురోహితుడి నోటివెంట ఆ మాట రాగానే పీతాంబరం బయటకు పరుగెత్తాడు.
   
    అమ్మలక్కలు కంగారుపడడం మొదలుపెట్టారు.
   
    ముసుగులో పూల జడల మధ్య తలదించుకుని కూర్చుంది మయూష.
   
    "ముహూర్తం సమీపిస్తోంది. త్వరగా పెళ్ళి కొడుకును తీసుకుని రండి ఏమిటాలస్యం?" విసుగ్గా అన్నాడు పురోహితుడు.
   
    అందరిలో పెరుగుతున్న టెన్షన్.
   
    "వరుడేడి?" కాళహస్తి శర్మను అడిగాడు శివాజీ.
   
    "ఇహ వచ్చెయ్యాలండీ" అని చెపుతూ అప్పుడే సరిగ్గా కళ్యాణ మండపం ముందు ఆగిన కారువేపు చూసి ఉత్సాహంగా పరుగెత్తాడు అతను.
   
    ఇంకా పదిహేను నిమిషాలు మాత్రమే ముహూర్తానికి సమయం వుంది.

 Previous Page Next Page