అర్ధం అపార్దం సినిమా తాలూకా కదా, కమామీషా వీళ్ళకు ముందు తెలియదు. మధ్య మధ్య కబుర్లు చెప్పుకున్నా, శ్రద్దగా సినిమా మొత్తం చూశారు.
ఇద్దరు మొగుళ్ళు, వాళ్ళ తాలూకా ఇద్దరు పెళ్ళాలు వుంటారు. ఓ భర్త తాగటం, తిరగటం, పేకాడటం- అప్పుడప్పుడు పెళ్ళాం దవడలు వాయగొట్టటం చేస్తుంటాడు. ఐనా ఆ మహా ఇల్లాలు భర్తని పల్లెత్తుమాట అనదు. అణిగిమణిగి వుంటుంది. లాస్ట్ సీనులో భార్తా మారిపోయి, మంచివాడు అయి "నన్ను క్షమించు శాంతా!" అంటాడు. వెంటనే శాంత భర్త కాళ్ళమీద పడి 'నన్ను క్షమించండి' అంటుంది. ఆ సినిమాలో హాయిగా ఉద్యోగం చేసుకుంటుంటుంది. దాంతో ఈయన గారు రెండో పెళ్ళి చేసుకున్నారు. దాంతో ఈయనగారు రెండో పెళ్ళి చేసుకున్నారు. ఉద్యోగం చేసే ఆవిడ సిటీ బస్సుకోసం ఎదురుచూస్తూ బస్సు స్టాపులో నుంచుని ఉంటుంది. ఆవిడ ముందునుంచి ఓ జంట ఎవరంటే ఆమె భర్త, ఆ భర్తగారి రెండోభార్య. ఆ తర్వాత మరో స్కూటర్ మీద యింకో జంట రయ్యిన వెళ్ళిపోతారు. వాళ్ళేవరంటే భర్త తాగి తందనాలు ఆడినా క్షమించిన భార్య ఆ జంట.
చివరికి దర్శకుడి నీతి బోధతో తెర వాలుతుంది.
స్త్రీ అమృతమూర్తి, క్షమా ధరిత్రి భర్త చేసిన తప్పులని ఏ స్త్రీ క్షమిస్తుందో, ఆ స్త్రీ దైవస్వరూపిణి. ఆమెకి చివరికి దక్కుతాయి సుఖశాంతులు. అంటూ ఉదాహరణకి ఇరువురు స్త్రేలనీ పోల్చి - బస్సుస్టాపులో నిరాశగా, ఒంటరిగా జీవితంలో తోడు-నీడ లేకుండా నిర్భాగ్యంగా, దౌర్భాగ్యంగా ఎలా నిలిచిందో ఆమెని చూడండి - అంటాడు.
ఇవి దర్శకుడు చెప్పిన చివరి మాటలు.
సినిమా హాలులో జనం అంతా కళ్ళు తుడుచుకుని హాలులోంచి బైటికి వచ్చారు.
రామకృష్ణ, సీతామనోహరి కూడా కళ్ళు తుడుచుకోలేదు గాని, హాలులోంచి బైటికి వచ్చి స్కూటర్ ఎక్కి ఇంటికి వచ్చారు.
ఇంట్లో అడుగుపెడుతూనే -
"దర్శకుణ్ణి నరికిపోగులు పెట్టాలి" అంది సీత.
"అది నీ అభిప్రాయం. జనాభిప్రాయం కాదు. సెంటిమెంటు, నీతులు, త్యాగాలు చిత్రం నిండా గుప్పిస్తే నాలుగు రాళ్ళు రాలతాయని - ఓ విషయాన్ని పట్టుకుని మసి పూసి మారేడుకాయ చేసి చూపిస్తారు. ముఖ్యంగా ఈ ఆడమళయాళమే ఇలాంటి చిత్రాలు ఒకటికి రెండుసార్లు చూసేది-" చల్లగా అంటించాడు రామకృష్ణ.
సీతకి నిజంగానే తలనొప్పి పట్టుకుంది. అందుకే అంతటితో వదిలేసింది. అదే మరొకసారి అయితే చూసి వచ్చిన సినిమాని పట్టుకుని మాటలతో చీల్చి చెండాడి తూర్పార బట్టేది.
ఆ రాత్రికిహ రామకృష్ణ గాని సీత గాని సినిమా గురించి మాట్లాడుకోలేదు.
8
ఆమె పేరు సరోజ.
సీత వున్న యింటికి మూడిళ్ళ అవతలనే సరోజ వుండేది. ఒకరింట్లో పేరంటం సందర్భంలో ఇరువురు కలిశారు. ఒకరింటికొకరు ఆహ్వానించుకున్నారు. ఆ తర్వాత ఓ రోజు సరోజ యింటికి వెళ్ళి వచ్చింది సీత.
సరోజ ఇల్లు వున్నంతలో నీట్ గా వుంది. కాని ఆ ఇల్లాలుకి ఏది ఎక్కడ సర్దాలో తెలియనట్లు లేదు. సరోజ అగ్గిపెట్టేలతోను సిగరెట్టు పెట్టేలతోను బొమ్మలు తయారుచేసింది. నేనేనంటూ చూపించింది.