"వ్యాపార నిమిత్తం పొరుగూరు వెళ్ళిన నాన్నగారు ఆచూకీ తెలియకుండా అదృశ్యమైపోయారు. అయన దగ్గర వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బు కొన్ని లక్షలు వుంది.
"నాన్నగారు, నాన్నగారితో బాటు ఆ డబ్బు కూడా కనబడకుండా పోయేసరికి అయన బిజినెస్ పార్ట్ నర్స్ కి అనుమానం వచ్చింది.
"తమ డబ్బంతా తీసుకుని నాన్నగారు పరారైపోయారని వాళ్ళు ఒక నిశ్చయానికొచ్చారు. అందుకని తమ తమ వాటాలకిందా రావలసిన బకాయిలకు బదులుగా, మా ఆస్తినంతా జప్తు చేయించారు. మాకు తల దాచుకోవడానికి నీడ లేకుండా చివరికి మా ఇల్లు కూడా వేలం వేయించారు.
దానితో ఒక్కసారిగా మా బతుకు బజార్లోపడిపోయింది.
"నాన్నగారు కనబడకుండా పోయారు. ఆస్తి అంతా పోయింది. ఉండటానికి గూడు లేకుండా పోయింది. దీనికి తోడు - ఎంతో ఘరానాగా బతికిన నాన్నగారి మీద ఘరానా దొంగ అన్న అపనింద.
"ఆ దుఃఖాన్ని అవమానాన్ని భరించలేకపోయింది అమ్మ. కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ తర్వాత నాతొ అనేకసార్లు చెప్పింది అమ్మ. "మీ నాన్నగారు అలాంటి మనిషి కాదు కరుణా! నాకు తెలుసు - అయన సాక్ష్యాత్తు ధర్మరాజే. అయన సాటిమనుషులకి సాయం చెయ్యడానికే తన జీవితాన్ని అంకితం చేశారు కరుణా ......అలాంటి సత్పురుషుడు కొన్ని లక్షల కోసం కొంపలు ముంచేసే పని ఏదో చేశారంటే నమ్మగలమా? ఎప్పటికీ నమ్మలేం. మనకు అర్ధం కాని ఏదో జరిగింది కరుణా."
"చనిపోయేముందు చివరిసారిగా అమ్మ పలికిన పలుకులు కూడా అవే. డేలిరియంలో , సంధి ప్రేలపనలాగా అవే మాటలు పదేపదే రిపీట్ చేస్తూ చనిపోయింది అమ్మ.
"నాన్నగారు పోగానే అమ్మకి మనోవ్యాధి పట్టుకుంది.
"ఒక్కోసారి రాత్రిపూట అమ్మ వెక్కిళ్ళు పెడుతుంటే మెలకువ వచ్చేది నాకు. చీకట్లో దిగులుగా కూర్చుని, దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో కలవరిస్తూ వుండేది అమ్మ. 'నాకు చచ్చిపోవాలని వుంది ఇప్పుడే. ......ఇక్కడే, నాకు బతకాలని ఏ కోశానా లేదు.
"కానీ కరుణా! నేను కూడా పొతే నీకు దిక్కేవరమ్మా. అందుకే నీ కోసం బతకాల్సివస్తోంది కరుణా. నీ కోసమే జీవచ్చవంలా బతకవలసివస్తోంది!"
"నన్ను బతికించడం కోసమే అమ్మ బతుకుతోందని తెలుసు నాకు. ఒక్కపైసా కూడా ఆదాయం లేని ఆ స్థితిలో మనసు బాగాలేకపోయినా, ఒంట్లో శక్తి లేకపోయినా కూడా నాకోసం .......కేవలం నాకోసమే.....అక్కడా ఇక్కడా అంట్లు తోమడానికి కుదురుకుంది అమ్మ. అదివరకు దాసదాసీ జనంచేత అడుగులకీ మడుగులోత్తించుకుంటూ బతికినా అమ్మ!
తూరుపు తెలతెలవరకుండానే లేచి కృశించిన శరీరం చలికి గజగజ వణుకుతుండగా, కొంగు తలచుట్టు కప్పుకుని, పాచిపనులు చెయ్యడానికి పోవడం మొదలెట్టింది. నిన్నటిదాకా భోగభాగ్యాలతో తులతూగిన అమ్మ పాతికరూపాయల నెలజీతం కోసం కొంగుపట్టి వాళ్ళనీ వీళ్ళనీ అర్ధించడం మొదలెట్టింది.
"అమ్మని చూస్తే చాలు గుండె నీరయిపోయేది. తను అంట్లు తోముతుంటే నేను గిన్నెలు తొలిచి పెడతాననేదాన్ని దానికి అమ్మ ఒప్పుకునేది కాదు. వద్దమ్మా వద్దూ! ఇలాంటి పనులు నువ్వు చెయ్యలేవు. స్కూలు పుస్తకాలు కొనిచ్చానుగా అవి చదువుకో ఆ అరుగుమీద కూర్చుని' అని అడ్డం పెట్టేది.
"ఆ కష్టాలన్నీ తాత్కాలికమే అనుకున్నాను నేను - 'చీకటిని తరిమేస్తూ వెలుతురూ రాదా? పొద్దుగూకడం ఎంత తధ్యమో, పొద్దు పొడవడం కూడా అంతే సత్యం కదా! మా జీవితంలో ఆ చీకట్లు తొలిగిపోతాయి. వెలుగుకిరణాలు మళ్ళీ అలుముకుంటాయి. ఈ పీడకల కరిగిపోతుంది అని తీవ్రంగా ఆశపడ్డాను.
"ప్రతిరోజూ 'నాన్నగారు ఇవాళ వస్తారు. ఊరి నుంచి వచ్చేటప్పుడు తెస్తానన్న 'అల్లీబిల్లీ లోకంలో అమ్మాయికధ' పుస్తకం తెస్తారు' అని ఆతృతగా ఎదురుచూసేదాన్ని.
"ఆరునెలలు గడిచినా నాన్నగారు తిరిగిరాలేదు. కానీ ఆరోనేల ముగుస్తుండగా అమ్మ చనిపోయింది. మనోవ్యాధి ముదిరిపోయింది తనకి. విషాదంగా ముగిసిపోయింది ఆమె జీవితం."
అలా చెబుతుంటే దుఃఖంతో గొంతు పుడుకుపోయింది కరుణకి.
నిశ్చలంగా చూస్తోంది చిక్ లీ ఆమె వైపు.
దుఃఖం కొద్దిగా ఉపశమించాక మళ్ళీ చెప్పడం మొదలెట్టింది కరుణ.
"అమ్మ కూడా పోవడంతో అనాధనైపోయాను నేను. పూర్తిగా దిక్కులేని దానినైపోయాను.
"నేను కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, అప్పుడు దిగబడ్డారు లక్ష్మీకాంతం, అయన భార్య రమణమ్మా. వాళ్ళు నన్ను చూడగానే ఏడ్చిన ఏడుపులు తెచ్చి పెట్టుకున్న ఏడుపులని అప్పట్లో గ్రహించలేకపోయాను నేను. వాళ్ళు చెప్పిన ఉపశమన వచనాలు మనసారా చెప్పిన మాటలు కావనీ, కేవలం నాలికచివరనుంచి వచ్చిన పలుకులనీ అర్ధం చేసుకోలేకపోయాను.
"నన్ను చూడగానే కావలించుకొని భోరున ఏడ్చారు వాళ్ళు. నాన్నగారికి, తమకీ వున్న దూరపు చుట్టరికం తిరగేశారు. నాకోసం తెచ్చి మిఠాయిలూ, బిస్కెట్లు, బొమ్మలూ, గిల్టు చెవిరింగులు అందరి ముందు ఘనంగా ప్రదర్శించారు. నన్ను తమతో తీసుకుపోయి తల్లి దండ్రి లేని లోటు తెలియనివ్వకుండా , కంటికి రెప్పలాగా కాపాడుకుంటామన్నారు.
"అమ్మ పోయిన తర్వాత నన్ను ఏం చెయ్యాలా అని ఆలోచనలో వున్న ఆ ఇంటివాళ్ళకి, ఈ దూరపు బంధువులు సమయానికి వచ్చి నన్ను తీసుకెళ్ళి పెంచుకుంటామనడం చాలా రిలీఫ్ ని కలిగించింది. వెంటనే ఒప్పేసుకున్నారు వాళ్ళు."
"ఆ తర్వాత ఏమయింది?" అంది చిక్ లీ.
"ఆ తర్వాత ........ఈ ప్రపంచంలో వున్న అన్ని రకాల కష్టాలు అనుభవించాను నేను. ఆకలితో అలమటించిపోయాను. వాళ్ళు పూటకి గుప్పెడు మెతుకులే పెట్టేవాళ్ళు నాకు. అవి అందరూ తినగా మిగిలిపోయిన అడుగూ బొదుగూ మెతుకులు. ఇంటెడు చాకీరి నాతొ చేయించేవారు. నా రెక్కలు ముక్కలయి పోయేవి. మాసితోళ్ళలా వున్న చిరుగుల పరికిణి, జాకెట్టు తప్ప మరోజత బట్టలుండేవి కావు నాకు. తమ కొడుకు కిట్టుని, కూతురు విజ్జిని మాత్రం అతిగారాబంగా చూసుకునే వాళ్ళు. నాకు చదవంటే ప్రాణం. కానీ నన్ను చదివించేవాళ్ళు లేరు. కిట్టు, విజ్జీల కోసం వాళ్ళు ట్యూషన్ మాస్టారిని పెడితే, నేను దూరంగా గుమ్మం దగ్గర కూర్చుని, వాళ్ళకు చెబుతున్న పాఠాలు నేను విని నేర్చుకునేదాన్ని. పాఠాలు వినడంలోపడి ఒకరోజు బట్టలుతకడం మర్చిపోతే, రమణమ్మ పిన్ని నా కంట్లో కారం పెట్టింది. ఇంకో రోజేమో గరిటె కాల్చి వాత పెట్టింది. ఇదిగో .......మచ్చ చూశావా?" అంది చీరె కుచ్చేళ్ళు కొద్దిగా పైకి ఎత్తి.
ఆమె కాలి మణికట్టు కొద్దిగా పైన వుంది - గాయం మనిన మచ్చ.
"ప్చ్ ప్చ్!" అంది చిక్ లీ, సానుభుతో, వెక్కిరింపో అర్ధం కాకుండా.
"అయినా అష్టకష్టాలు పడి పాఠాలు విని వంటబట్టించుకునేదాన్ని నేను. కొన్నేళ్ళు గడిచాయి. అప్పుడు మరో కొత్త కష్టం వచ్చి పడింది నాకు."
"ఏమిటది " అంది చిక్ లీ.
"ఏళ్ళతో పాటు వయసు వచ్చింది నాకు. నేను చాలా బాగుంటానని ఎప్పుడూ అంటుండేవాడు కిట్టూ. వాడుత్త రౌడీరకం. వాడు అలా అంటే నాకు చాలా కోపం వచ్చేది. అయినా తిరగబడి ఏమీ అనలేకపోయేదాన్ని. ఎందుకంటే దిక్కులేని దాన్ని "ఆ అలుసు చూసుకుని ఇంకా విజ్రుంభించాడు కిట్టూ. చివరికి ఒకరోజు తెగింపు వచ్చేసింది నాకు. ఇన్నాళ్ళ నుంచీ ఇన్ని రకాల కష్టాలు పడుతూ ఇక్కడ వుండగాలిగాను గానీ, ఇంక ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసివస్తే ఇంక ఇక్కడ వుండటం అసంభవం అనుకుని ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని బయటపడి పారిపోయాను.
అయినా నేను పారిపోవడం చూడనే చూశాడు కిట్టూ. వాడు నన్ను వదలదలుచుకోలేదు. నా వెంటపడి తరిమాడు. భయంతో, దుఃఖంతో, ముందూ వెనకా చూసుకోకుండా పరిగెత్తిపోతూ ఒక రైలు బ్రిడ్జి ఎక్కాను నేను. సరిగ్గా అదే సమయంలో అదే ప్రదేశంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్ ని విలన్ తరుముతూ వుంటే హీరో వచ్చి రక్షించే దృశ్యమట అది. కానీ నా విషయంలో నిజంగా జరుగుతున్నది కూడా అదే. హీరో హరీన్ సినిమా హీరోయిన్ కి బదులు నన్ను రక్షించాడు. ఇద్దరం నదిలోపడి ఈ లోయలో చేరాం. చిక్ లీ! నేను చెబుతున్నది అక్షర సత్యం. నన్ను నమ్ము" అంది దీనంగా.
సమాధానంగా చిక్ లీ పెదవి మెదపబోయేటంతలో -
కొండదేవత దగ్గర వుండే భేరీనాధం వినబడింది. దానితో బాటు దేశింగ్ గొంతు వినబడింది పెద్దగా -
"సివంగికోన కి వెళ్ళిన కులగురువు మంత్రాల మల్లయ్య తిరిగి వస్తున్నాడహో! జింబురూ విషయంలో తీర్పు వినడానికి అందరూ రావాలి ఆహొయ్!"
అది విని బిగుసుకుపోయింది కరుణ. దూరంగా వున్న హరీన్ వైపు చూసింది.
అక్కడ నిర్భయంగా, నిర్వికారంగా నిలబడి వున్నాడు హరీన్.
కానీ కరుణకి తెలుసు- అతను మహానటుడు. పైకి నిర్వికారంగా వున్నట్లు కనబడుతున్నా అతని మనసులో రకరకాల ఆలోచనలూ, ప్రణాళికలూ రూపొందుతూ వుండే వుంటాయి - ఈ ఆపదనుంచి గట్టెక్కడానికి. అది నిజం ...