"మనిద్దరి సంగతి తెలిస్తే...." అర్థోక్తిలో ఆగిపోయిందామె.
'ఇందు మనసు గాయపడుతుంది' మనసులో అనుకున్నాడతను. సడన్ గా టాపిక్ ను మార్చేసింది మోహిత.
"భర్త అదిరిపడేదెప్పుడు?" అడిగిందామె.
"సడన్ గా ఈ ప్రశ్న ఏమిటి? నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడతను.
"చెప్పు..... తెలిస్తే...."
"తెలీదు."
"శోభనం గదిలో భర్త అరెరె.... అదేంటి పాతకాలంలోగా కాళ్ళమీద పడి దణ్ణం పెడుతున్నావ్? అనంటే, ఈ ఒక్కరోజేగా అని భార్య అన్నప్పుడు...." అని చెప్పిందామె.
గట్టిగా నవ్వేశాడు మైత్రేయ.
అప్పటికే సాయంత్రం నాలుగు గంటలు దాటింది. ఇద్దరూ ఇంటిముఖం పట్టారు.
* * *
రాత్రి పదిగంటలు దాటింది.
మధ్యగదిలో టి.వి. చూస్తోంది ఇందు.
బెడ్ రూమ్ లో అటూ యిటూ పచార్లు చేస్తున్నాడు వెంకటయ్య.
కుర్చిలో కూర్చుంది సావిత్రమ్మ.
"ఏమిటీ.... ఏదో విషయం అర్జంటుగా మాట్లాడాలని అన్నారు" అడిగింది సావిత్రమ్మ.
"తలుపు దగ్గరగా వెయ్" అన్నాడతను. వెంటనే బెడ్ రూమ్ తలుపు దగ్గరకి వేసిందామె.
"ఇందు పెళ్ళి గురించి....." నెమ్మదిగా అన్నాడతను.
"అంటే...."
"మైత్రేయ మీద నేనాశాలు వదిలేసుకున్నాను. ఒకసారి అమ్మాయి వలలో పడిన మగాడెవడైనా, జీవితాంతం ఆ మాయలోనే వుంటాడు కానీ భార్యను సుఖపెట్టలేడు.... కనుక ఇందుకి ఏలూరు సంబంధం ఖాయం చేస్తే ఎలా వుంటుంది?" అడిగాడాయన.
"చిన్నప్పటినుంచీ మైత్రేయ గురించి మనకు తెలుసు.... అమ్మాయిలంటే ఆమడ దూరం పరుగెత్తే మైత్రేయ ఓ అమ్మాయి ప్రేమలో పడిపోతాడని నేననుకోలేదు.... ఇందంటే వాడిక్కూడా ఇష్టమే..... ఏలూరు సంబంధం నిశ్చయం చేసేముందు మైత్రేయతో మాట్లాడితే బావుంటుంది" సలహా ఇచ్చిందామె.
"ఎక్కడున్నాడని మాట్లాడాలి? ఒక హంతకుడికి నా కూతుర్ని చచ్చినా యివ్వను" పెద్దగొంతుతో ఆవేశంగా అన్నాడు వెంకటయ్య.
ఆ మాటలు హాల్లో టి.వి. చూస్తున్న ఇందుకు స్పష్టంగా విన్పించాయి. వెంటనే ఆమె టి.వీ. ఆఫ్ చేసి, చరచరా తల్లీదండ్రులున్న గదిలోకొచ్చింది.
"మీకిష్టమయినా, ఇష్టం లేకపొయినా నేను బావనే పెళ్ళి చేసుకుంటాను" అంది ఇందు.
"పెళ్ళి చేసుకుని నా పరువు తీస్తావా?' అరిచాడు వెంకటయ్య.
"బావతో నాపెళ్ళి జరక్కపొతే నాకు పెళ్ళే అక్కరలేదు..... చచ్చిపోతాను" ఆవేశంగా అంది ఇందు.
"వాడు ఓ అమ్మాయి వలలో పడిపోయాడు..... మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు..... పరారీలో వున్నాడు. రేపో ఎల్లుండో పోలీసులకు దొరికిపోతాడు. జైలు కెళతాడు. ఏడేళ్ళో, పధ్నాలుగేళ్లో జైలుశిక్ష పడుతుంది. మీ ఇద్దరికీ పెళ్ళెలా జరుగుతుందో ఆలోచించు.... ఆవేశం కాదు..... దేనికైనా ఆలోచన వుండాలి. అర్థమయిందా?" నెమ్మదిగా అన్నాడాయన.
మైత్రేయ విషయంలో తండ్రి చెపుతున్నవన్నీ నిజాలని నమ్మలేకపోతోంది ఇందు.
"బావ నిర్దోషి.... బావకు ఏ పాపం తెలీదు" నిక్కచ్చిగా చెప్పింది ఇందుమతి.
ఆ మాటలకు వెంకటయ్యకు బాగా కోపం వచ్చింది. అంతలోనే అతను నిగ్రహించుకుని, కూతురు దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ-
"ఒక్కగానొక్క కూతురివి..... నువ్వు హాయిగా వుంటే మేం హాయిగా వుంటాం. మైత్రేయని కన్నకొడుకులాగా పెంచాను. వాడంటే, నీకన్నా నాకిష్టం..... అయినా పాడయిపోయినవాడికి నిన్ను కట్టబెట్టి, నీ జీవితాన్ని నేను పాడు చేయలేను..... ఆ ఏలూరు సంబంధం వాళ్ళకి రేపే కబురు చేస్తాను. ఈ వారంరోజుల్లోనే నీ పెళ్ళిచూపులు.... అంతే" తను చెప్పాల్సింది చెప్పేసి, గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు వెంకటయ్య.
"అమ్మా! బలవంతపు పెళ్ళి చేస్తే ఉరిపోసుకుని చస్తాను.... అప్పుడుగానీ, నీకూ నాన్నకూ బుద్ధిరాదు" కోపంగా అనేసి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది ఇందు.
ఎటూ మాట్లాడలేని పరిస్థితిలో వుంది సావిత్రమ్మ.
* * *
శివాలయానికి ఎడమ పక్కనున్న కొబ్బరితోటలో గట్టుమీద కూర్చున్నారు సరోజ, ఇందు.
"మగాడ్ని ఖాళీగా వదిలితే, అమ్మాయిల వల్లో పడిపోతారని నేను చెప్పానా? మీ బావ విషయంలో అదే నిజమయింది. నువ్విప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్?" అడిగింది సరోజ.
"నువ్వే చెప్పు."
"మీ బావతో ఒకసారి మాట్లాడితే బావుంటుంది....." చెప్పింది సరోజ.
"ఎక్కడున్నాడో తెలీదు కదా?"
"హైదరాబాద్ లో మీ బావ రూమ్మేటు చంద్రబోసుకి ఫోన్ చేస్తే మీ బావ గురించి తెలుస్తుందేమో!"
"గుడ్ ఐడియా..... ఇప్పుడే ఫోన్ చేద్దాం" వెంటనే ఇంటికొచ్చి, మైత్రేయ పనిచేసే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫోన్ నెంబర్ తీసుకుని ఎస్.టి.డి. బూత్ దగ్గరకొచ్చారు.
ఎస్. టి. డి. బూత్ ఆపరేటర్ కు ఆ నెంబరిచ్చారు.
వెంటనే లైన్ దొరికింది. చంద్రబోస్ లైన్లోకొచ్చాడు.
ఒకసారి మైత్రేయతో చంద్రబోసు తమ ఇంటిక్కూడా వచ్చాడు.
నందిగామ నుంచి ఇందును మాట్లాడుతున్నాననగానే చంద్రబోసు వివరాలేవీ చెప్పకుండానే గుర్తుపట్టేశాడు.
పదినిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసింది ఇందు.
"ఇరవై రోజులైంది.... ఉత్తరంగానీ, ఫోన్ గానీ లేదట. కనీడం తనని కూడా కాంటాక్ట్ చెయ్యకపోవటం ఆశ్చర్యంగా వుందని అంటున్నాడు చంద్రబోసు. రెండ్రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చెయ్యమన్నాడు..... ఈ లోపల ఏదైనా మెసేజ్ తెలిస్తే చెప్తానన్నాడు...." చెప్పింది ఇందు సరోజతో.
మౌనంగా ఇద్దరూ ఇంటిముఖం పట్టారు. ఇంటిగేటు వరకూ వచ్చి సరోజ వాళ్ళింటికి వెళ్ళిపోగా, లోనికి అడుగుపెట్టింది ఇందు.
వరండా మెట్లెక్కుతున్న ఇందుకు తల్లితో మాట్లాడుతున్న తండ్రి మాటలు విన్పిస్తున్నాయి.
"నువ్వేం చేస్తావో, ఎలా నచ్చచెప్పుకుంటావో నాకనవసరం..... అబ్బాయి బుద్ధిమంతుడు, నాకు నచ్చాడు, ముంబాయిలో వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళకి కట్నం విషయంలో పెద్ద పట్టింపులు లేవు. రేపు ఆదివారం పెళ్ళిచూపులు" చెప్పేసి పెరట్లోని నూతివేపు వెళ్ళాడాయన.
తల్లి ఏదో ప్రశ్న వేయబోయి, లోనికొస్తున్న కూతుర్ని చూసి ఆగిపోయింది.
"రేపాదివారం నీ పెళ్ళిచూపులు" కూతురు ముఖంలోకి చూస్తూ చెప్పి, వంటగదిలో కెళ్ళిపోయిందామె.
"పెళ్ళిచూపులట.... పెళ్ళిచూపులు.. అంతా మీ ఇష్టమేనా?" సణుక్కుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది ఇందు.
* * *
` యాభై అయిదేళ్ళ రాజేంద్రకుమార్ బలంగా, దృఢంగా వుంటాడు. విశాలమయిన ముఖం. ఆ ముఖానికి గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు, పట్టులాల్చీ, పంచె, కోరమీసాలు, ఎడంచేతిలో త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ఫ్యాకెట్, ఫారిన్ లైటర్. సర్రుమని జీపు ముదుమలైలోని ఫారెస్ట్ ఆఫీస్ ముందు ఆగింది. అందులోంచి ఠీవీగా దిగి, లోనికి అడుగు పెట్టాడతను.
రాజేంద్రకుమార్ ని చూడగానే ఫారెస్ట్ ఆఫీసర్ దీన్రాజు తన సీట్లోంచి లేచి స్వాగతం పలికాడు.
"ఏం దీన్రాజు.... ఏమిటి కత.... అర్జంటుగా రమ్మని ఫోన్ చేశావేంటి?" కుర్చీలో కూర్చుంటూ అడిగాడు రాజేంద్రకుమార్.
"నాకు చెప్పిందంతా నీ నోటితోనే సార్ కు చెప్పు" పక్కనే వున్న క్లర్క్ వేపు తిరిగి అన్నాడు దీన్రాజు.
రాజేంద్రకుమార్ దగ్గరకొచ్చి, చేతులు కట్టుకుని తన దగ్గరికొచ్చి మైత్రేయ అడిగిన వివరాలన్నీ చెప్పాడు క్లర్కు. అతను చెప్పిన విషయాలన్నీ మౌనంగా విన్నాడు రాజేంద్రకుమార్.
"వాడిపేరు?" అడిగాడాయన.
"తెలీదు సార్."
"వాడే అనుకుంటా.... మాండ్యాలోని ఇంటిక్కూడా వెళ్ళి, మా పనివాడిని నా గురించి వివరాలు అడిగాడట" అతను వెలిగిస్తూ అన్నాడాయన.
"ఏ.సి.బి. వాడో, ఎక్సయిజ్ వాడో హైదరాబాద్ నుంచి వచ్చాడేమో!" టేబుల్ మీదున్న త్రిబుల్ సిగరెట్ పాకెట్ లోంచి సిగరెట్ తీసుకుంటూ అన్నాడు ఫారెస్ట్ ఆఫీసర్ దీన్రాజు.
"మనకు తెలీని సి.బి.ఐ. వాళ్ళు, ఎక్సయిజ్ వాళ్ళు ఎవరున్నారు?" సాలోచనగా అన్నాడాయన.
"వాళ్ళకు మీ డిటైల్స్ ఎప్పుడో తెల్సు..... ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు" అన్నాడు దీన్రాజు.
"ఫారెస్ట్ గెస్ట్ హౌస్ గురించి వాడికి నువ్వే చెప్పావా?" క్లర్కుని అడిగాడు రాజేంద్రకుమార్.
"లేద్సార్!" వెంటనే అబద్ధం ఆడేశాడు ఆ క్లర్కు.
"వాడు గెస్ట్ హౌస్ కు వెళ్లుంటాడా?"
"ఎలా వెళ్ళగలడు?"
"నీకు తెలుసా..... ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మర్డరయ్యాడు" దీన్రాజుతో అన్నాడు రాజేంద్రకుమార్.
"తెల్సు సార్!"
"ఎవరు చేసుంటారంటావ్?"
"నాకేం తెల్సండీ బాబూ..... నేను ఫారెస్టోన్ని..... పోలీసోన్ని కాదు"
ఆ సమయంలో రాజేంద్రకుమార్ కి మోహిత గుర్తుకు వచ్చింది. నెలరోజుల క్రితం ఆమె తనతో గొడవపడడం, తను స్వతంత్య్రంగా బతుకుతానని గెస్ట్ హౌస్ నుంచి మైసూర్ వెళ్ళిపోవడం..... తను ఆమెకిచ్చిన మైసూర్ ప్లాట్ లో మర్డర్ జరగడం, అందులోనూ తన ఫ్రెండయిన రవీంద్రనాథ్ మర్డర్...
ఆ మర్డర్ మోహితే చేసిందా? పోలీసులకు దొరక్కుండా ఎలా తప్పించుకుంది? ముందు జాగ్రత్త చర్యగా మోహిత, రాజేంద్రకుమార్ పేరుమీద మారుతి కారు బుక్ చేసి తీసుకుందనే విషయం అతనికి తెలీదు.
"ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళదాం పద.... వాడెవడో మనకు తెలిస్తే, ఏం చెయ్యాలో ఆలోచిద్దాం....!" కుర్చీలోంచి లేస్తూ అన్నాడు రాజేంద్రకుమార్.
"పదండి!" లేచి నిలబడ్డాడు ఫారెస్ట్ ఆఫీసర్ దీన్రాజు. ఇద్దరూ బయటకొచ్చి జీపెక్కారు.
* * *
సాయంత్రం నాలుగు గంటలు దాటింది సమయం.
"ఇక్కడకు దగ్గర్లో బురదగుంట అనే ఏరియా వుంది. ఆ బురదలో స్నానం చెయ్యడం నాకిష్టం. ప్రకృతి ఆశ్రమాల్లో కూడా అవలంబించే ప్రక్రియే ఇది. నువ్వెప్పుడయినా బురదలో స్నానం చేసావా?" అడిగింది మోహిత.
"లేదు.... పన్నీటి స్నానం కూడా చేయలేదు" జోక్ గా అన్నాడు మైత్రేయ.
"మన పెళ్లి అయ్యాక ఇద్దరం కలిసి, పన్నీటి స్నానాలే చేద్దాంలే. జంటగా బాత్ రూమ్ లో స్నానాలు చెయ్యడం నాకిష్టం..... నవ్వుతూ చెప్పిందామె.