Read more!
Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 1

                                 


    
                          శ్రీ శ్రీ సంసార ప్రస్థానం    
             
                                                 ---సరోజా శ్రీశ్రీ
    
    
                                                                                                                                                               
    
    విజయనగరం వాస్తవ్యులు -మధ్య తరగతి కుటుంబీకులు - హైస్కూల్ హెడ్మాస్టరూ అయిన శ్రీ ఉపద్రష్ట సూర్య నారాయణ. మ.స. సీతారామయ్యగార్లకు జన్మించిన కుమార్తెను నేను. మా తల్లిదండ్రులకి పదిమంది సంతానం. వచ్చే 150 రూపాయల జీతంతో పిల్లల చదువులు, పెరుగుదల ఇబ్బందిగానే వుండేది. కానీ మా నాన్నగారు పెద్ద ఆశావాది. ఆడపిల్లలంటే పంచప్రాణాలు అదే ఈనాడు మా భవిష్యత్తుకు పునాది అయ్యింది.
    మేము ఆరుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలం. పసితనంలోనే ఇద్దరు కళ్ళుమూసేరు. ఆడపిల్లల కెవరికీ ఇంగ్లీషు చదువులు లేవు. చిన్నతనంలోనే నన్ను సంగీతంలో ప్రవేశపెట్టారు. నా జాతకంగానీ, పుట్టిన తేదీగానీ, సంవత్సరం గానీ సరిగ్గా లేవు. మా నాన్నగారికి నేనంటే అపరిమితమైన ప్రేమ, ఒకటి మాత్రం బాగా తెలుసు. కార్తీక బహుళ అష్టమినాడు మాత్రం పుట్టాను. ఈ మాసం నాకూ, శ్రీశ్రీ గారికి కూడా చాలా ఇష్టమైన మాసం. నేను చిన్నప్పుడు చాలా అల్లరి పెట్టేదాన్నట. 8వ ఏటనే శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారి ఫేవరేట్ కథ అయిన 'శ్రీ రుక్మిణీ కళ్యాణం' హరి కథని వారి ప్రియశిష్యులైన శ్రీ శ్రీపాద సన్యాసరావుగారి దగ్గర దాసుగారి బాణీలో నృత్యం, అభినయంతో సహా నేర్చుకున్నాను. 8 నెలలలో ఆ కథంతా కంఠస్తం చేసేశాను. అది నా ఫేవరేట్ కథ అయ్యింది. రామాయణం మొత్తం నేర్చుకున్నాను. రుక్మిణీ కళ్యాణం మాత్రం వందసార్లు వంద స్థలాల్లో చెప్పాను. ఆ రోజుల్లో 'మాష్టారమ్మాయి బాలభాగవతారిణి ఉపద్రష్ట సరోజినీకుమారి' అనేవారు.
    నేను కథలు చెప్పడంతో మా నాన్నగారికి కొంచెం ఊపిరి తీసుకోవడానికి అవకాశం కలిగింది. వేడినీళ్ళకి చన్నీళ్ళులా తోడయి వారి కష్టాల్లో భాగం పంచుకున్నాను. సంగీత విద్యలో నన్నెంతో గొప్పదాన్ని చెయ్యాలని మా నాన్నగారికుండేది. అప్పటికే ఆంద్రదేశంలో  చాలావరకు హరికథల్లో నాకు పేరొచ్చేసింది. దాంతో మా నాన్నగారిలో ఆరాటం కూడా ఎక్కువైంది. విజయనగరం సంగీత కళాశాలలో చేర్పించారు. అప్పుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రిన్సిపాల్. నాకట్టే ప్రోత్సాహం ఇవ్వలేదు సరిగదా  సంగీతం నేర్పకపోవడంతోపాటూ హేళన కూడా ప్రారంభించేరు. దాంతో తన శక్తికి మించిన పని అయినా తన నూటయాభై రూపాయలతో జరిగే పనికాదని తెలిసికూడా కాబూలీ దగ్గర అప్పుచేసి, మా అమ్మగార్ని తోడిచ్చి సంగీతం కోసం మా నాన్నగారు నన్ను మద్రాస్ పంపించారు. ఈ విషయం గురించి మావాళ్ళంతా విమర్శించారు. నేనూ, మా నాన్నగారు కూడా వాటిని లెక్కపెట్టలేదు. మా ఇద్దరి లక్ష్యం, పట్టుదలా ఒక్కటే సంగీతంలో ప్రావీణ్యాన్ని సాధించాలి.
    అలాగే - ఒకసారి మద్రాస్ రావడం, ఆరునెలల్లోగా తిరిగి వెళ్ళడం కూడా జరిగింది. రెండవసారి ఫైనల్ గా 1953లో అమ్మతో మద్రాస్ వచ్చాను. నాన్నగారు పంపించే డబ్బుతో, కట్టుబాట్లతో మా అమ్మగారు నన్ను కంటికి రెప్పలా కాపాడేది.
    'వయస్సు చాలదు - కాలేజీలో సీటు ఇవ్వమనేశారు. అది 1953. ఒక ఏడాది వృధా కాకూడదని అకాడమీలో చేరి ప్రొఫెసర్ సాంబమూర్తిగారి ప్రోత్సాహంతో టీచర్స్ ట్రయినింగ్ ఫస్టు క్లాసులో పాసయ్యాను. ఒక పక్క వడ్డీతో సహా అప్పులు పెరుగుతున్నాయి. ఏం చేస్తాం!
    అప్పుడు నేను, మా అమ్మ, నేటి సుప్రసిద్ధ గాయని సుశీల కలిసి ఒక యింట్లోనే వుండేవాళ్ళం.
    1954లో చాలా అవస్థపడి 'సెంట్రల్ కాలేజీ ఆఫ్ కర్నాటక్ మ్యూజిక్'లో చేరిపోయాను. 1956 ఏప్రిల్ లో 'సంగీత విద్వాన్' ఫస్ట్ క్లాస్ లో పాసై, సర్టిఫికేట్ తీసుకొని నాన్నగార్ని సంతోషపెట్టాను.
    ఈలోగా నాన్నగారు రిటైర్ అయిపోయారు.
    నాన్నగారు - యిద్దరక్క చెల్లెళ్ళు (నేటి 'వెరైటీ గాయని' అని బిరుదు పొందిన రమోలా, హాస్య నటచక్రవర్తి కీ.శే. శ్రీ రాజబాబు భార్య అయిన నా ఆఖరి చెల్లెలు అమ్మలు) మద్రాస్ వచ్చేశారు. బాధ్యతలు నెత్తినపడ్డాయి. అయితే ఈమధ్యకాలంలో సుప్రసిద్ధ సంగీత దర్సకులైన శ్రీ టి.చలపతి రావుగారు మాకు ఫేమిలీ ఫ్రెండ్ కన్నా ఎక్కువయ్యేరని చెప్పాలి. తోడబుట్టిన అన్నదమ్ములకన్నా ఎక్కువగా చూసుకొనేవారు. ఆయనని 'అన్నయ్యా!' అని పిలిచేవాళ్ళం.
    చదువు పూర్తయింది. మద్రాస్ లోనే సెటిల్ అవాలని పట్టుదల. జన్మస్థలాన్ని అందరం వదిలేశాం. కొత్తకాపురం, అయిదుగురం బ్రతకాలి. ఇక చూడండి. మా అవస్థ. మా నాన్నగారు రిటైర్ అయి మద్రాస్ వచ్చేసినప్పటికీ ఇల్లు గడవడం కోసం నానా అవస్థలూ పడి మైలాపూర్ లజ్ లో వున్న మూర్తీస్ ట్యుటోరియల్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ గా ఆ రోజుల్లో రూ. 300 రూపాయలకి ఉపాధి కుదుర్చుకున్నారు.

Next Page