Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 37

    " కాశీమజిలీ కధలు ఇలాగే వుంటాయి. కావాలంటే పుస్తకం యిస్తాను. చదవండి.

    పాత లాంతరు రుద్దితే భూతం ప్రత్యక్షం కావటం... పళ్ళగంప లోంచి ఆకాశరాజు వూడిపడటం... రొట్టెల వాడికధలో రొట్టె తుంచగానే రాకుమారి మంజరీదేవి రొట్టె మధ్యలో నవ్వుతూ నిలబడి వుండటం..." అబ్బులు యింకా చెప్పబోయాడు గాని-

    బిందురేఖ అడ్డు తగిలింది " అబ్బ, ఏం కదలండీ మివి. కధానాయకులు, కధానాయికలు రొట్టెలమ్మే వాళ్లు, పళ్ళమ్మే వాళ్ళు, పాతలాంతర్లు బాగుచేసేవాళ్ళు..."

    సవరాలు కట్టేవాళ్ళు... అంటూ చివరిమాట జయచిత్ర పూర్తిచేసింది.

    " ఏం వాళ్ళకి కధలుండకూడదా? వాళ్లు హీరో హీరోయిన్లకి పనికిరారా? వాళ్ళకేం వచ్చింది? కాలొంకరా కన్నొంకరా? కధలో వాళ్ళ శౌర్య పరాక్రమాలు చదువుతుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది.

    ఉత్తేజం వుప్పొంగి పోతుంది. రక్తం వేడెక్కుతుంది. రోమాలు నిక్కపొడుచుకుంటాయి. సాహసం ధైర్యం... అదీ ఇదీ... అ... ఊ..." అన్నాడు అబ్బులు భూతద్దాలలోంచి బిందురేఖని కళ్ళార్పకుండా చూస్తూ.

        " ఎవరికీ?" మాట సాగదీస్తూ అంది జయచిత్ర.

    " ఏం, మికు మాత్రం కధ వింటుంటే ఆ త్రిల్ రాలేదా?"

    " త్రిల్లు , నా పిండాకూడా, మి రాజకుమారుడేం రాజకుమారుడండీ. ఏ బండ రాతిలోనో దేవతుంటుంది.

    మి రాజకుమారుడి కాలివేలి గోరు మార్గం మధ్యలో వున్న ఆ రాతికి తగులుతుంది. అక్కడ రాయి మాయమయి ఆ ఆస్థానంలో ఓ యక్షిణి ప్రత్యక్షమవుతుంది.

    అప్పుడు యక్షిణి ' వీర రాకుమారా ప్రతాపచంద్రా! భూత ప్రేత పిశాచాలు వేలకొద్దీ వాడి రహస్య మందిరానికి కాపలా కాస్తుంటాయి.

    ఎవరూ వాడిని చంపలేరు. యాదిగో ఈ ఖడ్గం నీ కిస్తున్నాను ఇది ఇంద్రుడిది. దీనితో వాడిని చంపు నీకు జయంకలుగుతుంది.

    నేను శాపవశాత్తు రాయినయాను. నీ గోరు తగిలి శాపవిమోచనం అయింది' అని చెప్పి ఖడ్గమిచ్చి మయామవుతుంది.

    రాజకుమారుడు ఆ ఖడ్గంతో రాక్షసుడిని చంపి రాజకుమారిని రక్షించి తీసుకు వస్తాడు. అంతేనా!" అంది బిందురేఖ.

    " అంతే, అంతే" అన్నాడు అబ్బులు.

    " గుడ్! రాయిలో యక్షిణి లేకపోతే, ఆ యక్షిని ఖడ్గం యివ్వకపోతే రాక్షసుడిని రాజకుమాడు చంపగలిగే వాడా?" అంది బిందురేఖ.

    " ఎట్టాగోఅట్టా చంపాలి కదా?" అంది జయచిత్ర.

    " ఎట్టాగోఅట్టా చంపాలి కదా అని ఎలాగో అలా కధలో సాయంచేస్తే ఎలా?" అంది బిందురేఖ.

    " ఎలాగో అలా సర్దుకుందూ?" అంది జయచిత్ర.

    " అదెలా? కుదరదు" అంది బిందురేఖ.

    " ఇంకెలాగో మరి...?" అన్నాడు అబ్బులు.

    " ఇలా... రాజకుమారుడికి శౌర్య పరాక్రమాలు లేవు. చేవలేదు. సొంత ఖడ్గంతో ఛీమపిల్లను కూడా చంపడు..."

    " నువ్వు చూసొచ్చావేమిటీ?" అంది జయచిత్ర.

    " చూడాలేమిటి? కధలో వుందిగా! రాజకుమారుడికి ఏ దేవతో, దెయ్యామో ప్రత్యక్షమై వరాలు, ఖడ్గాలు, మాయ కుండలాలు, కీలుగుర్రం లాంటివి ప్రసాదిస్తే-

    వాటి సాయంతో కొండంత రాక్షసుడినీ చంపుతాడు. ఏనుగంత మాంత్రికుడినీ హతమారుస్తాడు.

    ఏ సాయమూ లేకుండా తన భుజ బలంతో, తల ఖడ్గంతో రాక్షసుడిని చంపితే అదీ శౌర్యం, అదీ ధైర్యం.

    ఎవడో సాయంచేస్తే ఎలాగో అలా చంపేవాడు ఏం రాజకుమారుడు! ఉత్త వాజమ్మ" అంది బిందురేఖ.

 Previous Page Next Page