Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 31


    రోజులు గడుస్తున్న కొద్ది తనకి సుగుణకి మధ్య అన్నింటికి ప్రతిబంధకంగా రవి వస్తున్నడన్నది మరీ భరించరాని విషయంగా తయారయింది . ఆ కోపం సుగుణ మీద తీర్చుకునే వాడు! షికారు వెడదాం , సినిమాకి వెడదాం అనేవాడు. సుగుణ రవిని కూడా తీసుకు రావడానికి తయారయ్యే సరికి పట్టరాని కోపం వచ్చేది. "వీడెందుకు తోకలాగ, వీడు వద్దు" అనేవాడు , ఎలా అండీ, ఒక్కడ్నీ వదలడం అనేది మీ అన్నయ్య దగ్గిర వదిలేయ్ , అనేవాడు భాస్కరరావు. సుగుణ అలాగేనని అక్కడ వదిలేసరికి మారాం చేసి ఏడ్చి రాగాలు పెట్టె కొడుకుని వదిలి వెళ్ళడానికి మనసు వప్పేది కాదు సుగుణకి. తీసికేడితే ఇంక భాస్కరరావు మొహం ముడుచుకుని అసలు మాట్లాడెవాడు కాడు. తీసికెళ్ళకాపోతే కొడుకు ఏడుపు చూడలేక పోయేది సుగుణ. వదిలేసి వెళ్ళినా ప్రాణాలన్నీ వాడిమీదే వుండి ఆ సినిమాని కూడా చూడలేక, అతనితో మాట్లాడలేక అన్యమనస్కంగా వుండేది. అది చూసి మరింత మండిపడేవాడు భాస్కరరావు. అలాంటి అవస్థలో నలిగిపోవడం చాలాసార్లు అనుభవమయింది సుగుణకి. ఎక్కడికన్నా వెళ్ళడానికి బయలు దేరడం అంటే ప్రాణ సంకటంగా తయారయింది.
    ఏ పండుగ లప్పుడన్నా సుగుణకి బట్టలు తెచ్చేవాడు గాని, రవికి తన చేతుల్తో తను తెచ్చేవాడు కాడు. ఆ విషయం సుగుణ గుర్తు చేసినా నిననట్టు వూరుకునేవాడు. అంతగా మరీ చెప్తే "నాకు తెలియదు , నీవు వెళ్ళి కొనుక్కో" అనేవాడు.
    ఆఖరికి రవి తిండి విషయంలో కూడా భాస్కరరావు కనపరించే విభేదం చూస్తె సుగుణకి పట్టరాని కోపం కలిగేది. 'అన్ని పాలేందుకు? నా జీతంలో సగం వీడి పాలకే అయిపోతుంది" అనేవాడు భాస్కరరావు రవి పాలు తగుతున్నప్పుడల్లా , రెండేళ్ళ పిల్లాడు రోజుకి రెండు మూడు గ్లాసులు పాలు త్రాగడూ? అదే తన కడుపున పుట్టిన బిడ్డ అయితే అలా అనగలడా? అని నోచ్చుకునేది సుగుణ. వాడికి ఏమన్నా విటమిన్ మందులనీ యిస్తే "శుభ్రంగా తిని తిరుగుతున్నాడు. ఆ మందుల ఖర్చు కూడా ఎందుకు?" అని పైకే అనడం సుగుణ భరించలేక పోయేది.
    రోజులు గడుస్తున్న కొద్ది ప్రతి చిన్న విషయానికి రవిని గదమాయించడం ప్రతి చిన్న విషయానికి కూడా రాద్దాంతం చేసి రవిని కొట్టడం, వరకు వచ్చాక సుగుణకి యింట్లో నరకం ఆరంభమయింది. చిన్నపిల్లాడు ఏదన్నా పాడుచేయడం బద్దలు కొట్టడం, అల్లరి చేయడం సహజం? దానికోసం యింతలా పగ సాధిస్తున్నట్టు అంతలా ద్వేషిస్తారా అని సుగుణ మాటకి మాట జవాబీయడం ఆరంభించింది. "నీ కొడుకు నీకు ముద్దేమో కాని , ఆ వెధవ చేసే పనులు సహించడం నావల్ల కాదు " అని కోపంగా అరిచేవాడు సుగుణ ఏమనలేక రవిని ఎత్తుకుని కన్నీళ్లు పెట్టుకునేది.
    "ఛీ...ఛీ....వెధవయిల్లు ....నేరకపోయి తద్దినం తెచ్చుకున్నాను వెధవలు - వూరి వాళ్ళ పిల్లల్ని భరించడం నాకేం ఖర్మ" అనే వరకు వచ్చాడు భాస్కరరావు.
    తన సొమ్మంతా ఆ రెండేళ్ళ పిల్లాడు తిని పోతున్నంత దుగ్ధ ఏర్పడింది భాస్కరరావుకి. రేపొద్దున తనకి పిల్లలు పుడ్తారు. వాళ్లతో పాటు యీ రవిగాడిని ఎందుకు భరించాలి! వాడికి చదువు సంధ్యలు చెప్పించడం తనకేం అవసరం? అసలు ఇంకోడు కన్నపిల్లాడిని యింట్లో ఎందుకు పెట్టుకోవాలి. ఆ వెధవ మూలంగా తనకి ఏ  అనందం దక్కకుండా వుంది. ఆ వెధవ మూలంగా తామిద్దరికీ మనస్పర్ధలు ....కలతలు.....వస్తున్నాయి.....ఛా! ముందు ఇంతదూరం ఆలోచించకుండా తొందరపడ్డాననుకుని పశ్చాత్తాపం ఆరంభించింది భాస్కరరావుకు.
    ప్రతిరోజూ భార్యభర్తల యిద్దరి మధ్య రవి కారణంగా ఏదో తగవు తప్పడం లేదు! రోజురోజుకి యీ గొడవలు భరించడం యిద్దరికిద్దరికి కష్టమవసాగింది .
    ఆ కోపం , కసీ మరోవిధంగా తీర్చుకోడం కూడా సాగించడం మొదలు పెట్టాడు భాస్కరరావు.
    సుగుణ కాస్త ఉదాసీనంగా వుంటే "ఏం, పాత మొగుడు గుర్తువస్తున్నాడే మిటి?" అనేవాడు.
    భాస్కరరావు సరసం మరీ ఎక్కువయిన రోజున సుగుణ కాస్త కోపంగా "ఏమిటా మోటుతనం" అంటే "నీ పాతమొగుడు యింతకంటే నాజూగ్గా ప్రవర్తించేవాడా అని దేప్పేవాడు. "ఇంతకంటే బాగుండేదా నీ ఆ మొగుడి సరసం" అని అసహ్యంగా కూడా మాట్లాడడం ఆరంభించాడు. సుగుణ కళ్ళలో బాధ చూస్తె కసిదీరినట్లుండేది భాస్కరరవుకి.
    ప్రతి విషయానికి అవసరం వున్నా లేకపోయినా రోజుకి పదిసార్లు "పాతమొగుడు ' అంటూ  దేప్పుతుంటే ఎన్నో రోజులు సహించలేక ఓరోజు సుగుణ కాస్త తీక్షణంగా "నన్నెందుకిలా పదే పడే నాకు ఆ పాత సంగతులు గుర్తు చేసి బాధిస్తారు.... ఆరోజులు మరిచిపోకుండా ఎందుకిలా గుర్తుచేసి హింసిస్తున్నారు" అంది.
    "ఏం గుర్తు చేస్తే అంత బాధగా వుందేమిటి? పాపం ఆయనను ఇంకా మరిచిపోలేక పోతున్నావన్నమాట. ఏం నాకంటే బాగా చూసేవాడన్న మాట నిన్ను ...." అంటూ మరింత వ్యంగ్యంగా విసుర్లు విసిరేవాడు.
    రోజురోజుకీ భాస్కరరావులో చెలరేగేరాక్షసత్వంక్రూరత్వం పెచ్చు పెరుగుతుంటే సుగుణకు ఆ యింట్లో బ్రతకడం దుర్భారమవసాగింది. కాని ఏం చేస్తుంది/ కావాలని పెళ్ళాడి యిప్పుడెం చేయగలదు? రోజూ యిద్దరూ దేని గురించో వాదించుకోడం, దెబ్బలాడు కోడం, మాటలు విసురుకోడం, తిండి మానేయడం, భాస్కరరావు యిల్లు చేరకపోవడం మొదలైన ఘటనలు జరుగుతున్నా పెళ్ళి చేసుకున్నాం తప్పదు.....అని సుగుణ ఒపిగ్గానే ఆ నరకం భరిస్తుంది.
    కానీ సహనానికి ఓర్మికి దేనికన్నా హద్డుంటుంది! ఆ హద్దు సుగుణ విషయంలో ఆరోజు దాటిపోయింది.
    రవికి రెండు రోజుల నుంచి జ్వరం. ఆ రెండు రోజులు ఏదో మామూలు జ్వరం అన్నట్టు యేవో తెలిసిన మందులు వాడింది. అయినా తగ్గలేదు. మూడో రోజు భయపడుతూనే భాస్కరరావుతో చెప్పింది.
    "నన్నేం చెయ్యమంటావు' విసుగ్గా అడిగాడు. ఇదే తండ్రి అయితే ఏం చెయ్యమంటావు అని అడుగుతాడా అని బాధ కలిగింది సుగుణకి. అయినా అదేం కన్పించనీయకుండా "డాక్టరేవరినైనా తీసుకురండి" అంది.
    భాస్కరరావు చిరాగ్గా మొహం చిట్లించాడు. "నేను వెళ్ళలేను. నీవే వెళ్ళి పిలుచుకొ, లేకపోతే అక్కడికి తీసికెళ్ళి చూపించుకో" అన్నాడు.
    సుగుణకి వళ్ళు మండిపోయింది. "పిల్లాడు జ్వరంతో పడి వుంటే డాక్టరుని తీసుకురావడానికి కూడా మీకు అంత కష్టంగా వుందన్న మాట. ఆడదాన్ని నేను వెళ్ళి డాక్టరుని పిలుచు కావాలన్న మాట....ఇదే మీ పిల్లాడయితే ఇలా అనే వారా? వాడు మీ కొడుకు కాదని కదూ ఇంత నిర్లక్ష్యం , ఇంత అసహ్యం వాడి మీద!" తీక్షణంగా అంది. భాస్కరరావు ఏం బెదరలేదు ఆ కోపానికి.
    "అవును....వాడు నాకేం అవుతాడని నాకుంటుంది ఆదుర్దా.....నా కొడుకు అయితే ఎందుకూరుకుంటాను. ఇదేదో క్రొత్త సంగతి కనిపెట్టినట్టు మాట్లాడకు" అన్నాడు హేళనగా.
    సుగుణకి వుడుకుమోత్తానంతో పాటు దుఃఖం కూడా వచ్చింది. "పిల్లాడు రోగంతో పడుకుంటే ఎలా మాట్లాడుతున్నాడు? మీకు పిల్లలుండి వుంటే, వీడే మీ పిల్లాడయితే నేను ఇలా ప్రవర్తించి వుంటే మీకెలా వుండేది....' ఉక్రోషంగా అంది. భాస్కరరావు హేళనగా నవ్వాడు.
    "ఎలా వుండడానికి ఏముంది? నాకే పిల్లలు వుంటే, సవతి తల్లి ఆ పిల్లలని ఎలా చూసేదో వందలు, వేలు కధలు విన్నాం....వాళ్ళలో నీవూ ఒకరి క్రింద జమ అయివుండే దానివి.....లేకపోతే ఇంకోరి పిల్లల్ని, ఏ ఆడది గాని, మగాడు కాని స్వంత పిల్లల్లా చూస్తారా ఏమిటి?"

 Previous Page Next Page