Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 30


    అటూ ఇటూ చూసి సీరియస్ గా గొంతుపెట్టి చెప్పటం మొదలుపెట్టిందామె. "నువ్విలాంటి వాడివనుకోలేదు. నేనా అభాగ్యురాలిని. నన్ను యింత అందగత్తెగా పుట్టించడం ఆ దేవుడి తప్పు. భర్త పోయాడు. మీ పంచన చేరాను. నువ్వు నా నిస్సహాయస్థితిని ఆసరాగా తీసుకుని...." అని గొంతు రుద్దమైపోగా ఆగి, కళ్ళు తుడుచుకుందామె. "ఎందుకు ఆకలిగా చూస్తావు నా వేపు? ఎందుకు నన్ను పూసుకు పూసుకు తిరుగుతావ్? ఎందుకు చేతులు తాకించాలని అలా తాపత్రయపడతావ్? తప్పు అఖిల్! ఇది నీకు తగదు" అంది పమిట భుజం చుట్టూ లాక్కుని దూరంగా జరుగుతూ.

    కొయ్యబారిపోయాడు తను. తనా? తను చేశాడా అలాగ! ఆమే ఇవన్నీ చేస్తూ నేరం తన మీద రుద్దుతోంది.

    క్రమంగా అర్ధమయ్యింది తనకి. నిజానికి ఆమె ప్రవర్తన మంచిదే! పూర్తిగా తప్పుదోవలో పోవడం ఆమెకి యిష్టం కాదు. తనపట్ల ఆకర్షణ కలిగింది. కానీ తను లొంగలేదు. ఈలోగా ఆమే కూడా తన తప్పు గ్రహించి వుంటుంది.

    ఇప్పుడు ఆమే బలహీనతని తన బలహీనతగా చూపించడానికి బలమైన ప్రయత్నం చేస్తోంది.

    కొందరు ఆడాళ్ళకి కొంతమంది మొగాళ్ళు అవసరాలకి పనికి వస్తారు. ఇంకొందరు ఆడవాళ్ళకి ఇంకొంతమంది మొగాళ్ళు ఆడుకోవడానికి పనికివస్తారు.

    తను అతి మంచితనానికి పోబోయి రెండో రకంలో చేరిపోయాడు.

    మొదట్లో ఫిజికల్ సుఖాన్ని కోరుతుంది ఆమె. అది కుదరకపోయేసరికి కేవలం ఊహా మాత్రపు తృప్తి కోసం తన చుట్టూ తాను కాల్పనిక సన్నివేశాలు కొన్ని ఊహించుకుని, ఒక బుడగని తయారు చేసుకుంది. ఆ కల్పనలో తను అంటే ఈ అఖిల్ ఒక అందమైన విలన్. విలన్ అయిన తను కోరిక తీర్చమని ఆమెని పీడిస్తున్నాడు. ఆమె తనని నిరాకరించి, విజయవంతంగా తన శీలాన్ని రక్షించుకోగలిగింది. ఇదీ ఆమె నమ్మడానికి ప్రయత్నిస్తూ తనని నమ్మించడానికి చూస్తున్న భ్రమ.

    ఒక్కసారి శారీరక సుఖం కంటే కూడా ఇలాంటి కాల్పనికమైన ఆలోచనలే ఎక్కువ ఆనందాన్ని యిస్తాయేమో.

    తన మంచితనానికి మరో ఎదురుదెబ్బ తగిలిందీ ఆ రోజు. ఆమె మీద కొద్దిగా కోపం వచ్చింది తనకి. కోపంతోబాటు అపరిమితమైన జాలి కూడా కలిగింది.

    ఈ విధివంచిత, తన మానసిక తృప్తి కోసం ఒక ఫాంటసీ బుడగని సృష్టించుకుంది.

    ఆ ఫాంటసీలో ఆమెకి ఆనందం దొరకవచ్చు. ఆమెకి అదో న్యూరోసిన్ అయి వుండవచ్చు. ఫ్రాయిడ్ దీనికీ ఏదో ఒక ఎక్స్ ప్లనేషన్ చెబుతాడు.

    ఆమె సృష్టించుకున్న ఆ బుడగని తను నిర్ధాక్షిణ్యంగా పేల్చేసి ఆమెని హతాశురాలిని చెయ్యడానికి క్షణంలో సగంసేపు పట్టదు.

    కానీ చేసి తను సాధించేది ఏమిటి?

    ఈ అదృష్టహీనురాలు ఆడుకుంటున్న నాటకంలో తనకు అప్పగించిన విలన్ పాత్రని తను ఉత్తుత్తిగా నటించేస్తే పోలా?

    అందుకని అన్నాడు తను__

    "ఐయామ్ సోసారీ సుభద్రా! నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగి వుంటే క్షమించు" తను అస్పష్టంగా చెప్పిన ఆ క్షమాపణలో, తను తప్పు చేసినట్లు ఎక్కడా ఒప్పుకోలేదు. ఊరికే జనరల్ టరమ్స్ లో చెప్పాడు అపాలజీ.

    కానీ ఇంక ఆ క్షణం నుంచి మానభంగం కేసులో ముద్దాయిచేత నేరం ఒప్పించగలిగిన పోలీసులా ప్రవర్తించడం మొదలెట్టింది సుభద్ర.

    మరోసారి పమిటని విసురుగా భుజం చుట్టూ లాక్కుని, తనని హీనంగా ఆపాదమస్తకం ఓసారి చూసి విసవిసా నడుస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత, ఆమె పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పెట్టి సర్దుకోవడం వినబడింది తనకి.

    ఏమైందని అందరూ సుభద్రని అడుగుతున్నారు. ఆమె ఏం చెబుతుందో అన్న భయంతో తనకి గుండె గొంతుకి అడ్డం పడ్డట్లు అయ్యింది.  

    రుద్ధమైన కంఠంతో సుభద్ర చెబుతోంది. వాళ్ళ ఊరికి వెళ్ళిపోతానని.

    ఎందుకని అడుగుతున్నారు ఎవరో! అతికీ అతకని సమాధానాలు ఏవో చెప్పింది సుభద్ర. మొత్తం మీద "ఇక్కడేదో జరిగిందనీ, అందుకే తను వుండలేక వెళ్ళిపోతున్నాననే" భావం అందరిలో కలిగించింది ఆమె.

    మరి కాసేపటిలో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది సుభద్ర.

    ఆ తర్వాత చాలా రోజులకి తెలిసింది తనకి అసలు విషయం.

    సుభద్రకి ఎక్కడో ఉద్యోగం దొరికిందిట. ఆమె వెళ్ళిపోయే ముందు ఆ అఖిల్ అనే వాడిని ఒక కామపిశాచిగా తనని తాను అపాయములో వున్న అబలగా చిత్రీకరించుకుని, తన చేతే తెలివిగా ఆ కల్పనకి నిజం అనే ముసుగు వేయించి, అదో రకమైన తృప్తితో వెళ్ళిపోయింది.

    సైకో! అదే ఆమె మనస్తత్వానికి సరైన విశ్లేషణ. న్యూరోసిస్ పేషెంటు.

    అనేకమంది ఆడవాళ్ళు మొగాళ్ళని నమ్మేసి ఘోరంగా మోసపోయినట్లే కొంతమంది ఆడవాళ్ళు కూడా తమని నమ్మేసిన మొగాళ్ళని కౄరముగా ముంచెయ్యగలరు.

    ఆ తర్వాత సుభద్ర తన "వెకిలి చేష్టల"ను గురించి బంధువులందరికీ చాటింపు వేసినట్లుంది. బంధువుల్లో ఆడవాళ్ళంతా తనని ఒక "ఉమనైజర్ ని" చూసినట్లు చూడడం మొదలెట్టారు. ఉర్దూలో ఒక సామెత వుంది.

    "ఖాయానై, పియానై గ్లాస్ ఫోడా, బారానే!" అని.

    హైదరాబాద్ ఇరానీ హోటళ్ళలో తిన్నాక బిల్లు రాసివ్వరు. కౌంటర్ దగ్గరికి వెళితే వెనుకనుంచి వెయిటర్ అరిచి చెబుతాడు కస్టమర్ ఏం తిన్నాడో, ఎంతయిందో. "దో సమోసా, చాయ్.... తీన్ రూపాయ్" అట్లా. ఒక కస్టమర్ కౌంటర్ దగ్గరికి వెళితే వెనుకనుంచి సర్వర్ అరిచాడు. "ఏం తిన్లేదూ.... ఏం తాగలేదూ.... గ్లాసు పగలగొట్టాడూ.... ముప్పావలా వసూల్ చెయ్" అని. అట్లా అయ్యింది తన పరిస్థితి. తను చేసిన తప్పూలేదు, తను అనుభవించిన సుఖమూ లేదు.... చెడ్డ పేరు మాత్రం సవాసేరు.

    కానీ ఈ ఇన్సిడెంటుకి అనుకోని ఇంకో సైడ్ ఎఫెక్టు కూడా వచ్చింది. అప్పటినుంచి చాలామంది ఆడవాళ్ళు తనని చూసి బెదిరిపోవడం మొదలెడితే చిత్రంగా యింకొందరు ఆడవాళ్ళు మాత్రం ఈ (అప) కీర్తి వినే తనపట్ల గ్లామరు పెంచుకున్నారు.

    అయితే తను ఎవరినీ కేర్ చెయ్యలేదు. ఇంకొన్నాళ్ళకి_

    సుభద్ర ఎవరితోనో కలిసి తిరగడం గురించిన వార్తలు వచ్చాయి. అప్పుడనిపించింది మళ్ళీ తనకి. అవసరాలకి కొందరు. ఆడుకోవడానికి కొందరు. తను రెండో రకం! అంతే. అప్పటినుంచి యింక ఆడవాళ్ళకి ఆమడదూరంలో వుంటున్నాడు తను.

    ఇప్పుడు.... ఈవిడ.... ఈ సుధారాణి కూడా అదే టెక్నిక్ తన మీద ప్రయోగిస్తే కష్టం.

    ఆ ఆలోచన రాగానే బిగుసుకుపోయి సుధ చిరునవ్వు చేత తాత్కాలికంగా ఆకర్షింపబడినందుకు తనని తాను తిట్టుకుని, ఇంక పొరబాటున కూడా సుధవైపు చూడకుండా, ఇంకోవైపుకి చూస్తూ కూర్చున్నాడు అఖిల్.

    అంతలోనే రైలు ఏదో స్టేషన్ లో ఆగింది. ముగ్గురు మనుషులు జబర్దస్తీగా ఆ కంపార్టుమెంటులోకి ఎక్కేశారు. చూడ్డానికే గూండాల్లాగా ఉన్నారు ఆ ముగ్గురూ. వాళ్ళలో యిద్దరు అన్నదమ్ములైనట్లు పోలికలు కనబడుతున్నాయి. మూడో మనిషి చేతిలో, ఒంటినిండా పొడలు వున్న కొండచిలువ పిల్లలాంటి స్టెన్ గన్ వుంది.

    వాళ్ళు ముగ్గురూ రాష్ గా వీళ్ళు కూర్చున్న వైపు రావడం మొదలెట్టారు.


                                                    *    *    *    *


    హైదరాబాద్ తెలిఫోన్స్ డిపార్టుమెంట్ లో పనిచేసే అమోఘన్ అటూ ఇటూ చూసి, తననెవరూ గమనించడంలేదని నిశ్చయించుకుని, కొన్ని టెలిఫోన్ కాల్స్ చెయ్యడం మొదలెట్టాడు.

    నిజానికి ఎవరైనా ఆ సమయంలో అతన్ని గమనించినా కూడా అతనికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వినేవాళ్ళకి అతను ఫోన్లో మాట్లాడుతున్నదంతా సినిమాల గురించిన సరదా సమాచారంలాగే అనిపిస్తుంది.

    కానీ అతను సినిమా సమాచారంలోనే కోడ్ ద్వారా అత్యంత రహస్యమైన సమాచారం అవతలి వాళ్ళకి అందజేస్తున్నాడన్న విషయం అతని కొలీగ్స్ కనిపెట్టలేదు.

    ఆ సమాచారం తమిళ పులులకి సంబంధించినది.

    అంటే 'ఎల్.టి.టి.ఇ.' సంస్థకి సంబంధించినది.

    ఎల్.టి.టి.ఇ. ఒక తీవ్రవాద సంస్థ.

    రౌడీరాజ్యం గురించి రాస్తున్నప్పుడు తీవ్రవాద సంస్థలను గురించి చెప్పకపోతే అసంపూర్ణమే అవుతుంది.

    ఎందుకంటే, ప్రపంచంలో అనేకానేకమైన తీవ్రవాద ఉద్యమాలు మొదట్లో మంచి ఆదర్శాలతోనే ప్రారంభం అయినా, అతి త్వరలోనే అవి నాయకుల అదుపు తప్పి, అడ్వెంచరిస్టు శక్తుల చేతుల్లోకి వెళ్లిపోవడం, క్రమంగా అవి తమ ఆశయాలని పక్కకి నెట్టేసి రౌడీ మూకల స్థాయికి దిగజారిపోతూ వుండడమూ అందరికీ తెలిసిందే. ఒక ఉద్యమం ఈ స్థాయికి (ఎ)దిగి పోయాక, ఇంక దాన్ని నడపడానికి కావలసిన డబ్బు కోసం ఆ సంస్థలు మామూలు రౌడీగ్యాంగులు చేసే తప్పుడు 'పనులన్నీ చెయ్యక తప్పదు. బెదిరించి డబ్బులు గుంజడం, స్మగ్లింగ్, మాదకద్రవ్యాల వ్యాపారం, హవాలా వ్యాపారం....ఇవన్నీ చెయ్యడానికి అలవాటు పడుతుంది సంస్థ.  

    ఎల్.టి.టి.ఇ. సంస్థ సంగతే తీసుకుంటే నెంబర్ వన్ డాన్ అయిన దావూద్ ఇబ్రహీం గ్యాంగు చేసే సంఘ వ్యతిరేక కార్యక్రమాలన్నీ ఈ సంస్థ కూడా చేస్తోంది.

    అసలు ఈ ఎల్.టి.టి.ఇ. సంస్థ ఎందుకు స్థాపించబడిందీ?

    క్లుప్తంగా చెప్పుకోవాలంటే_

    మన పొరుగు దేశాలయిన నేపాల్, భూటాన్ తదితర దేశాలలాగే శ్రీలంకకి కూడా ప్రాచీనకాలం నుంచీ భారతదేశంతో అన్ని విధాలా సాన్నిహిత్యం వుంది. రావణుడి రాజ్యమే శ్రీలంక అని నమ్మేవాళ్ళు అధిక సంఖ్యలో వున్నారు. కాదని వాదించేవాళ్లు కూడా లేకపోలేదు.

 Previous Page Next Page