Previous Page Next Page 
శరతల్పం పేజి 29

 

                                     15

    హరికధ అర్ధంతరంగా ముగియడంతో గురవయ్య కేదో వెలితిగా , వెలితిగా ఉంది. సాయంకాలం ఇంటికి వచ్చి స్నానం చేసి, భోజనం చేసి పడుకుంటే పిచ్చి పిచ్చిగా ఉంది. లేచి నారాయణస్వామి ఇంటికి వచ్చాడు గురవయ్య. బల్లపీట మీద మోకాళ్ళకు కండువా చుట్టుకొని కూర్చొని ఉన్నారు స్వామి. నాంచారమ్మ లాంతరు తెచ్చి బల్లపీట మీద పెట్టి, గురవయ్యను చూచి "కధ లేదు గద!" అని లోనికి వెళ్ళిపోయింది.
    కళ్ళకు చుట్టుకున్న కండువా తీసి "రా గురవయ్య రా" అని సరిగా కూర్చున్నారు నారాయణస్వామి.
    గురవయ్య దండం పెట్టి కింద కూర్చొని "అన్నగారూ! కధ అయిపోయిన కాన్నుంచి ఎట్లనో ఉన్నదుండి. ఆటేన్క కధ ఎమాయేనో అయన చెప్పకపాయె మీరు చెప్పకపోతిరి. రాములోరి కష్టాలున్న కాడికి చెప్పి లేచిపోయే అరిదాసు. సుకపడ్డ సంగతి ఏమన్న ఇనాల్న లేదా?"
    గురవయ్య ఆతురత గ్రహించారు స్వామి.
    "రామ కధ అటువంటిది గురవయ్యా! ఎంత విన్నా వినాలనిపిస్తుంది. తరువాత కధ ఏమంత లేదు. కాని కాస్త శాంతి లేకుండ చెప్పటము బాగుండదు వినడం బాగుండదు."
    "వసూలు చేసిందంత ఏసుకుని పారిపాయె అయ్యోరాయన! మల్ల ఎవరు చేస్తరుండి ? మనం చేసుకుంటే తప్పయితదా?"
    అంతవరకు ఆ ఆలోచన రాలేదు స్వామికి. గురవయ్య సలహా సమంజసం అనిపించింది - రామాయణం అసంపూర్ణంగా ఉండిపోవడం మంచిది కాదనుకున్నారు.
    "మంచిది గురవయ్య అట్లనే చేద్దాం. రేపు మా ఇంట్లో పట్టాభిషేకం చేస్తం. ఇక్కడికే రాండి మీరిద్దరూ?"
    "అట్లనే నుండి కట్టెలు గిట్టలు కొట్టేదిదుంటే చెప్పండి కోడ్త. పొద్దున్నే పిచ్చోస్తది ఏమన్న పనుంటే చెప్పండి. రేపు కూలికి గిట్ట పోను. ఈడనే పడుంట."
    "సరే అట్లనే కానియ్యి."
    తెల్లవారి నారాయణ స్వామి ఇంట్లో పట్టాభిషేకం జరిగింది. తీర్ధ ప్రసాదాలు హారతి తీసుకున్న గురవయ్య, ఆనందానికి అంతులేక పోయింది. నారాయణస్వామి తరువాతి రామాయణ కధ చెప్పేవరకు సాయకాలం అయింది.
    "దశవర్ష సహాస్రాణి దశ వర్ష శతానిచ
    భ్రాత్రుభిస్సహితం శ్రీమన్రమో రాజ్య మకారయత్ " అని ముగిచారు.
    అప్పుడు భోజనా లయినాయి. పిచ్చమ్మ, గురవయ్య నారాయణస్వామి ఇంట్లోనే భోజనాలు చేశారు.
    కధ అయిపొయింది. మళ్ళీ మాములు స్థితి ఏర్పడ్డది గురవయ్యకు. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. ఏదో వేదుకున్నట్టుంటున్నది. అతడు ఒకనాటి సాయంకాలం నారాయణస్వామి ఇంటికి వెళ్ళి "మల్ల ఎదన్న మొదలు పెట్టుండి , పిచ్చి, పిచ్చి గున్నది" అన్నాడు.
    "గురవయ్యా! భాగవతం చెప్పుతున్న. ఇప్పుడు నాంచారు వింటున్నది నువ్వు కూడా రా."
    "ఎప్పుడు రమ్మంటారు?"
    "పొద్దు కుంకేయాళ రా."
    "కూలి నుంచి అప్పుడే వస్త కాదుండి."
    గురవయ్య ఇబ్బంది గ్రహించారు స్వామి. "అట్లయితే ఒక పని చెయ్యి. అన్నంగిన్నం తిని కధ వినటానికి పోయేటట్లు రా. అప్పుడే చెప్పుత నేను కూడ- ఎప్పుడయితే ఏం?"
    "అట్లనే వస్త అన్నగారూ" అని వెళ్ళిపోయాడు గురవయ్య.
    భాగవత కధాశ్రవణం ప్రారంభం అయింది. గురవయ్య క్రమం తప్పకుండా నారాయణస్వామి ఇంటికి వస్తున్నాడు. పందిరి గుంజకు అనుకోని కూర్చొని వింటున్నాడు. అతనికి భాగవతం బాగా నచ్చింది. స్వామి వివరణ అరటిపండు వలచి ఇచ్చినట్లు ఉంటుంది. రోజు రోజుకు మరింత అర్ధం అవుతుంది. వినడంలో ఏదో అనందం ఉంది గురవయ్యకు. ఒక్కోసారి జటిలమైన విషయాలు వచ్చినప్పుడు నిశితములైన ప్రశ్నలు అడుగుతున్నాడు. వివరించి చెప్పడంలో నారాయణస్వామికి మహదానందంగా ఉంది.
    చకోరం వెన్నెల కోసం వలె , సాయంకాలం కావడం కోసం ఎదిరి చూస్తూన్నాడు గురవయ్య. గురవయ్యకు మరో ఆసక్తి లేదు - భాగవతం వినా, అతడు కూలికి పోతున్నాడు. మిగతా నిత్యకృత్యాలు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. అయినా అతడు అచ్చం భాగవతం వింటున్నట్లే ఉన్నాడు. ప్రతిచోట భాగవతాన్ని గురించే మాట్లాడుతున్నాడు. అతని జీవితం భాగవతంమయం అయిపొయింది.
    భాగవతంలో లీనం అయిపోయాడు గురవయ్య.
    తులసి మాల- తెల్లని బట్టలు - ఊర్ధ్వపుండ్రాలు మునిలా కనిపించాడు గురవయ్య.
    గురవయ్య ముఖం గంభీరంగా ఉంది. అతని ముఖంలో వర్చస్సుంది - అతని కళ్ళలో భక్తీ ఉంది- అతడు నిరాసక్తుడయినాడు.
    అతనికి ఊళ్ళో ఆదరం పెరిగింది - అతడు పట్టించుకోలేదు.
    అతనికి గ్రామంలో పలుకుబడి హెచ్చింది - అతడు లెక్క చేయలేదు. అతణ్ణి గూడేనికి పెద్దను చేశారు - అతను గమనించలేదు.
    నిరంతర భావగత కధా శ్రవణంలో నిమగ్నమైనాడు గురవయ్య. అతని జీవితంలో అది అత్యంత మహత్తర కాలం! అది ఎందరికి వస్తుంది! అందరికీ రానిది గురవయ్యకు వచ్చింది! అందును గురించి సైతం ఆలోచించలేదు గురవయ్య.
    గురవయ్యకు శీతోష్ణ సుఖ దుఖాలతో నిమిత్తం లేకుండా పోయింది.
    గురవయ్య యోగిగా పరిణితి చెందుతున్నాడు!
    గురవయ్య కూలికి పోవడం మానుకున్నాడు. రాత్రింబవళ్ళు నారాయణస్వామి ఇంట్లోనే గడుపుతున్నాడు. కధా శ్రవణం - చర్చ- దీంతోనే గడిచి పోతుంది కాలం. ఎప్పుడో గాని ఇంటికి వెళ్ళడం లేదు.
    పిచ్చమ్మకు అంతా అయోమయంగా ఉంది. ఆమెకు ఏమీ అర్ధం కావడం లేదు. ఆమెకు అర్ధం అయిందల్లా గురవయ్య తనకు దూరం అవుతున్నాడు! ఆమెకు వ్యధ పెరిగింది. బాధ గుండెలో గూడు కట్టుకుంది. ఆమె మీద ఒకేసారి పదేళ్ళు పడ్డట్టు అనిపించింది. నొసట మీది వెంట్రుకలు తెల్లబడ్డాయి. ముఖం ముడుతలు పడ్డది, కళ్ళు లోతుకు లాక్కుపోయాయి. ఆమె కూలి నాలికి పోతుంది. ఉడకేసుకు తినడం - తడ కేసుకు పండటం లా ఉంది ఆమె స్థితి.
    గురవయ్యను ఎప్పుడో గాని ఇంటికి రాడు.
    అతడు మాట్లాడింది ఆమెకు తెలియదు.
    దగ్గర్లో ఉన్నా ఆమడ దూరం ఉన్నట్లు అనిపిస్తుంది ఆమెకు. అయినా ఏం చేయగలదు పిచ్చమ్మ? మౌనంగా భరిస్తుంది - గురవయ్య భార్యగా.
    ఒకనాడు స్వామి ధ్రువ చరిత్ర చెపుతున్నాడు. పసిబాలుడు తపస్సుకు పోవడం - నారదుని ఉపదేశం - ద్రువుని తపస్సు - నారాయణుడు ప్రత్యక్షం కావడం కళ్ళముందు జరిగినట్లుగా వివరిస్తున్నారు స్వామి. కధలో లీనం అయి వింటున్నాడు గురవయ్య.
    గురవయ్యకు ఒక దగ్గు తెర వచ్చింది. ఊపిరి సల్పుకోకుండా కొనసాగింది. గిజగిజ లాడాడు గురవయ్య. దగ్గు ఆగిపొయిం తరువాత ఊస్తే తెమడలో రక్తం కనిపించింది. స్వామి గుండె లిప్త ఆగింది. గురువయ్య దాన్ని గురించి పట్టించుకోలేదు.
    కధ సాగిపోయింది. కాని గురవయ్య స్థితి దిగజారి పోయింది. నిరంతరం దగ్గు - సాయంకాలాల్లో జ్వరం. అయినా అతడు కధ వినటం మానలేదు.
    రోజు రోజుకూ క్షీణిస్తూన్నాడు గురవయ్య.
    అది క్షయ అని కనిపెట్టారు స్వామి. తమకు తెలిసినంతలో వైద్యం చేశారు ---- భాగవతంలోనే బాగుపడ్తా డనుకున్నారు!

 Previous Page Next Page