Previous Page Next Page 
శరతల్పం పేజి 28

 

    "తప్పు గురవయ్యా! అట్లనకూడదు. అన్నదమ్ములు కొట్టుకొని చస్తుంటే ప్రభువులు ఊరుకుంటారా! ధర్మ రక్షణ ప్రభువుల కర్తవ్యం . రాముడు లీలామానుష విగ్రహుడు - సాక్షాత్ శ్రీమన్నారాయణుడు . అయన కాక మరెవరు రక్షించగలరు ధర్మమును?"
    "సరేనుండి తమ్ముని పెండ్లాన్ని గుంజుకున్నడని వాలిని చంపిండను కుందం - మల్ల సుగ్రీవుడు అన్న పెండ్లాన్ని కాజేసిండు కాదుండి - సుగ్రీవుడ్ని ఎందుకు చంపడాయే!"
    ప్రశ్నలో అనేక చిక్కులున్నాయని గ్రహించారు నారాయణస్వామి.
    "సూక్ష్మగతిర్హి ధర్మస్య దుర్ జ్జేయా కృతాత్మభి, ధర్మము అతి సూక్షమైంది. సంస్కారము లేనివారు దానిని గ్రహించలేరు" అని చెప్పి సంపూర్ణ చర్చకే ఉపక్రమించారు నారాయణస్వామి.
    గురవయ్య ప్రశ్నల్లో అమాయకత కనిపించింది స్వామికి. అయినా ఆగ్రహం తెచ్చుకోలేదు. ఓపికగా ధర్మ సూక్ష్మం వివరించసాగారు. వారి వివరణను గూర్చి ప్రశ్నలడిగాడు గురవయ్య.
    ప్రశ్నలు , సమాధానాలు , వివరణలతో తెల్లవారింది.
    ఉభయుల్లో ఎవరూ విసుక్కోలేదు.
    "అయ్యగారూ! మీరెంత చదువుకున్నరుండీ? ఇన్నాళ్ళ నుంచి మీ దాసుణ్ణయి ఇది తెల్సుకోలేక పోయాను. ఎంతకాలం పాడు చేసున్నుండి. ఇప్పుడు ఎకైందుండి, రాముని కంటే మీ గొప్పదనం ఎక్కువని."
    "గురవయ్యా! అపచారం, అపచారం చెంపలేసుకో. అట్లన కూడదు - రాముడు జగత్పిత -అ పరాత్పరుడు , లీలామానుష విగ్రహుడు - వాడు అడమన్నట్లు ఆడే వాణ్ణి నేను. వాణ్ణి కించ పరచకూడదు."
    "మీరు లేకుంటే నాకు రాము డేట్ల తెలుసునుండీ."
    "గురవయ్యా! " ఆ పిలుపులో ఆర్ద్రత ఉంది. "నువ్వు చాలా ఎదిగినవయ్యా!" నారాయణస్వామి కన్నీటి చుక్క నేలమీద రాలింది.
    "ఆయ్యగారూ! " అని కాళ్ళు పట్టుకొని కాళ్ళ మీద తలపెట్టి కన్నీటితో కడిగాడు గురవయ్య.
    గురవయ్యతో ఆత్మీయత హద్దులు దాటి పొంగింది. అది అయ్యవారి అంతస్తును కూల్చేసింది. ఆలోచించలేదు గురావయ్య - అమాంతంగా కాళ్ళు పట్టుకున్నాడు. స్వామివారి బాష్పబిందు గురవయ్య తలమీద రాలింది.
    స్వామి ఆనందంలో తన్మయులైనారు. తన్మయంలో అన్ని హద్దులు చెరిగిపోయాయి. గురవయ్య కాళ్ళ మీద పడితే జరగలేదు. అది రెండు ఆత్మల సమ్మేళనం.
    ఇద్దరూ తన్మయులైనారు - లోకాన్ని మరచారు.
    తూర్పున అరుణోదయం అయింది.
    "గురవయ్యా! లే" ముందు లోకాన్ని గమనించింది నారాయణస్వామి. రెండు చేతుల్తో గురవయ్య భుజాలు పట్టుకొని లేవదీశారు . చేతులు చాచి కౌగలించుకున్నారు. "గురవయ్యా! నువ్వు పవిత్రుడివి. ఇకనుండి నువ్వు నాకు తమ్మునివి." అన్నారు.
    "అన్నగారూ!" అని విడిపించుకొని దూరంగా నుంచున్నాడు గురవయ్య.


                                      14

    రామానుజాచార్యులు ఊళ్ళో తన ప్రాభవాన్ని పెంచేశాడు. అందరికీ విముక్తి ద్వారాలు తెరిచేశాడు. రామనామ స్మరణ ప్రారంభింపజేశాడు. రామకోటి రాయించాడు. భజనలు సాగించాడు. భజనకు అడా మగా తండోపతండాలుగా రాసాగారు. అయ్యవారు తన్మయులై చిరతలతో భజన చేస్తుంటే శిష్యురాండ్రు ఊగిపోతున్నారు.
    ఎంకమ్మ వారికి ప్రధాన శిష్యురాలయింది. ఆమె హరిదాసును వదలడం లేదు. హరిదాసు ఆమెను వదలడం లేదు. హరి భజనలో హరిదాసు పక్కనే  ఉంటుంది ఎంకమ్మ.
    ఊరంతా భజన వాతావరణం వ్యాపింప జేశాడు హరిదాసు.
    హరిదాసు తనకు జోతిష్యం వచ్చాన్నాడు. చేతులు చాచి చెప్పసాగాడు. జరిగింది జరిగినట్లు చెప్పాడన్నారు కొందరు - అందు కాయన కొందర్ని కట్టుకున్నాడు ఎంకమ్మ ద్వారా. చుట్టూ పక్కల ఊళ్ళ నుంచి కూడా జనం రాసాగారు.
    హరిదాసు తనకు మంత్రం శాస్త్రం వచ్చు నన్నాడు. ఆ మాట విని రామక్రిష్టయ్య గతుక్కుమన్నాడు. రామక్రిష్టయ్య ముందే వేపమండలు తెప్పించాడు. మంత్రాలు మహా జోరుగా చదివాడు. నుంచున్న రోకలిని మంత్రాలతో బెత్తెడు లేవనెత్తాడు. ఇంకేముందు రామక్రిష్టయ్య గుండె గుటుక్కుమంది. హరిదాసు కాళ్ళ మీద పడి తనను రక్షించమన్నాడు. హరిదాసు అభయమిచ్చాడు. ఎంకమ్మ అత్తవారి తరపువాళ్ళు ఇంకొందరు మిగిలారు. రామక్రిష్టయ్య హరించిన ఆస్తిని కాజేయడానికి అదనుకు చూస్తున్నారు. వారిని అంతమొందించాలన్నాడు రామక్రిష్టయ్య. ముహూర్తం చూచి చేతబడి చేస్తే ఎక్కడి వాళ్ళక్కడే రక్తం కక్కుకు చస్తారన్నాడు హరిదాసు. రామక్రిష్టయ్య గురి కుదిరింది.
    దొడ్డి ద్వారం తెరిపించి సగం ఇల్లు హరిదాసుకు అప్పగించాడు. హరిదాసు ఇష్టారాజ్యం సాగించాడు అందులో. ఎప్పుడూ జనం తండోపతండాలుగా వస్తుండేవారు. అర్చనలు- ఆరాధనలు- మందులు - మంత్రాలు విరామం ఉండేది కాదు.
    హరిదాసుకు గురవయ్యతో పని తీరింది. నారాయణస్వామిఇంటి వైపు పోవడం లేదు. సకల సౌకర్యాలు రామక్రిష్టయ్య ఇంట్లోనే సమకూరుతున్నాయి. సారాయి అక్కడికే వస్తుంది. పట్టపగలే సేవిస్తున్నాడు హరిదాసు - ఎంకమ్మ కూడా కొద్దికొద్దిగా అలవాటుపడింది. అన్నీ తెలుస్తున్నాయి రామక్రిష్టయ్యకు- అయినా నోరు మెదపడం లేదు. పైగా హరిదాసుకు సాగిలపడి మొక్కుతున్నాడు.
    హరికధ రాత్రిళ్ళు మాములుగా సాగుతూనే ఉంది. సీతాకల్యాణం పేర వసూళ్ళు సాగించాడు హరిదాసు. కళ్యాణం అట్టహసంగానే చేశాడు. ఊరంతా సంతర్పణ ఏర్పరచాడు. పానకం, వడపప్పు పంచి పెట్టించాడు. పట్టాభిషేకానికి పట్టీలు తయారుచేయడం ప్రారంభించాడు.
    హరిదాసుకు పల్లకీ ఎక్కించి ఊరేగించారు ఊళ్ళో వాళ్ళు - పల్లకిలో ఎంకమ్మ ఉంటే బాగుండుననుకున్నాడు హరిదాసు!
    రామక్రిష్టయ్య హరిదాసుకు తన విన్నపం గుర్తు చేశాడు. చాలాసార్లు- రహస్యంగా - అతి వినయంగా - లంకాదహనం తరవాత చూస్తామన్నారు.
    ఎంకమ్మకు బాగా వెర్రి ఎక్కించాడు హరిదాసు. హరిదాసు లేకుంటే తానూ  చచ్చిపోతాననే దశకు తెచ్చాడు.
    హరికధ సాగుతూనే ఉంది.
    శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం వచ్చింది. హనుమంతుడు సంది గ్రామం వచ్చేదాకా చెప్పి, పట్టాభిషేకం ఉత్సవం జరిపి చెప్పుతానని ముగించాడు హరిదాసు.
    నాలుగు రోజుల తరవాత పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయం అయింది. కనకవర్షం కురిసింది. హరిదాసు మీద, చుట్టూ పట్ల ఊళ్ళ నుంచి బళ్ళు కట్టుకొని వచ్చి విరాళాలు యిచ్చి పోతున్నారు. రామక్రిష్టయ్య ఇల్లు పెళ్ళిల్లులా ఉంది.
    రామక్రిష్టయ్య తాను అడిగిందాన్ని గురించి విన్న విన్నవించుకున్నాడు. పట్టాభిషేకం తరవాత అని దాటవేశాడు హరిదాసు.
    పట్టాభిషేకం మరి రెండు రోజులుంది.
    రామక్రిష్టయ్య తెల్లవారుజామున లేచి చూస్తే తలుపులన్నీ బార్లా తీసే ఉన్నాయి. గుండె గుబిక్కుమంది. గదిలోకి ఉరికాడు. ఇనప్పెట్టె ఖాళీగా తెరచి ఉంది.
    "కొంప మునిగిందే" అని కేకపెట్టి కూలబడ్డాడు.
    క్షణంలో ఊరంతా గుప్పుమంది, హరిదాసు ఎంకమ్మను తీసుకొని ఉడాయించాడన్న సంగతి.

 Previous Page Next Page