Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 26


    అంకెలు, గుర్తులు, సంకేత పదాలు, స్థలాలు, తారీఖులు.

    అతను చెబుతున్న వివరాలు ముఖ్యాతి ముఖ్యమైనవని తెలుసు మరిడేశ్వరరావుకి.

    చిత్రమేమిటంటే, దుర్గేష్ వ్యాపారం గురించిన ఈ వివరాలు చివరికి దుర్గేష్ కి కూడా తెలియవు.

    తనకి తెలిశాయి.

    అరగంట తిరిగేసరికి మరిడేశ్వరరావుకి పది కోట్ల రూపాయల విలువ చేసే సమాచారం దొరికింది.

    ఆ అరగంటలో దుర్గేష్ పది కోట్ల రూపాయలనీ, అంతకంటే విలువైన సహచరుడు ఎలెక్షన్ రెడ్డినీ పోగొట్టుకున్నాడు.

    సాధ్యమైనంత సమాచారం ఎలెక్షన్ రెడ్డి దగ్గరనుంచి పిండిన తరువాత అక్కడే వున్న ఒక ఎలక్ట్రిక్ రంపాన్ని అందుకున్నాడు మరిడేశ్వరరావు.

    లోహాన్ని కోయడానికి ఉపయోగిస్తారు ఆ రంపం. ఎలెక్షన్ రెడ్డి ఏడుస్తున్నాడు.

    ఎలెక్షన్ రెడ్డి మొహంలోకి ఒక్కసారి చూశాడు మరిడేశ్వరరావు. అతనికి దుర్గేష్ గుర్తొచ్చాడు. దుర్గేష్ చేతిలో దారుణమైన చావు చచ్చిన తన కొడుకు రాజు గుర్తొచ్చాడు.

    మరిడేశ్వరరావు మొహం కఠినంగా మారింది. నిర్దయగా స్విచ్ ఆన్ చేసి, రంపాన్ని ఎలెక్షన్ రెడ్డి మెడకి ఆనించి తీశాడు.

    ఎలెక్షన్ రెడ్డి పెట్టిన చావుకేక అతని గొంతులోనే ఆగిపోయింది.

    ఎర్రగా నవ్వుతున్నట్లు తెరుచుకుంది అతని గొంతు- గాయంతో.

    మళ్ళీ రంపం తాకించాడు మరిడేశ్వరరావు. కొద్ది క్షణాలపాటు అలాగే పట్టుకున్నాడు.

    ఎలెక్షన్ రెడ్డి తలనీ, మొండాన్నీ నీటుగా వేరుచేసింది రంపం.

    మొండాన్ని అక్కడే వదిలేసి, రెడ్డి తలని చేతితో పట్టుకున్నాడు యాది.

    మరిడేశ్వరరావు, యాది బయటికి వచ్చారు.

    మరిడేశ్వరరావుకి తెలుసు.

    కొన్నేళ్ళక్రితం రాధ, రాజుల చావుతో ప్రజ్వరిల్లిన వైరం మళ్ళీ ఇప్పుడు వెయ్యిరెట్లు ఎక్కువై పోతుంది ఎలెక్షన్ రెడ్డి చావుతో.

    భయంకరమైన గ్యాంగ్ వార్ త్వరలో తప్పదు.

    అందుకు తన గ్యాంగ్ రెడీగా ఉండాలి!

    ఇక్కడ ఇలా రౌడీగ్యాంగ్ ల మధ్య మళ్ళీ మారణహోమం మొదలవుతుండగా__

    అక్కడ__

    ఢిల్లీలో__

    ఇండియన్ ఎయిరులైన్స్ వారు బుక్ చేసిన రైలు టిక్కెట్లు తీసుకుని హైదరాబాద్ వెళ్లే రైలు ఎక్కారు- అఖిల్, సుధా, నవాబుగారూ, ఆయనగారి బేగం సాహెబ్.

    ప్రమాదాల్లోకి ప్రయాణం మొదలయ్యింది.

    పైలెట్ల స్ట్రయిక్ వల్ల ఢిల్లీలోనే ఉండిపోవలసి వచ్చిన ప్రయాణికులలో కొంతమందికి మర్నాడు హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ లో టిక్కెట్స్ బుక్ చేయగలిగింది ఇండియన్ ఎయిర్ లైన్స్.

    టిక్కెట్స్ దొరికిన వాళ్ళలో అఖిల్, సుధా, నవాబుగారూ, బేగం సాహెబ్ కూడా ఉన్నారు.

    అందరూ ప్రయాణానికి రెడీ అయ్యారు.

    ఆ టైమ్ కి ఒక్క సుధ మాత్రమే హాస్పిటల్లో ఉండిపోయింది. హాస్పిటల్ కి వెళితే ఇంక ఆమెకి మిగతా విషయాలు గుర్తుండవు.

    కిల్లర్ పాండు ఆమె పరిచర్యలలో కాస్త తేరుకున్నాడు. ఒక వారములో అతన్ని డిశ్చార్జి చేసెయ్యవచ్చని చెప్పింది డాక్టర్ సుధ. డిశ్చార్జ్ అయిపోయినా కూడా, అతను అనుభవించిన టార్చర్ తాలూకు ప్రభావం అతని మీద శాశ్వతంగా ఉండిపోతుందని తెలుసు సుధకి. ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక అతను సైకియాట్రిక్ ట్రీట్ మెంట్ తీసుకోవాలి. లేకపోతే సైకోగా మారతాడు అతను. అందులో సందేహం లేదు.

    కిల్లర్ పాండు మళ్ళీ ఇంకోసారి అతి స్పష్టంగా చెప్పాడు డాక్టర్ సుధకి.

    "డాక్టర్! నేను ప్రాణాలతో ఈ హాస్పిటల్ నుంచి బయటపడితే మాత్రం, ఆ అఖిల్ గాడి ప్రాణాలు తీసితీరుతాను" అని!

    మాట్లాడకుండా విని ఊరుకుంది సుధ.

    కిల్లర్ పాండుతో బాటూ కొన్ని ఎమర్జెన్సీ కేసులు కూడా అటెండ్ అయ్యింది తను. ఆలోగానే రెండుసార్లు ఫోన్ వచ్చింది. హోటల్ నుంచి ట్రైన్ కి టిక్కెట్స్ బుక్ అయిపోయాయి, వెంటనే రమ్మని!

    "వచ్చేస్తున్నాను" అని చెప్పింది సుధ రెండుసార్లు కూడా.

    కానీ పేషెంట్లని వదిలి వెళ్ళలేకపోయింది.

    మూడోసారి ఫోన్ రాలేదు. ఇండియన్ ఎయిర్ లైన్స్ వారి మినీబస్ వచ్చేసింది హాస్పిటల్ కి. దాదాపు చెయ్యిపట్టుకు లాక్కొస్తేగానీ బయటికి రాలేదు సుధ. అప్పటికే ట్రెయిన్ టైమ్ అయిపోయింది. మిగతా ప్రయాణికులంతా అసహనంగా ఉన్నారు. సుధ ఎక్కగానే స్టేషన్ వేపు దూసుకుపోయింది మినీ బస్. బస్సు స్టేషన్ లో ఆగీ ఆగగానే ప్రయాణికులందరూ ఆదరాబాదరాగా దిగి, ప్లాట్ ఫారం మీదికి పరుగులాంటి నడకతో చేరుకున్నారు. అప్పటికే ప్లాట్ ఫారం మీద ఉందా రైలు. బయలుదేరడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు కంపార్ట్ మెంట్ వెతుక్కుని ఎక్కేసరికి రైలు కూత పెట్టింది.

    అప్పుడు అంది బేగం సాహెబ్ గారు_

    "అయ్యో! నా మతిమండా! మంచినీళ్ళు తేవడం మర్చిపోయానే!" అంది తన వాటర్ బాటిల్ వేపు ఆదుర్దాగా చూసుకుంటూ.

    అది విన్నాడు అఖిల్. అట్టే ఆలోచించలేదు అతను. ఆ వాటర్ బాటిల్ అందుకున్నాడు.

    మరుక్షణంలో ప్లాట్ ఫారం మీద ఉన్నాడు అతను. ఆ తర్వాత క్షణంలో వాటర్ టాప్ వేపు పరిగెత్తాడు.

    ఈలోగానే రైలు కదిలింది. క్షణాల్లో వేగం అందుకుంది. అది చూస్తున్న సుధ పెదిమల మీదికి అప్రయత్నంగానే చిరునవ్వు వచ్చింది.

    అతనింక దిగబడిపోతాడు ఇక్కడే! అందులో సందేహం లేదు.

    రైలు స్పీడందుకుంది.

    అతను అందుకుని ఎక్కడం ఇంక ఇంపాజిబుల్!

    సెండాఫ్ యివ్వడానికి వస్తున్న వాళ్ళు ప్లాట్ ఫారం మీద నిలబడి చేతులు ఊపుతున్నారు. రైలు వేగం పెరుగుతోంది. ప్లాట్ ఫారం మీద ఉన్న స్టాల్సు వెనక్కెళ్ళిపోతున్నాయి. మనుషులు బ్లర్ అయిపోయి, అస్పష్టంగా కనబడటం మొదలెట్టారు.

    "అయ్యో! అనవసరంగా వెళ్ళాడే పిల్లగాడూ!" అంటోంది బేగం సాహెబ్ ఆదుర్దా, బాధ కలిసిన గొంతుతో.

    అసహనంగా చూస్తున్నాడు నవాబ్ సాబ్ ప్లాట్ ఫారం వేపు. అఖిల్ కనబడటంలేదు. తన సంతోషం మొహంలో కనబడిపోకుండా జాగ్రత్తపడుతోంది సుధ.

    ఇంతటితో వెధవ పీడ విరగడైపోయినట్లే.

    లేకపోతే, ఇతను కూడా హైదరాబాద్ దాకా తమతోనే వచ్చేవాడు. అలర్జీతో చచ్చిపోయేది తను.

    థాంక్ గాడ్! థాంక్ గాడ్!

    రైలు వేగం పెరుగుతూ ఉండడంతోబాటు కుదుపు పెరిగింది. కుదుపు తాలూకు శబ్దం కూడా మారింది.

    ప్లాట్ ఫారం దాటేసింది రైలు.

    అఖిల్ పీడ వదిలింది.

    వన్స్ ఎగెయిన్! థాంక్ గాడ్!

    సుధ అలా అనుకుంటున్న క్షణంలోనే అస్పష్టంగానే ఒక రూపం కనబడింది కంపార్ట్ మెంట్ కిందుగా, పరిగెడుతూ వస్తోంది ఆ ఆకారం. చూస్తుండగానే తలుపు దగ్గరికి వచ్చేసింది. చటుక్కున రైలు ఎక్కేసింది.

    మరుక్షణంలో కర్చీఫ్ తో మొహం తుడుచుకుంటూ వచ్చి, వాటర్ బాటిల్ బేగం గారికి అందించి, సీట్లో కూలబడ్డాడు అఖిల్. కూర్చుని అప్రయత్నంగానే సుధ మొహంలోకి చూశాడు.

    డల్ గా అయిపోయింది సుధ మొహం.

    సో! ఈ పీడ ఇప్పట్లో వదలదన్నమాట!

    అప్పుడామెకి మరో సంగతి తట్టింది.

    ఇతను ఇంత చిన్న కారణానికి ఇంత పెద్ద అడ్వెంచరు ఎందుకు చేశాడూ?

    వాటర్ కావాలంటే వచ్చే స్టేషన్ లో పట్టుకోవచ్చుగా!

    ఇంకెందుకు చేస్తాడూ అడ్వెంచరు!

    తనకి తెలుసు! రెచెడ్ మేల్ సైకాలజీ!

    ఈ సృష్టిలో మగజంతువులు ఆడజంతువులని ఆకర్షించడానికి ఇలాంటి వికారపు చేష్టలు అనేకం చేస్తూ వుంటాయి.

    ఇతనూ అదే సైకాలజీతో యిప్పుడు ఈ 'ఎగ్జిబిషన్ చేశాడేమో!'

    వెధవ గొప్ప!

    అసలే సీరియస్ గా ఉండే సుధ మొహం మరీ సీరియస్ గా అయిపోయింది.

    సరిగ్గా అప్పుడే అఖిల్ కూడా సుధ మొహంవేపు చూస్తూ అనుకున్నాడు. "చాలా అందగత్తేలే! అయితేనేం మొహం చూడు! ఎప్పుడూ తుమ్మల్లో పొద్దుగూకినట్లు ఏడుపు మొహం! మటమటలాడిపోతూ ఉంటుంది" అని.

    వాళ్ళు యిద్దరూ అలా ఎడమొహం, పెడమొహంగా చెరోవేపు చూస్తూ కూర్చుని ఉండటాన్ని మొదటగా గమనించాడు నవాబుసాబ్.

    చాలా జీవితం చూశాడాయన!

    చాలా విలాస పురుషుడు కూడా!

    భార్యతో గుసగుసగా అన్నాడు ఆయన. "వాళ్ళిద్దర్నీ చూశావా?"

    "చూస్తూనే ఉన్నాగా! ఏం?" అంది బేగంగారు.

    "నువ్వు చూసినా, చూడకపోయినా ఒకటే! సరిగ్గా చూడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు చాలాకాలం నుంచి తెలుసని నా ఉద్దేశ్యం"

    ఆయన మాటలు విని, కొద్ది క్షణాలు తర్వాత, యధాలాపంగా చూసినట్లు సుధ, అఖిల్ లవేపు చూసింది బేగంగారు.

    తర్వాత చిన్న గొంతుతో అంది నవాబుగారితో.

 Previous Page Next Page