'నన్ను నమ్మండి. నాపై భారం మోపండి. మీరు నిశ్చింతగా ఉండండి! అహల్య మీ కౌగిట్లోకి వచ్చే సుముహుర్తం కోసం నిరీక్షించండి. ఈలోగా మీ శచీదేవమ్మగారి మనస్సుని శాంత పర్చండి.'
నవ్వాడు ఇంద్రుడు.
'ప్రభువులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. తమరిని శచీదేవి మందిరానికి సాగనంపడానికి ఈ మాటలు చెప్పడం లేదు! మీరు అహల్యపై మనస్సు నిలిపి అన్నిటా అన్యమనస్కంగా ఉండటం చూసి భరించలేక నా దౌత్యంపై నాకు గల అచంచల విశ్వాసంతో చెప్పిన మాట అది!'
సంతృప్తిగా నవ్వాడు ఇంద్రుడు.
'ఇదిగో! ఈ పగడాల దండ బహుమతిగా పుచ్చుకో!'
ఇంద్రుడిచ్చిన పగడాల దండ మెడ నిండుగా అలంకరించుకుని అమరేంద్రుల ఆదరంతో లభించిన 'ఈ పగడాల దండ అహల్యని ఆకర్షించి తీరుతుంది. పగడాలకున్న శక్తి సామాన్యమా!' అంది చిరునవ్వుతో.
ఇంద్రుడు నవ్వుతూ మందిరం వైపు సాగేడు.
14
గౌతమాశ్రమంలో తొలిరేయిలాగే తొలి రోజులు చాలా హాయిగా, ప్రశాంతంగా గడిచిపోతున్నాయి.
అహల్య- భర్త గౌతములతో పాటే వేకువనే లేచి నదీ స్నానం కోసం ఆయన వెంట నడిచేది. శిష్య గణం వారిని అనుసరించేది. స్నానంతోపాటు అందరూ సంధ్యా వందనాదులు పూర్తి చేసుకునేవారు.
అహల్యకు సంధ్యావందనం వారం తిరక్కముందే స్వరయుక్తంగా వచ్చేసింది. గాయత్రి ఆవాహనలో ఆమె మనస్పూర్తిగా ధ్యానంలో మునిగిపోయేది. పరిసరాలు, ప్రకృతి మర్చిపోయేది.
ఆ రోజు అందరితోపాటే ఆమె కూడా నదీ స్నానానికి బయలుదేరింది. అందరూ సంకల్పసహితంగా స్నానం చేస్తున్నారు. స్నానానంతరం యధావిధిగా సంధ్యావందనాదికాలు పూర్తవుతున్నాయి. ఎవరికివారు వారి ఇష్ట దైవాన్ని, ఇష్ట మంత్రాన్ని ప్రార్ధించి జపిస్తున్నారు.
అప్పుడు వచ్చాడు విశ్వామిత్రుడు.
బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తానూ నదీ స్నానం చేసి, యధావిధిగా సంధ్యావందనాధికాలను పూర్తిచేసుకున్నాడు.
ఆపై- నదీ తీరం దాటి ఆశ్రమానికి వచ్చేదారిలో ఓ చెట్టు కింద వితర్ధిక మీద విశ్వామిత్రుడు ఆశీనుడైనాడు.
ఆయన పక్కనే గౌతములు అహల్య నిలుచునే ఉంది. ముని జనం శిష్యగణం అంతా ఆశ్రమానికి వెళ్ళిపోయారు.
విశ్వామిత్రుడు నవ్వుతూ అన్నాడు. 'సరస్వతీ పుత్రిక అయినా, పరమేష్టి మానసపుత్రిక అయినా గురు ముఖతః చదవందే చదువు రాదన్న మాట బాగా రుజువైంది గౌతమా! తమరు అహల్యకు అక్షర స్వీకారం జరిపించి చక్కని పనిచేశారు. ఆడవారూ చదువుకుని విద్యావంతులు కావాలయ్యా! అప్పుడే సమాజం చక్కగా ఉంటుంది.'
గుతములు చిరునవ్వు నవ్వారు.
'అర్ధాంగి అనే పదానికి సరైన అర్ధం తిరిగి నిరూపించాలనేది నా సంకల్పం మహర్షీ! నిజానికి ఈ చరాచర సృష్టిలో అర్ధాంగి అనే పదానికి సరైన అర్ధం ఆ సర్వమంగళ ఒక్కరే! పరమేశ్వరుడిలా అన్నీ సగం సగం పంచి ఇచ్చి అర్ధ దేహమిచ్చి అర్ధాంగిని చేసుకున్న వారింకెవరున్నారు?'
'మంచి మాట!' తృప్తిగా అన్నాడు విశ్వామిత్రుడు. భార్య కూడా భర్తతో సమానమే. భర్త అంటే భరించేవాడు కదా! వైవాహికంగానే కాక అముష్మికంగా భరించేవాడని కదా పరమార్ధం. భార్య అంటే భరించేది. భర్త సంతానాన్ని గర్భంలో ధరించి భరించడమే కాదు. అతని కీర్తిని, అపకీర్తిని కూడా భరించేది అని పరమార్ధం. సహధర్మచారిణి సర్వవిధాలా భర్తకు తులతూగాలి. అప్పుడే ఆ జంట ఆదర్శ ప్రాయమౌతుంది.
విశ్వామిత్రుల వారి అభిప్రాయం విని గౌతములు తలూపారు.
'గౌతమ మహర్షి! తమరు అహల్యకు సంధ్యావందనం ఉపదేశించారు. వేదాలు పలికిస్తున్నారు. న్యాయ సూత్రాలు పఠింపజేస్తున్నారు. ఆమె వైదుష్యం మరింత జ్వాజ్వల్యమానం కావటానికి ఆమెకు నేను గాయత్రీ ఉపదేశిస్తాను. సంధ్యావందనాంగంగా ఆమెకి తమరు గాయత్రీ ఉపదేశించడం వేరు. నా మంత్రోపదేశం వేరు కదా!'
'నిస్సందేహంగా మహర్షీ!' అన్నాడు గౌతముడు. తమరు గాయత్రీ మంత్ర ద్రష్టలు! గాయత్రీ రూప కల్పనను దర్శించిన మహర్షులు! లోకానికంతా గాయంత్రిని పరిచయం చేసిన ధన్యులు. తమరి ద్వారా అహల్యకు ఆ మంత్రోపదేశం జరగడం అద్భుతం!'
విశ్వామిత్రుడు అహల్యవైపు చూశాడు.
ఆమె వచ్చి పునః ప్రమాణాలు సమర్పించింది.
విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రాన్ని ముమ్మారు పలికించారు. నేత్ర నిమీలితయై మంత్రోపదేశం పొందుతున్న అహల్యకు సాక్షాత్తూ గాయత్రీమాత కనిపించింది. విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు.
'మహర్షీ! ఇన్నాళ్ళూ గాయత్రీమాత ఆవాహనలో ధ్యాన శ్లోకం పఠించే సమయంలో శ్లోకంలో వర్ణించిన మూర్తి కనిపించేది. అమ్మ కనిపించినంత ఆనందం కలిగేది. పంచముఖాలతో, పంచ వర్ణాలతో దర్శనమిచ్చినట్లు భాసించేది. కానీ ఈనాడు సాక్షాత్కారం కలిగింది.'
అహల్య మాటలు విని విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు.