నీవూ పెద్దవాళ్లకి మాట యిచ్చి వుండవచ్చు. మాట తప్పితే నీ పరువుకు హాని కలుగుతుంది నిజం.
కానీ అన్నయ్యా నేను మాట తప్పితే మన కుటుంబం పరువు మర్యాదలు పోవటం మాత్రమే కాదు రెండు, మూడు జీవితాలు నాశనం అవుతాయ్.
"ఆలోచించి నీ యిష్ట ప్రకారం చెయ్" నిదానంగా నిజాన్ని ఓర్పుతో తెలియ జేశాడు గోపి.
ముందు కాళ్లకి బంధం వేసినట్లుగా అయింది రమణయ్యకి.
"ఏమండీ !"
సరోజ పిలుపు అమృత ప్రాయంగా వినిపించింది అతనికి.
"ఎవరికో మాట ఇచ్చామని గోపీ మనస్సు గాయపరుస్తారా? మీకు తమ్ముడి కంటే ఎక్కువా వాళ్లు? గోపీ ఇష్టప్రకారం రాధతో పెళ్ళి చేయండి. ముందు నుంచీ మీరు ఎవరితో కలిసి తిరిగేవాళ్లు కాదు. మీరెంతో మీ లోకమేమిటో అంతే! ఆ పరంధామయ్య గారితో మీకేమిటి? ఆ చంద్రయ్యతో మన కేమిటిలే అసలు. ఆరోజే నేను అన్నాను. ఆలోచించి చెప్పండని. వాళ్ళు పెట్టిన ఊదరలో మీరు మాట ఇచ్చేశారు. ఏం మించిపోయింది, ఇది సంగతి అని చెప్పండి పరంధామయ్యగారు అంత పట్టుబట్టే మూర్ఖులు కారు."
భార్య మాటలు నచ్చాయి అతనికి.
గోపీ కూడా సమర్ధించాడు ఒదిన్ని.
అప్పటి కప్పుడు బయలుదేరాడు రమణయ్య.
"మీతో ఏది వచ్చినా చిక్కే. ఏంమంత కొంప మునిగి పోతోందని యిప్పుడు వెళ్ళాలి? అసలు వెళ్ళటం ఎందుకు? ఓ ఉత్తరం ముక్క రాస్తే సరిపోదూ" అంది సరోజ.
"ఛ! ఛ! పెద్దమనిషి ఆయన, ఆయనకు తగినట్టుగా ప్రవర్తించాలి. ఇప్పుడేం అవుతుంది. మళ్ళీ ఉదయాని కల్లా తిరిగి వస్తానుగా" అని బయలుదేరాడు రమణయ్య.
రమణయ్యని చూడగానే ఆదరంగా ఆహ్వానించాడు పరంధామయ్య.
కుశలప్రశ్నలు అవీ అయ్యాక కబుర్లలో పడ్డారు. ఎలా కదపటమా అన్న ఆలోచనలో ఉన్నాడు రమణయ్య.
అంతలో భోజనాల వేల కావటంతో వెళ్ళి భోజనం చేశారు. భోజనం సమయంలో అసలు మాట్లాడే అవకాశమే దొరకలేదు. పరంధామయ్యగారు భోజన సమయంలో మౌనవ్రతం పాటిస్తారు.
ఇద్దరికీ మేడపై మంచాలు వేయించారు పరంధామయ్యగారు.
వెళ్ళి పడుకుని తిరిగి కబుర్లలో పడ్డారు.
ప్రస్తావనగా 'గోపీ వచ్చాడా?' అని అడిగారాయన.
అదే సందర్భం అనుకుని విషయం అంతా వివరించి, ఆ సంబంధం తప్పి పోతున్నందుకు తనెంత విచారిస్తున్నదీ, పెద్దవాళ్ళకిచ్చిన మాట నిలుపుకోలేనందుకు తానెంత బాధపడుతున్నదీ వివరించి చెప్పాడు రమణయ్య.
అతను చెపుతూ ఉన్నంతసేపూ ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్లుగా ఉండింది. ఆయనకి కానీ అనుభవం నేర్పిన పాఠాలెన్నో నేర్చుకున్న వాడు కాబట్టి స్థిమితం చెడలేదు.
"పోనీలే రమణా! నీతో వియ్యమందే అదృష్టం నాకు లేదు. ముందుజాగ్రత్త గలవాడివీ, అనుభవం గలవాడివీ అయిన నీ అజమాయిషిలో యీ పొలం యీ కుటుంబం బాగుపడుతుందనీ, అమ్మాయి జీవితం సుఖంగా సాగిపోతుందని ఆశపడ్డాను, కానీ ఎవరికెంత ప్రాప్తమో అంతే!" అన్నాడు.
"నన్ను మనసారా మన్నించామంటే తప్పానాకు మనశ్శాంతి వుండదు అన్నాడు రమణయ్య.
"ప్రాప్తం ఉండివుంటే తప్పిపోయేది కాదు. లేని దానికి వగపెందుకు. ఇందులో నీ తప్పేం ఉంది బాబు. భగవంతుడు రాసిపెట్టద్దు" అన్నాడు.
ఆయన ఎంత ఉదారబుద్ధితో, విశాల హృదయంతో అన్నా రమణయ్యకి ఆ రాత్రి మనస్సంతా ఆందోళనగానే ఉండి సరిగా నిద్రపట్టలేదు, వేకువనే లేచి సెలవుతీసుకుని వచ్చాడు.
చంద్రయ్యతో ఆ విషయం చెప్పే బాధ్యత రమణయ్య మీదే వేశాడు పరంధామయ్య.
ఇంటికి వచ్చి విషయం చెప్పగానే అంత సులభంగా సమస్య పరిష్కారమైనందుకు సరోజ చాలా సంతోషించింది, గోపీకి పట్టరాని అనందం కలిగింది.
కానీ రమణయ్య మనస్సులోనే సంకోచం వదల్లేదు, చంద్రయ్యకీ విషయం తెలపటం ఎలాగా అని ఆలోచించసాగాడు. తెలిపాక చంద్రయ్య ఏమంటాడో ఎలా ప్రవర్తిస్తాడో అన్నది కూడా అతనికి విచారంగానే వుంది.
ఆ రోజల్లా అతను చికాకుగానే గడిపాడు.
* * *
"శ్రీనివాసులూ!"
"చెప్పండి మామా! ఏం చెయ్యమంటావు? కొండల్ని పిండి కొట్టమంటావా? సముద్రాల్ని యింకించమంటావా? గాలిని స్తంభింప జేయమంటావా? భూమిని బద్దలు కొట్టమంటావా?"
ఆ ఊళ్ళో ఉన్న రౌడీ గాంగ్ కి రింగ్ లీడర్ శ్రీనివాసులు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజధానిలో ఉంటాడు. గవర్నరూ అక్కడే ఉంటాడు. వీళ్ళిద్దరి అధికారాలూ ఆ ఊళ్ళో శ్రీనివాసులు ద్వారా చెల్లుబడి అవుతున్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వం వారి శాసనాలు కాదు చెల్లేది అక్కడ శ్రీనివాసులు ఆజ్ఞ!
"అంత అవసరం లేదు శీనూ! పగ! పగ తీరాలి, నామాటని నిర్లక్ష్యం చేసి, నాకు ఎదురు తీర్చి నా పరువు మర్యాదని లెక్కించకుండా వ్యవహరించిన ఆ తొత్తుకి బుద్ధిచెప్పాలి. నేనంటే ఏమిటో నా పగ అంటే ఏమిటో తెలియాలి వాడికి."
"ఇంతకూ ఎవడు మావా వాడు?"
వరసైన వాళ్ళందర్నీ మామా అనీ, బావా అనీ, బాబాయ్ అనీ, అన్నా అనీ పిలుస్తాడు శ్రీనివాసులు. అతనికి కులంతో నిమిత్తం లేదు. వయసుతో సంబంధం కాదు.
"ఎవడున్నాడింక. ఆ రమణయ్యగాడు" కసిగా అన్నాడు చంద్రయ్య.
"ఏం చేశాడు? ఏం చేయాలి? అనేవి నాకక్కర్లేదు మామా! నీ పగ తీరుస్తాను, జన్మలో మరిచిపోలేనట్లుగా శిక్ష వేస్తాను, నీ వంటే ఏమిటో నీ పగంటే ఏమిటో తెలిసేలా చేస్తాను. జన్మ జన్మలకి నీ విరోధి వర్గంలో ఉండకూడదనీ, నీ మాటకు వ్యతిరేకంగా నడుచుకో కూడదనీ అనుకునేలా చేస్తాను" అన్నాడు శ్రీనివాసులు.
"కరెక్ట్! నీవు అంతటి మనిషివని తెలుసు. నీ సత్తా తెలుసు. పని నెరవేర్చు, ఇదిగో అయిదువేలు. పని పూర్తయ్యాక మరో అయిదు వేలు తీసుకో. ఇది మా తండ్రి తాతలు సంపాదించిన పొలం అమ్మి తెచ్చిన డబ్బు అని గుర్తుంచుకో- ఆషామాషీగా సంపాదించింది కాదు, అన్యాయంగా ఆర్జించింది కాదు" అన్నాడు చంద్రయ్య.
ఆ డబ్బు అందుకుని "చూస్తారుగా" అని వెళ్ళిపోయాడతడు.
"హుఁ ఈ చంద్రయ్యతోనా పోటీ" అనుకున్నాడతను.
* * *
ఇక ఆలసిస్తే ఏం జరుగుతుందో అన్నట్టుగా రాధ అడ్రసు తెలుసుకుని ఆ ఊరు వెళ్ళాడు రమణయ్య.
రాధ తండ్రి తహసీలుదారుగా పనిచేస్తూ హఠాత్తుగా గుండె జబ్బుతో పోయాడు. రాధకి వెనకా ముందు ఎవరూ లేరు. తల్లి ఒక్కతే తండ్రీ, అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి అయి పెంచుతోంది రాధని.
కూతురుని బాగా చదివించాలనే పట్టుదలతో రాధని క్రమశిక్షణలో పెంచింది ఆమె. ఒక్క మాటైనా శత్రువైనా వేలెత్తి చూపించలేని గుణశీలవతి రాధ.
ఆ ఇంటినీ, ఆ విషయాన్నీ ఆకళింపు చేసుకున్న రమణయ్యకి గోపీ రాధని ఎన్నిక చేసుకోవటంలో తప్పు చేయలేదనిపించింది.
"తను ఎవరో చెప్పుకున్నాక రమణయ్య ఎవరో తెలిసొచ్చింది రాధకి. సంతోషంతొ గౌరవించి, తల్లికి పరిచయం చేసింది రాధ.
రాధ, తల్లి అనసూయ పెళ్ళి సంబంధం విషయం విని చాలా ఆనందించింది. వెంటనే ముహుర్తాలు చూసి పెళ్ళి చేసి వచ్చే సంవత్సరం విశాఖపట్టణంలో కాపురం పెట్టి చదివించాలన్న రమణయ్య మాటల్ని ఆమోదించింది ఆమె. తనకున్న ఆస్థి అలా డబ్బురూపంలోనే ఉండటంతోనూ, బంధువులనే వాళ్ళు ఎవరూ లేకపోవటంతోనూ ఆ ఊరు వదలటానికి ఆమెకేం అభ్యంతరం కనిపించలేదు.
ముహుర్తాలు నిశ్చయించుకుని వచ్చేశాడు రమణయ్య.
* * *
పొలంలో దమ్ముచేస్తూ ఊడవటంతొ రమణయ్య పొలంలో ఉన్నాడు. ఇంట్లో పని ముగించుకుని భర్తకని అన్నం తీసుకుని బయల్దేరింది సరోజ. కొడుకుని ఇంటివద్దే వుంచి, పక్కింటి ముసలమ్మని చూస్తూ వుండమని వెళ్ళిపోయిందామె.
ముసలమ్మని బురిడీ కొట్టించి బజార్లో ఆడుకుంటున్నాడు బాబు.
వీధి మలుపు తిరిగి ట్రాక్టరు నడిపించుకుంటూ వస్తున్నాడు శ్రీనివాసులు.
దడ దడ శబ్దం చేసుకుంటూ వస్తున్న ట్రాక్టర్ని చూసి ఆనందంతో కేకలు వేశాడు బాబు.
ట్రాక్టర్ని ఆపాడు శ్రీనివాసులు. బుద్ధి తెలియని కుర్రవాడు కాస్తా అడ్డంగా వస్తే ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో.
"మామా"