"ముందు శివాలయం బాగు చేయించండి. శివరాత్రి దగ్గిరపడింది. ఆ రోజుకి గుడి తయారు చేయించండి" రాజేశ్వరి అంది. ఉగాది వేళకి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తయారుచేయించవచ్చు.
ఆ సలహా నచ్చింది ఆయనకీ. రంగా తీసుకువచ్చిన మేస్త్రికి ముందు ఎక్కడ గోడలు బీటలు వేశాయో, ఎక్కడ గచ్చులు పోయాయో సిమెంట్ పని పురమాయించారు. ముందు ఆవర్ణ, ప్రహరీగోడ అయ్యాక గర్భగుడి, ఆలయం లోపల చేయించాలని సంకల్పించారు.
గర్భగుడి లోపల అభిషేకాలు జరుగుతుంటాయి. కొబ్బరికాయలు కొట్టి అభిషేకాలు చేస్తుంటారేమో నేలంతా పాకుడు కట్టి వుంది. గోడలు అన్నీ మసిబారి వెలుతురన్నది లేదు. గర్భగుడిలో పని చేయించడానికి పూజారి అభ్యంతరం చెపుతాడేమో, ఎవరిని పడితే వారిని లోపలికి రానీయరేమో... ఆయననుకున్నట్టే... "అపచారం, అనాచారం గర్భగుడిలో ఎవరూ అక్కరలేదు. నేను శుభ్రం చేయిస్తాలెండి" అన్నాడు పూజారి.
"మీ ఒక్కరివల్ల ఏం అవుతుంది స్వామీ. యింత పాకుడు అదీ గీకాలి. గోడలకి నాలుగయిదు కోటింగులయినా సున్నం వేయాలి. యీ దీపం సెమ్మీలు, పళ్ళాలు యివన్నీ ఎలా జిడ్డు, చిలుము పట్టాయో.
"తోమిస్తాలెండి బాబూ. మా ఆడవాళ్లచేత తోమిస్తాలెండి. ముందు బయటపనంతా కానీండి." ఆ మాటతో ఆయనకి గర్భగుడిలోకి అందరినీ రానీయడం ఇష్టంలేదన్నది అర్థం అయింది.
"గర్భగుడిలో సున్నాలు వెయ్యొద్దా మరి..." కేశవరావుగారు సందేహంగా అడిగారు.
"ఏమిటి కూలీ వాళ్ళచేత వేయిస్తానంటారా బాబూ..." ఆశ్చర్యంగా అడిగాడు.
"మరి ఎవరు వేస్తారు?"
"బాబూ, మీరే చెప్పండి. గర్భగుడిలోకి మాత్రం ఎవరిని పడితే వారిని రానీయొద్దు. అంతగా అయితే నేను వేస్తానులెండి సున్నం" కాస్త మొహం ముడుచుకున్నాడు అర్చకుడు.
ఆయన ఛాదస్తం అర్థమయింది కేశవరావుగారికి. అష్టాదివర్ణాలకి ఆలయప్రవేశం గాంధీగారు కలిగించారు. కానీ మరి గర్భగుడిలోకి అర్చకులకు మాత్రమే ప్రవేశార్హత వున్నట్టుంది. ఆ విషయం ఆయనకీ తెలీదు. ఇంక అందుకే పెద్దాయనతో వాదన పెట్టుకోకుండా "సర్లేండి. ముందు బయటపని అవనీండి. శివరాత్రికి ముందు పని అవ్వాలని నా ఆరాటం."
"అలాగే బాబూ చేయించేద్దాం." అభయం యిచ్చినట్టు అన్నాడు.
దారిలో వస్తుంటే రంగా ఎదురొచ్చాడు. "మామయ్యా- ఊరిలో కుర్రాళ్ళు అంతా గుడి మేం శుభ్రంచేసి సున్నాలు, రంగులు వేసేస్తాం అని ఉత్సాహం చూపుతున్నారు. సిమెంటు పని కాగానే వాళ్లే రంగులు వేస్తాం అంటున్నారు."
మంచిదే. 'జన్మభూమి' కార్యక్రమం ఆలయంతోటే ప్రారంభం అన్నమాట. సరే శుభం అందాం మనం" కేశవరావు ఉత్సాహంగా అన్నాడు.
ఇంటికెళ్లగానే తన సందేహం రాజేశ్వరి ముందు బయటపెట్టాడు. ఆవిడకీ జవాబు తెలియదు. "ఏమో నాకు మాత్రం తెలుసా. యేం రంగా నీకు తెలుసా-" ఆవిడ రంగాని అడిగింది.
"యేమో అత్తయ్యా. ఏదో దేవాలయంకి వెళ్లడం, పూజారిచ్చిన తీర్ధప్రసాదం పుచ్చుకోవడం తప్ప అంత లోతుగా ఎప్పుడు పరిశీలించాం. వెళ్ళకూడదనుకుంటాను, అది అర్చకుల వారి హక్కు అనుకుంటాను" అన్నాడు రంగా.
"కానీ కొన్ని శివాలయాలలో లింగానికి ఎవరంతట వారు అభిషేకం చేసుకుంటారే. అన్నట్లు అంతదాకా ఎందుకు కాశీలో విశ్వేశ్వరుడు ఆలయంలో అంతేగదా. అందరూ లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేస్తారుగా" ఆయన సందేహంగా అన్నాడు. రంగా, రాజేశ్వరి అవునన్నట్లు తల ఆడించారు.
"పాపం శివుడు బోలాశంకరుడు. ఎలా పడితే అలా సర్దుకుపోతాడు. వైష్ణవ దేవాలయాల్లో యీ పట్టింపులు ఎక్కువ అనుకుంటాను. నైవేద్యం పెడుతున్నప్పుడు కూడా ఎవరూ చూడకుండా పరదా వేస్తారు. శివాలయాల్లో లోపలికి వెళ్ళి అభిషేకాలు చేయడం చూశాం కాని వైష్ణవాలయాల్లో గర్భగుడిలోకి ఎవరూ వెళ్ళడం చూడలేదు" రాజేశ్వరి అంది.
"అనవసరంగా ఈ విషయం బయటికి మాట్లాడి ఇష్యు చేయకండి. పాపం ముసలాయన. ఆయన చాదస్తం ఆయనకుంటుంది. ఆయనే చూసుకుంటారులెండి. మనం మాట్లాడొద్దు. బయట అనొద్దు. గొడవలొస్తాయి అనవసరంగా."
"అంతేగాదు అవసరం అయితే నేను, మాష్టారి గారి అబ్బాయి సాయం చేస్తాంలే. ఈ కులాలు పట్టింపులు రోజురోజుకి తగ్గడం అటుంచి ఎక్కువవుతున్నాయి. మా చిన్నతనంలో శాఖాహారులు అంటే బ్రాహ్మణులు అని, మాంసాహారుల వర్ణం అంతా ఓ కులం అన్నట్లుండేది. యిప్పుడు కమ్మ, రెడ్డి, నాయుడు, కాపు, మాల, మాదిగ ఎన్నిరకాలు అయిపోయాయి. ఎవరికివారే ఎక్కువ, రెండోవారు తక్కువ అన్నట్లు ఎన్ని కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోయాయి.
మోడర్న్ అంతా మాటల్లో, దుస్తుల్లో తప్ప ఈ కులాలు, జాతులు, మతాలు యివన్నీ ఎవరూ వదలకపోగా రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయనిపిస్తుంది. ఇంత చిన్న వూరిలో కూడా ఎన్ని గ్రూపులో తెలుసా మామయ్యా. కాపులు, రెడ్లు, నాయుడులు ఎవరి గ్రూపులు వారికున్నాయి తెలుసా."
"డబ్బును బట్టి కులం ఎక్కువ, తక్కువలనుకుంటాను. ఎవరినో అనడం ఎందుకు ప్రభుత్వం ప్రతి దరఖాస్తులో కులం అడుగుతుంది ఇంకా" కేశవరావు అన్నాడు.
శివరాత్రి రెండు రోజులుందనగా ఆలయం పని పూర్తయింది.
ఆలయ ప్రాంగణం అంతా కళకళలాడిపోయింది. గోడలు బీటలు పోయాయి. గోబిరంగు, మధ్య తోపురంగు దారాలతో ప్రహరీగోడ ముస్తాబయి వుంది. తోపు రంగు ఆలయానికి, లోపల అంతా తెలుగు రంగు, ఆలయ గ్రిల్ కి, తలుపులకి పెయింట్ వేశారు. గర్భగుడిలో జిడ్డు అంతా రెండురోజులు సోడాలు వేసి కడిగారు అర్చకుల వారి కుటుంబసభ్యులు. ఆడవాళ్ళంతా యిత్తడి సామానంతా తళతళలాడేట్టు తోమారు. ఆడపిల్లలంతా ఆలయ ప్రాగణం అంతా రంగుల పెయింట్లతో చుక్కలు ముగ్గులు వేశారు. గడపలకి పసుపు రంగు, రంగుల బొట్లు పెట్టారు.
శివరాత్రినాడు ఊరు ఊరంతా ఆలయానికి తరలివచ్చింది. పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
"యిన్నాళ్ళకి మీ దయవల్ల ఈ గుడికి పూర్వవైభవం వచ్చింది బాబూ." పూజారిగారి కళ్ళు చమర్చాయి. వూరిలో అంతా సంబరంగా ఆలయం అంతా తిరిగి చూశారు.
"అలా అనకండి. నేను ముందున్నాను. చేయాల్సింది అంతా వూరిలో పిల్లలే చేశారు"
కేశవరావు పిల్లల్ని మెచ్చుకుంటూ అన్నారు.
"డబ్బు ఖర్చు మీదేగా-"
"ఆ ప్రసక్తి వద్దు దేముడి సమక్షంలో" వాదించారు కేశవరావు.
ఆ రాత్రి ఆలయంలో జాగరణ, భజన, పురాణ కాలక్షేపం ఏర్పాటుచేశారు. రాజేశ్వరి, సుగుణ ఉపవాసమున్నారు రోజంతా. కేశవరావు ఎప్పుడూ వుండని ఆయన నేనూ వుండనేమిటి ఉపవాసం, మీరంతా వున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు సరదాగా వుంది.